రంగారెడ్డి, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): జనం లేక వెలవెలబోతున్న సభలతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రంగారెడ్డి జిల్లాలో శనివారం పలు చోట్ల సభలు జరిగాయి. తుర్కయాంజాల్లో జరిగిన కార్నర్ మీటింగ్కు, షాద్ నగర్లో జరిగిన బహిరంగ సభకు రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆమనగల్లులో జరిగిన బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాజరైనప్పటికీ ఖాళీ కుర్చీలే కనిపించాయి.
దీంతో సభలు మూడు చోట్లా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లులో శనివారం కాంగ్రెస్ పార్టీ విజయభేరీ సభను నిర్వహించింది. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభకు జనం తక్కువగా వచ్చారు.. సభ ప్రారంభం ఆలస్యం కావడంతో ఉన్న ఆ కొందరు కూడా ఇంటిముఖం పట్టారు.
షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్వహించిన విజయ భేరీ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవ్వాల్సి ఉన్నది. ఉదయం 11 గంటలకే సభ జరగాల్సి ఉండగా.. రేవంత్ ఎంతకూ రాకపోవడంతో విసిగిపోయిన జనం వెనుదిరిగిపోయారు.
జనాలు ఇంటిముఖం పడుతున్న వీడియోలను తీస్తుండగా.. కాంగ్రెస్ నేతలు మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్ సైతం అట్టర్ఫ్లాప్ అయ్యింది. ఉదయం 11 గంటలకే మీటింగ్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వస్తారా? రారా? అనే విషయంలో స్పష్టత లేక సాయంత్రం రేవంత్ లేకుండానే మీటింగ్ను కానిచ్చేశారు. ఇబ్రహీంపట్నం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరిధిలో ఉండడంతో రేవంత్ రెడ్డి ఇక్కడకు రావడం కోమటిరెడ్డికి ఇష్టంలేదని సమాచారం. ఈ పరిస్థితుల కారణంగానే రేవంత్ రెడ్డి చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలిసింది.