తుర్కయాంజాల్, జనవరి 6 : రాష్ట్రంలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో సైతం అవిశ్వాసం అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా కౌన్సిలర్లు చైర్మన్లు, చైర్పర్సన్లపై తిరుగుబావుటా ఎగరవేస్తారు. కాని అందుకు పూర్తి భిన్నంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో వైస్ చైర్పర్సన్ అవిశ్వాస అంశం తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీకి చెంది న హరిత కొనసాగుతున్నారు. అయితే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షురా లు, కౌన్సిలర్ మంగమ్మ కొంతమంది కౌన్సిలర్లతో కలిసి సమావేశమయ్యారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా తనను ఎన్నుకోవాలని.. అందుకు అందరి మద్దతు తనకు కావాల్సిందిగా కోరినట్లు సమాచారం. అందుకు కౌన్సిలర్లు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
వైస్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెడుతున్నారనే ఆంశం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో శనివారం వైస్ చైర్పర్సన్ హరిత మున్సిపాలిటీ పరిధి తొర్రూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలే తనపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లతో సమావేశం అవడం దారుణమన్నారు. కౌన్సిలర్ల మద్దతు తనకే ఉందని, మరో సంవత్సరం వైస్ చైర్పర్సన్గా కొనసాగుతానని తెలిపారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సాక్షిగా విభేదాలు భగ్గుమన్నాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కార్యాలయంలో ఉన్నా తనకు పట్టనట్లుగా వ్యవహరించిన తీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులనే విస్మయానికి గురి చేసింది. అసలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అనే అలోచనలో కార్యకర్తలు ఉన్నారు.