మేడ్చల్, మే 8 : ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు. అతి తక్కువ సమయం, చార్జీలతో నగరానికి చేరుకునే అవకాశం లభించడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కు ఆర్టీసీ బస్సు సర్వీసులు బాగానే ఉన్నాయి. 10 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉన్నా రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్తో సమయం చాలా తీసుకుంటుంది. ప్రధానంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మేడ్చల్ మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. సికింద్రాబాద్ చేరుకోవాలంటే మేడ్చల్ చెక్పోస్టు, కొంపల్లి, దూలపల్లి, సుచిత్ర, బోయిన్పల్లి, పారడైస్ దాటుకొని వెళ్లాలంటే అడుగడుగునా ఉన్న సిగ్నల్స్తో సమయం చాలా తీసుకుంటుంది. పైగా ఆర్టీసీ బస్సు చార్జీ రూ.40 ఉండగా, ఎంఎంటీఎస్ రైల్లో రూ.10 మాత్రమే ఉంది. సమయం, డబ్బులు ఆదా అవుతుండటంతో ప్రజలు రైల్వే ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు.
ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనం
గతంలో మేడ్చల్ పట్టణంతో పాటు డబిల్పూర్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, రాయిలాపూర్, గిర్మాపూర్, శ్రీరంగవరం తదితర గ్రామాల ప్రజలు ఎక్కువ రైలు సౌకర్యాన్ని వినియోగించుకునేవారు. అయితే రైల్వే సర్వీసులు తక్కువగా కావడంతో ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఎంఎంటీఎస్ రాకతో వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ఎంతో సౌకర్యంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు సికింద్రాబాద్కు చేరుకొని, నగరంలో ఏ మూలకైనా మెట్రో సర్వీసును వినియోగించుకొని అతి తొందరగా గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశం ఏర్పడింది.
ఎంఎంటీఎస్ ప్రయాణ వేళలు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్
ఉదయం : 6.05 , 7.20, 8.50, 11.35
మధ్యాహ్నం : 12.30, 3.40,
సాయంత్రం : 5, 6.50 8.15, 10.10
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్
ఉదయం : 5.45, 7.30, 8.40, 10.10
మధ్యాహ్నం : 12.50, 1.45
సాయంత్రం : 4.45, 6.15, 8.40, 9.30