సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అనంతగిరిలో ఉన్న దాదాపు 275 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి వారాంతపు ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంగళవారం కోకాపేట ఇంటర్చేంజ్ నుంచి నార్సింగి వెళ్లే సర్వీసు రోడ్డులో సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ రంజిత్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
నార్సింగ్ సమీపంలో కొంతమేర సిద్ధమైన సైక్లింగ్ ట్రాక్
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను టూరిజం స్పాట్లుగా మారుస్తామన్నారు. గండిపేట చుట్టూ ఉన్న 46 కిలోమీటర్ల పరిధిలో సైక్లింగ్ ట్రాక్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రిసార్ట్స్ లాంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్గౌడ్ అనంతగిరి గురించి ఎప్పటికప్పుడు తనతో చర్చిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎంపీ రంజిత్రెడ్డి కూడా కోట్పల్లి చెరువును అభివృద్ధి చేయాలని కోరారని.. దానికి కొత్త రూపునిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సైక్లింగ్ ట్రాక్ విశిష్టతల గురించి మంత్రి వివరించారు. దేశంలోనే మొదటిసారిగా ఔటర్ రింగు రోడ్డు వెంబడి సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నామని, వచ్చే వేసవి నాటికి పూర్తి చేస్తామని మంత్రి అన్నారు.
భవిష్యత్లో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీ
ఐటీ కారిడార్ పరిధిలో ఔటర్ రింగు రోడ్డు వెంబడి మొదటి దశలో 23 కి.మీ మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ను నిర్మిస్తారని, దీనిద్వారా సుమారు 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తారన్నారు. 2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ లక్ష్యంగా పెట్టుకున్నదని.. నానక్రామ్గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కి.మీ, నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కి.మీ వరకు సైక్లింగ్ ట్రాక్ నిర్మించాలని నిర్ణయించారు. 24 గంటలు ఈ ట్రాక్ అందుబాటులో ఉంటుందని, అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లందరినీ ఉత్సాహపరిచేలా భారత్లో తొలిసారిగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
శంకుస్థాపన చేయడంతోపాటు మోడల్ డెమో కింద 50 మీటర్లు తయారు చేశామన్నారు. జర్మనీ, సౌత్ కొరియా, ఇతర దేశాలకు దీటుగా నాలుగున్నర మీటర్ల వైశాల్యంతో ప్రపంచస్థాయిలో నిర్మించామన్నారు. భవిష్యత్లో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీ నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పలు చోట్ల సైకిళ్లను అద్దెకు ఇచ్చే కేంద్రాలు, మరమ్మతులు చేసే వ్యవస్థ, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ వంటి దానిపై ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి వరాల జల్లు కురిపించారు.