యాచారం, జనవరి 4 : తొలిమెట్టు కార్యక్రమం విద్యార్థి భవితకు బంగారు బాటలు వేస్తుందని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. మండలంలోని నందివనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) మండల స్థాయి బోధనాభ్యాసన సామగ్రి మేళా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు అనేక రకాల ప్రయోగాలను ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు అందరినీ ఆకర్షించింది. ఉపాధ్యాయులు స్వయంగా తయారుచేసిన టీఎల్ఎమ్ రికార్డులను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు రాయడం, చదువడం, బొమ్మలు వేయడం వంటివి పూర్తిస్థాయిలో రావాలనే ఉద్దేశంతోనే తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మౌళిక భాష, గణిత సామర్థ్యాల సాధనపై దృష్టి పెట్టాలన్నారు. బోధనాభ్యాసనలో గుణాత్మకమైన మార్పులను తీసుకురావడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కానున్నాయన్నారు. పాఠశాలలకు కొత్త రూపును తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థులకు ఉత్తమ బోధనను అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, సర్పంచ్ ఉదయశ్రీ, బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్ శేఖర్రెడ్డి ఉన్నారు.