వికారాబాద్, జులై 16 (నమస్తే తెలంగాణ) : ప్రకృతి రమణీయమైన అందాలతో చూపరుల మనస్సు దోచేలా అనంతగిరి కొండలు ఉన్నాయి.. చుట్టూ పచ్చని బైళ్లు.. పంట పొలాలు.. ఎటుచూసినా అందాన్ని ఆరబోస్తున్న చూడచక్కని అడవి. పక్షుల కిలకిల రావాలు.. వన్యప్రాణుల ఆటలతో పర్యాటకుల మనస్సు పులకరించేలా ఉన్నది అనంతగిరి అటవీ ప్రాంతం.. పర్యాటక కేంద్రంగా రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. ఆదివారం వచ్చిందంటే చాలు పర్యాటకులతో సందడే..సందడి.. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని చూస్తే మైమరచిపోవాల్సిందే. ఇంతటి ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
అనంతగిరి హిల్స్ను టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి హిల్స్తోపాటు భువనగిరి కోట ఎంపికయ్యాయి. ప్రభుత్వం అనంతగిరిని అభివృద్ధి చేసేందుకు ఎల్అండ్టీ సంస్థకు బాధ్యతలను అప్పగించగా, ఈ నెల 22 వరకు మాస్టర్ ప్లాన్ను పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 3600 ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలోని 213 ఎకరాల్లో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు రూ.70 కోట్లతో అభివృద్ధికి అంచనా వేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు కూడా మంజూరయ్యాయి. పర్యాటకులను ఆకర్షించేందుకుగాను ఎకో టూరిజంతోపాటు కన్వెన్షన్ సెంటర్, హోటల్, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, యోగా, ధ్యాన కేంద్రాలు, స్విమ్మింగ్ పూల్ తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. అటవీ ప్రాంతంలోని పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్లను నిర్మించడంతోపాటు ట్రెక్కింగ్ను ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి ప్రాంతాన్ని పూర్తిగా చూసేందుకుగాను రోప్వేను నిర్మించనున్నారు. పర్యాటకుల భోజన వసతి కోసం ఇప్పటికే టూరిజం శాఖకు సంబంధించిన హరిత రిసార్ట్ ఉన్నప్పటికీ మరొక విశాలమైన అన్ని వసతులతో కూడిన రిసార్ట్ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలోనే ఉండేలా నైట్ క్యాంపింగ్లు, కేఫ్లు, చిన్న పిల్లలు ఆడుకునేందుకు గేమ్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రోజురోజుకూ అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది.
అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఊటీగా పేరొందిన ఈ ప్రాంతా న్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడంతో వారాంతంలో భారీగా పర్యాటకులు వస్తున్నారు. అయితే జిల్లాకు వచ్చే పర్యాటకులకు సరిపోయే సౌకర్యాలు లేకపోవడంతో వారిని మరింత ఆకర్షించేలా.. అనంతగిరి ప్రాంతాన్ని టూరిజం హబ్గా సరికొత్తగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలోకి తీసుకురానున్నారు. అయితే స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సంయుక్తంగా ఎంపిక చేశారు.
అనంతగిరి హిల్స్తోపాటు భువనగిరి కోట..
రాష్ట్రంలో స్వదేశ్ దర్శన్లో భాగంగా అనంతగిరి హిల్స్తోపా టు భువనగిరి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఈనెల 22 వరకు మాస్టర్ ప్లాన్ను పూర్తి చేయాలని ఎల్అండ్టీ సంస్థ ఇంజినీర్లకు జిల్లా ఉన్నతాధికారులు సూచించారు. అయితే అనంతగిరిని ఎకో టూరిజం ప్రాజెక్టు లో భాగంగా పర్యాటక ప్రాంతం గా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. మాస్టర్ ప్లాన్కు అమోదం తెలిపిన వెంటనే డీపీఆర్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైన వెంటనే నిధులు మంజూరు కానున్నాయి. అయితే అనంతగిరి హిల్స్తోపాటు సర్పన్పల్లి, కోట్పల్లి ప్రాజెక్టులను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. అయితే రెండేళ్లలోగా అనంతగిరి హిల్స్, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు.
వాచ్ టవర్లు, ట్రెక్కింగ్, రోప్వే తదితర ఏర్పాట్లు
అలాగే అనంతగిరి అటవీ ప్రాంతంలోని వివిధ రకాల పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్లను నిర్మించడంతోపాటు ట్రెక్కింగ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా వీక్షించేందుకు రోప్వేను నిర్మించేందుకు ప్లానింగ్ చేస్తున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతంలోని ప్రధాన వ్యూ పాయింట్ను అభివృద్ధి చేయడంతోపాటు రోప్వే ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సరైన భోజన వసతి లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే టూరిజం శాఖ కు సంబంధించిన హరిత రిసార్ట్ ఉన్నప్పటికీ మరొక విశాలమైన అన్ని వసతులతో కూడిన రిసార్ట్ను ఏ ర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కన్వెన్షన్ సెంటర్, వెల్నెస్ సెంట ర్, రిసార్ట్ తదితరాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పర్యాటకులకు ఉత్సాహానిచ్చే జిప్లైన్లను, వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి హిల్స్లో హట్లు, రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతంలోనే ఉండేలా నైట్ క్యాంపింగ్లు, కేఫ్లు, చిన్న పిల్లలు ఆటలాడేందుకు గేమ్స్ను ఏర్పాటు చేయనున్నారు.
కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులు..
అలాగే కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టుల వద్ద కాటేజ్లతోపాటు రెస్టారెంట్లు, బోటింగ్, వాటర్ గేమ్స్, స్పీడ్ బోట్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. టూరిజం అభివృద్ధితోపాటు అనంతగిరిలోని అనంతపద్మనాభస్వామి ఆలయ పరిసరాల్లోనూ అవసరమైన అభివృద్ధిపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు అనంతగిరిలో పారాచూట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అనంతగిరి హిల్స్లో పారాచూట్ ఏర్పాటుకు రెండేళ్ల క్రితం సిక్కింకు చెందిన నిర్వాహకులతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల బృందం రెండు రోజులపాటు ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే అనంతగిరి ప్రాంతం పారాచూట్కు అనుకూలమైన గాలులు వీస్తున్నట్లు వారు గుర్తించడంతో పారాచూట్ను ఏర్పాటు చేయనున్నారు.
పర్యాటకుల తాకిడి…
మినీ ఊటీ, తెలంగాణ ఊటీగా పిలుస్తున్న అనంతగిరి కొండకు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్ర రాజధానికి సమీపంలో కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సెలవులొస్తే చాలు నగరవాసులు అనంతగిరిలో వాలిపోతున్నారు. అంతేకాకుండా ప్రతీ శుక్ర, శని, ఆది వారాల్లో 4 నుంచి 5 వేల మంది వరకు పర్యాటకులు జిల్లాలోని అనంతగిరి హిల్స్కు వస్తున్నారు. వారాంతపు సెలవుల్లో అనంతగిరి పర్యాటకులతో కిటకిటలాడుతుంది. అనంతగిరిలోని ప్రసిద్ధ పద్మనాభస్వామిని దర్శించుకోవడంతోపాటు అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్లను చూసేందుకు, ట్రెక్కింగ్ చేసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. కెరెళ్లి వెళ్లే దారిలో నంది విగ్రహం, ఎత్తైన అటవీ ప్రాంతంలో పర్యాటకులు సేద తీరుతున్నారు.
213 ఎకరాల్లో టూరిజం స్పాట్..
జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. 3,600 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలోని 213 ఎకరాల్లో టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయనున్నారు. రూ.70 కోట్లతో అనంతగిరిలో టూరిజం అభివృద్ధికి అంచనాలను రూపొందిస్తున్నారు. పర్యాటక ప్రదేశంగా మరింత విస్తరించేందుకు అవకాశముంటే మరిన్ని నిధులను ఖర్చు చేయనున్నారు. ప్రధానంగా ఎకో టూరిజం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనివ్వనున్నారు. ఎకో టూరిజంతోపాటు కన్వెన్షన్ సెంటర్, హోటల్ తదితరాలను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అటవీ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, శారీరక దృఢత్వానికి యోగా కేంద్రం, ధ్యాన కేంద్రం, స్పా, స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేయనున్నారు.
ఈనెల 22 వరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం…
అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. మాస్టర్ ప్లాన్ను రూపొందించే బాధ్యత ఎల్అండ్టీ సంస్థకు అప్పగించాం. ఈ నెల 22 వరకు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తారు. మాస్టర్ ప్లాన్ అనంతరం డీపీఆర్(ప్రాజెక్టు పూర్తి నివేదిక)ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. అనంతగిరితోపాటు సర్పన్పల్లి, కోట్పల్లి ప్రాజెక్టుల్లో పర్యాటకులను ఆకర్షించేలా బోటింగ్, వాటర్ గేమ్స్ను ఏర్పాటు చేయనున్నాం. జిల్లాకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా రవాణా సౌకర్యానికి సంబంధించి ఎయిర్పోర్ట్ ఆథారిటీ, రైల్వే, ప్రైవేట్ ట్రావెల్స్తో సమన్వయం చేసుకొని పర్యాటకులు ఈజీగా వచ్చి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తాం. – నారాయణ రెడ్డి, కలెక్టర్, వికారాబాద్ జిల్లా