సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగులు పెడుతున్నాయి. తొమ్మిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న ప్రత్యేక సంస్కరణలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు సుభిక్షంగా మారుతున్నాయి. ప్రత్యేక జిల్లాలు, మండలాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామపంచాయతీల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. తండాలను కొత్త జీపీలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులతో అన్ని వసతులు కల్పించడంతో గిరిజనుల కష్టాలు తీరాయి. ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల్లో సకల సౌకర్యాలు సమకూరాయి. ‘పల్లె ప్రగతి’ పనులతో గ్రామాలన్నీ డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, కంపోస్టు షెడ్లు వంటి మౌలిక వసతులతో కళకళలాడుతున్నాయి. ఎన్నో ఏండ్ల భూ సమస్యలకు ధరణి పోర్టల్తో శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. అదనంగా పైసా ఖర్చులేకుండా నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతున్నది. ఇరిగేషన్, ఆర్అండ్బీ, విద్యుత్తు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పునర్వ్యవస్థీకరణతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి. అధునాతన సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇలా సీఎం కేసీఆర్ పాలనలో చంటిబిడ్డ నుంచి పండు ముసలొళ్ల వరకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతున్నాయి. కాగా, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది.
-రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పాలన సంస్కరణలతో జిల్లా ప్రజలకు పాలన చేరువైంది. పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతన జిల్లా ఏర్పాటు, రెవెన్యూ డివిజన్, మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల ఏర్పాటుతోపాటు పలు శాఖల పునర్ వ్యవస్థీకరణతో జిల్లా ప్రజానీకానికి ఎంతో మేలు జరిగింది. ఈ ప్రాంత ప్రజల ఎన్నే ఏండ్ల కల వికారాబాద్ జిల్లా ఏర్పాటు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోని వికారాబాద్ ప్రాంతం జిల్లాగా ఏర్పాటైన అనంతరం జిల్లా అంతటా ఎంతో ప్రగతి జరిగింది.
వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనంతరం పలు మండలాల ప్రజలు ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్తోపాటు 17 మండలాలతో ఏర్పాటైన వికారాబాద్ జిల్లాలో తదనంతరం కోట్పల్లి, దుద్యాల, చౌడాపూర్ మండలాలను ఏర్పాటు చేయడంతో జిల్లాలో మండలాల సంఖ్య 20కి చేరింది. గతంలో కేవలం వికారాబాద్ రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉండి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో పాలన కొనసాగగా, జిల్లా ఏర్పాటు అనంతరం తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, కొడంగల్, బొంరాసుపేట, దౌల్తాబాద్ మండలాలతో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా ప్రజలకు పారదర్శక, ఆన్లైన్ సేవలందించేందుకుగాను దేశంలోనే మొదటి సారిగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు గతంలో డివిజన్ స్థాయి అధికారుల స్థాయి వరకే ఉండగా ఇరిగేషన్, ఆర్అండ్బీ, విద్యుత్తు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పునర్వ్యవస్థీకరణతో ప్రజలకు ఈఈ, ఎస్ఈ స్థాయి అధికారులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
చిన్న జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజల ముంగిటకు చేరింది. జిల్లా ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించాలంటే కేవలం సోమవారం ప్రజావాణి వేదికగానే వీలయ్యేది. చిన్న జిల్లాలను ఏర్పాటు చేసిన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో అధిక సమయం కేటాయించేలా ప్రభుత్వం సరికొత్త అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నది. కలెక్టర్తోపాటు మరో ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించడంతో ప్రజలు నేరుగా వెళ్లి తమ సమస్యలను తెలుపుతున్నారు. కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు ప్రతీరోజు ఏదో కార్యక్రమం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటన తప్పనిసరిగా మారింది. ఉమ్మడి జిల్లాలో బషీరాబాద్ మండల ప్రజలు కలెక్టరేట్కు వెళ్లి తమ సమస్యను విన్నవించి తిరిగి వెళ్లేందుకు ఒకరోజు సమయం పట్టేది. ప్రస్తుతం అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటుండడంతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతున్నది. రూ.42 కోట్లతో జిల్లా కేంద్రంలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధరణి పోర్టల్తో జిల్లా రైతాంగానికి పారదర్శకంగా సేవలందుతున్నాయి. ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి డబ్బుతోపాటు సమయం ఆదా అవుతున్నది. గతంలో మాదిరిగా కాకుండా ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ దరఖాస్తు వచ్చిన ఎప్పటికప్పుడు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరిస్తున్నది. ధరణి పోర్టల్తో మ్యుటేషన్స్, సక్సెషన్స్, ప్రొహిబిటెడ్, జీపీఏ తదితరాలకు సంబంధించి జిల్లాలో 75 వేలకుపైగా దరఖాస్తులు రాగా, వీటిలో 90 శాతం దరఖాస్తులను జిల్లా యంత్రాంగం పరిష్కరించింది. ఆయా ప్రాంతాలను బట్టి పోర్టల్లోనే స్టాంప్ డ్యూటీ ధరలు చూపిస్తుండడంతో డాక్యుమెంట్ రైటర్స్ కానీ, మీసేవ నిర్వహకులుగాని అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. గతంలో మాదిరిగా మారుమూల గ్రామం నుంచి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సక్సెషన్, పార్టీషన్ సేవలకై పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లోనే సేవలు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా రోజుల తరబడి తిరగాల్సిన పని లేకుండా త్వరగా పూర్తవుతుంది. గతంలో వారసత్వంగా వచ్చే భూములను వారసుల పేరిట మార్చేందుకు రైతులు ఏండ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. 45 రోజుల్లో పూర్తి చేయాల్సిన వారసత్వ రిజిస్ట్రేషన్ను సంవత్సరాలు గడిచినా పూర్తయ్యేది కాదు. ప్రస్తుతం రైతులకు ఈ బాధలన్నీ తప్పాయి. వారసత్వ రిజిస్ట్రేషన్కై పట్టాదారు పాసు పుస్తకం, పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులతో మీ సేవలో స్లాట్ బుక్ చేసిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్కు పూర్తి కావడంతోపాటు కుటుంబ సభ్యుల పేరిట వెంటనే కొత్త పట్టాదారు పాసు పుస్తకం జారీ కావడంతోపాటు ఒరిజినల్ పట్టాదారు పాసు పుస్తకం నేరుగా రైతుల ఇంటికే అందిస్తున్నారు. స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు ధరణి పోర్టల్ ద్వారానే ప్రక్రియ జరుగుతుండడంతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది.
పరిపాలన సంస్కరణల్లో భాగంగా జిల్లాలో నూతన 143 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. వీటిలో 84 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని గిరిజన తండాలు, అనుబంధ గ్రామాల్లో ప్రస్తుతం అభివృద్ధి పరుగులు పెడుతున్నది. అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న గిరిజన తండాలతోపాటు అనుబంధ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకుగాను సీఎం కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన తండాలకు, అనుబంధ గ్రామాలకు మంచి రోజులొచ్చాయి. కేవలం రెండేండ్లలోనే పాత పంచాయతీలకు దీటుగా కొత్త పంచాయతీల్లో అభివృద్ధి జరగడం గమనార్హం. గతంలో తండాలతోపాటు అనుబంధ గ్రామాల్లో పైసా అభివృద్ధి కూడా జరిగే పరిస్థితి ఉండేది కాదు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేరు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్కో సమస్యపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణకు నిర్ణయించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. గిరిజన తండాలు, అనుబంధ గ్రామాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఏ మాత్రం భేదం లేకుండా పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నెలకు జిల్లాలోని గ్రామ పంచాయతీలన్నింటికీ కలిపి రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ఒకప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడిన తండాలు, అనుబంధ గ్రామాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. గతంలో పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసే నిధులన్నింటినీ కేవలం గ్రామ పంచాయతీల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేసేవారు. అనుబంధ గ్రామాలైన తండాలకు ఒక్కపైసా కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉండేది. గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన అనంతరం గతంలో ఉన్న గ్రామపంచాయతీలుగా పోటీగా అభివృద్ధిలోకి వచ్చాయి. తండాలకే పాలన బాధ్యతలు రావడంతో తండాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.