శంకర్పల్లి రూరల్, జూలై 6 : మా భూములు మాకివ్వండి.. లేకపోతే మాకు చావే శరణ్యమని శంకర్పల్లి మండలం మోకిలతండా గిరిజన రైతులు అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ.. గత 22 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయమని ఆవేదన చెందారు. తమ భూములు నగరానికి కూతవేటు దూరంలో ఉండి.. కోట్ల రూపాయలు ధర పలుకుతుండటంతో.. కొందరు రియల్ వ్యాపారులు తమ భూములపై కన్నెసి అధికారులతో కుమ్మక్కయ్యారన్నారు.
సర్వే నంబర్ లేని 32 ఎకరాల బిల్లా దాఖలా భూములకు సర్వే నంబర్లు సృష్టించి తమ భూములను లాక్కోవడంతో మా బతుకుదెరువు ఆగమ్యగోచరంగా ఉందని ఆవేదన చెందారు. గిరిజనులకు వ్యవసాయమే ప్రధాన ఆధారం.. తమకు వ్యవసాయం తప్ప మరే పని రాదని.. మమ్మల్ని ఉలా బతకమంటారో ప్రభుత్వమే చెప్పాలన్నారు. స్థానిక అధికారులు రియల్ వ్యాపారులతో కుమ్మకై తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. మాకు ప్రభుత్వం నుంచి న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి.. న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.