బొంరాస్పేట, జూలై 23 : ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో బాషా, గణిత సామర్థ్యాల సాధన కోసం గత విద్యా సంవత్సరం అమలు చేసిన ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. దీంతో ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యా సంవత్సరంలో 220 పని దినాలకు 140 రోజుల్లో ప్రతి విద్యార్థి తరగతుల వారీగా కనీస సామర్థ్యాలను సాధించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. గతేడాది ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది పొడవునా కొనసాగించారు. పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి వారంలో అయిదు రోజుల పాటు చెప్పిన పాఠాలను ఆరో రోజు విద్యార్థుల సాధన మదింపునకు కేటాయిస్తారు. ఇది వరకు పాఠం పూర్తయిన తర్వాత మదింపు నిర్వహించే వారు. పాఠశాలల వార్షిక బోధనా ప్రణాళికలో కూడా ఉపాధ్యాయులు తగిన మార్పులు చేసుకోవాలి. అర్థవంతంగా కృత్యాధార పద్ధతుల్లో విద్యార్థులందరూ భాగస్వాములయ్యేలా ప్రణాళికలు రూ పొందించుకోవాలి. ప్రతి విద్యార్థి కనీస సామర్థ్యాలను సాధించేలా చేసి తరగతుల వారీగా ఆశించిన ఫలితాలను సాధించడమే దీని లక్ష్యం.
ఏ తరగతికి ఏ సామర్థ్యాలు
తొలిమెట్టులో ఏ తరగతికి ఏ సామర్థ్యాలను సా ధించాలో విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఒకటో తరగతి విద్యార్థులు తెలుగులో వర్ణమాల, సరళ పదాలు, గుణింత పదాలు చదవడం, రెం డో తరగతిలో వీటికి తోడుగా ఒత్తుల అక్షరాలు చదవడం, రాయడం రావాలి. మూడో తరగతి లో వీటితో పాటు నాలుగైదు వాక్యాలతో కూడిన పేరాలను రాయగలగాలి. నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులు సొంత మాటల్లో రాయడం, అపరిచిత పేరాలు, వాక్యాలను చదవడం,అర్థం చేసుకోవడం, ఐదారు వాక్యాల పేరాలను సొం తంగా రాసే సామర్థ్యం వచ్చేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పాఠశాల విద్య పూర్తి చేసేసరికి విద్యార్థులంతా తరగతుల వారీగా ఆ యా సబ్జెక్టుల్లో నిర్దేశించిన సామర్థ్యాలు, అభ్యస న ఫలితాలను సాధించాలి. గత విద్యా సంవత్సరంలో అమలు చేసిన తొలిమెట్టులో జిల్లాలో 30 శాతం మంది విద్యార్థులు అభ్యసనా సామర్థ్యాలను సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దీనిని మరింత పెంచడానికి కృషి చేస్తున్నారు.
నేటి నుంచి డీఆర్పీలకు శిక్షణ
తొలిమెట్టు కార్యక్రమంపై వికారాబాద్ జిల్లాలోని 20 మండలాలకు చెందిన 120 మంది రిసోర్స్ పర్సన్లకు (మండలానికి ఆరుగురు చొ ప్పున) సోమవారం నుంచి జిల్లాలో మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. వీరికి రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన పది మంది ఆర్పీలు శిక్ష ణ ఇస్తారు. ప్రతి మండలం నుంచి తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు వేర్వేరుగా ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు డీఆర్పీలను శిక్షణ కోసం ఎంపిక చేశారు. జిల్లాలోని ఉర్దూ మీడి యం పాఠశాలల్లో పని చేస్తున్న 96 మంది ఉ పాధ్యాయులకు జిల్లా స్థాయిలోనే శిక్షణ ఇస్తా రు. జిల్లాలో శిక్షణ పొందిన డీఆర్పీలు ఈ నెల 27 నుంచి 3 రోజులపాటు మండలస్థాయిలో ఉపాధ్యాయులకు విడుతల వారీగా శిక్షణ ఇస్తా రు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆగస్టు నెల నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేసి విద్యార్థుల్లో ఆశించిన అభ్యసనా సామర్థ్యాలను సా ధించడానికి కృషి చేస్తారు. తొలిమెట్టు కార్యక్ర మం ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం రూ పొందించారు. జిల్లాలో 771 పీఎస్లు, 116 యూపీఎస్లు, 48 ఉర్దూ మీడియం పాఠశాలలు ఉండగా వీటిలో 1 నుంచి 5వ తరగతి వరకు 49 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 1,782 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ ఆశిస్తున్నది.
ఆగస్టు నుంచి అమలు
ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే జిల్లాలో ఎంపిక చేసిన డీఆర్పీలకు సోమవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాస్థాయిలో శిక్షణ ఇస్తున్నాం. వీరు మండ ల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆగస్టు నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. గత విద్యా సంవత్సరం తొలిమెట్టుతో జిల్లాలో 30 శాతం మంది విద్యార్థులు అభ్యసనా సామర్థ్యాన్ని సాధించారు. ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేస్తు న్నాం. బోధన పద్ధతులను కొంత మార్చారు. దీంతో గుడ్డిగా పాఠాలు చెప్పకుండా ఆసక్తిగా పాఠ్య పుస్తకాల్లోని పాఠాలను బోధించే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక తరగతుల విద్యార్థులకు వర్క్బుక్కులు అందజేస్తున్నాం.
– రేణుకాదేవి, డీఈవో, వికారాబాద్