బషీరాబాద్, నవంబర్ 25 : మండల కేంద్రం నుంచి కర్ణాటక సరిహద్దు గ్రామం వరకు (రెండు కిలో మీటర్ల) రోడ్డు నిర్మాణాన్ని చేపడితే రెండు రాష్ర్టాల నడుమ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేందుకు మండల కేంద్రం బషీరాబాద్తో పాటు తాండూరు పట్టణానికి వస్తుంటారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగే సంతకు వందల సంఖ్యలో ప్రజలు, వాహనాలు తిరుగుతుంటాయి. మట్టి రోడ్డును తారు రోడ్డుగా నిర్మించి అనుసంధానిస్తే రెండు రాష్ర్టాల ప్రజలు ఆనందిస్తారని పలువురు పేర్కొంటున్నారు.
మండల కేంద్రం నుంచి కర్ణాటక రాష్ట్రం హల్కోడ గ్రామం వరకు ఉన్న మట్టి రోడ్డును తారు రోడ్డుగా మార్చడంతో రైతులకు, ప్రయాణికులకు మేలు జరుగుతుంది. రాష్ట్ర రైతులు, కర్ణాటకలో భూములు కొనుగోలు చేశారు. వీరు వ్యవసాయం చేసేందుకు ప్రతి రోజు మట్టి రోడ్డు పైనుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వ్యవసాయం చేసేందుకు ట్రాక్టర్లు, ప్రయాణికులు వచ్చి పోయేందుకు ప్రైవేట్ వాహనాలు మట్టి రోడ్డు పైనుంచే రాకపోకలు సాగించాలి.
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేయడంతో తెలంగాణ రాష్ర్టానికి సరిహద్దున ఉన్న మాకు చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణకు సరిహద్దున ఉన్న మా గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయి. రోడ్లను నిర్మిస్తే రాకపోకలు సాగుతాయి. మా గ్రామ సరిహద్దు నుంచి ఉన్న మట్టి రోడ్డును అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
– రవిందర్రెడ్డి, హల్కోడ్ గ్రామం (కర్ణాటక)
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ, ఉపాధి కోసం ప్రతి రోజు వస్తుంటాను. తెలంగాణ రాష్ట్రంలోకి రావాలంటే రెండు కిలో మీటర్లు ఉన్న మట్టి రోడ్డు పైనుంచే రావాలి. ప్రభుత్వం పెద్ద మనుసు చేసుకొని మట్టి రోడ్డును తారు రోడ్డుగా నిర్మిస్తే రెండు రాష్ర్టాల ప్రజలకు, ప్రయాణికులకు ఎంతో మంచి జరుగుతుంది.
– రాజు, సులేపేట్ (కర్ణాటక)