మొయినాబాద్, మార్చి 2 : సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని, నూతన ఆలోచనలకు టీఎస్ఐసీ ఎంతో ప్రోత్సహిస్తున్నదని టీఎస్ఐసీ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత ధౌతం అన్నారు. మండల పరిధిలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి టెక్నో కల్చర్ స్పోర్ట్స్ ఫెస్ట్ రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. అందులో భాగంగా టెక్నికల్ అండ్ కల్చరల్ ఫెస్ట్ యూడీబీహెచ్ఏవీ-23, ఫినిక్స్-23 స్పోర్ట్స్ ఫెస్ట్లు నిర్వహించారు. ఫెస్ట్కు రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు సుమారు 4 వేల రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
విద్యార్థులకు వివిధ స్పోర్ట్స్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నూతన ఒరవడి సృష్టించాలని చెప్పారు. వినూత్న ఆవిష్కరణలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎస్ఐసీ ఎంతో ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ఐటీ హబ్గా తయారుచేస్తున్నారని.. వారి చొరవతో అనేక ఐటీ కంపెనీలు ఆవిష్కరించబడ్డాయని పేర్కొన్నారు.
టీఎస్ఐసీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్కుమార్ మాట్లాడుతూజజ ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. మంచి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీజేఐటీ డైరెక్టర్ డాక్టర్ సాయిబాబారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మజ, ప్రోగ్రామ్ కన్వీనర్ శ్రీనివాస్, కో-కన్వీనర్ డాక్టర్ ఓబులేశ్, డాక్టర్ రమేశ్బాబు, సీనియర్ అడ్మినిస్ట్రేటర్ వెంకటాచలం, అకాడమిక్ కో ఆర్డినేటర్ శ్రీలత పాల్గొన్నారు.