నంగునూరు, మార్చి 29: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగు మండుటెండల్లోనూ జలకళ సంతరించుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు రావడంతో ఈ ప్రాంత రైతుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ వాగుపై మొత్తం తొమ్మది చెక్డ్యామ్లు సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు నిర్మించారు. ప్రస్తుతం ఒక చెక్డ్యామ్ నిండి దిగువన మరో చెక్డ్యామ్కు గోదావరి జలాలు వెళ్తున్నా యి. బుధవారం నంగునూరు మండల కేంద్రంలోని పెద్దోల్ల బంగ్లాకాడ వద్ద గల చెక్డ్యామ్లో మంత్రి హరీశ్రావు గంగమ్మకు జలహారతి పట్టి పూజలు చేశారు.
ఈ సందర్భంగా గోదావరి నీటిని చూసిన రైతులు అనందడోలికల్లో మునిగి తేలారు. వాగు నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుని రైతులు సంబురాలు చేసుకున్నారు. అనంతరం మంత్రి హరీశ్రావును రైతులు శాలువాతో సన్మానించి సీట్లు పంచుకున్నారు. గోదావరి జలాలు రావడంతో మండలంలో పండుగ వాతావరణం నెలకొన్నది. అంతకు ముందు మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్రామ్, తెలంగాణ తల్లి విగ్రహం, ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి మంత్రి హరీశ్రావు నివాళులర్పించారు. అనంతరం నల్లపోచమ్మ, మాంకాళమ్మ, మాతమ్మ ఆలయాల్లో మంత్రి హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.