ఆరుగాలం కష్టపడి రైతు పండించే పంటలు చేతికందేలోపే చీడపీడల బారిన పడితే? ఆ రైతుకు తీరని నష్టం జరుగుతుంది. ఒక్క రైతుకే కాదు, ఆ కుటుంబానికీ తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది అనే నానుడిని నిజం చేయాలంటే.. మొదట రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు తమ వంతుగా మామిడి రైతుల కోసం పలు సూచనలు, సలహాలు పాటిస్తే ఈ సీజన్లో అధిక దిగుబడులు పొందవచ్చని చెబుతున్నారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.
– వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 9
ఈ ఏడాది మామిడికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నా, మార్చి నెలలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అధిగ దిగుబడి పొందవచ్చని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగహర్షిత సూచిస్తున్నారు. ఉద్యాన శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు ఎంతో కీలకమని చెప్పారు.
మామిడి ప్రస్తుతం పిందె, కాత దశలో ఉందని తెలిపారు. అయితే పిందె, కాయలపై తేనె మంచు, కాండం తొలుచు, కాయ తొలుచు పురుగులు, మసిమంగు, పిండి నల్లి, బూడిద తెగుళ్లు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే తగు జాగ్రత్తలు పాటించకపోతే అపార నష్టం వాటిల్లుతుందన్నారు. కాయ పెరుగుదల దశలో వీలైనంత వరకు డ్రిప్ ద్వారా చెట్టుకు నీరందించాలని సూచించారు. కాయలకు కవర్ తొడుగు ఉంచడంతో ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు.
ఈ పురుగు ఆకు, పువ్వు, పిందెలపై చేరి రసాన్ని పీలుస్తాయి. పూత, పిందె వాడిపోయి రాలిపోతుంది. పురుగు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థంపై మసి గల శిలీంద్రాలు పెరుగుతాయి. దీంతో నల్లని మసిమంగు ఏర్పడుతుంది. ఈ పురుగు కాయ లేని కాలంలో కొమ్మల బెరడులో దాగి ఉంటుంది. అనంతరం లేత ఆకులపై, పూరెమ్మలపై ఉంటుంది. వాతావరణ పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు, అంటే చలిగా ఉన్నపుడు ఎక్కువ ఉధృతి పెరుగుతుంది. తేనెలాంటి బంక ఆకులపై చేరడంతో సూర్యరశ్మి వెలుగులో మెరుస్తుంది. తేనె మంచు నివారణకు లీటర్ నీటిలో డైమిథోయేట్ 2 మి.లీ లేదా క్లోరిఫైరిపాస్ తగు మోతాదులో నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కాయ తొలుచు పురుగు
ఎండు పుల్లలో నిద్రావస్థ దశలో రెక్కల పురుగు వెలువడి కాయలపై గుడ్డు పెడుతుంది. ఈ పురుగు మామిడి పండ్ల దశలో మూడు తరాలు వృద్ధి చెందుతుంది. అనంతరం పంటను ఆశిస్తాయి. పురుగు ఆశించిన చెట్టును తొలగించాలి.
ఆకులు, పూత, పిందెలు, కాయలపై రసం పీల్చే తేనె మంచు పురుగు, పిండినల్లి, తామర పురుగులు, చీడపీడలు ఆశించినప్పుడు (సోకినప్పుడు).. అవి విసర్జించిన తేనెలాంటి పదార్థంపై శిలీంద్రాలు క్యాప్నోడియం పరాన్న భుక్కులుగా పెరిగి నల్లని మసి తెగుళ్లు వస్తాయి. కొంతకాలం తర్వాత ఇవి మసిమంగుగా మారుతాయి. తెగుళ్లు సోకిన కాయలపై నల్లని మచ్చలుగా ఏర్పడి అవి అమ్మకానికి డిమాండ్ లేకుండా పోతాయి. ఇది ఎక్కువగా మార్చి నెలలో దీని ప్రభావం ఉంటుంది. కనుక జాగ్రత్త అవసరం. జిగురు లేని కాయలపై మసి తెగుళ్లు సోకదు. ఆకు మసి తెగుళ్లు కనిపిస్తే.. 2 శాతం గంజి ద్రావణం పిచికారీ చేయాలి.
ఈసారి రాష్ట్రం నుంచి మామిడి అధిక దిగుబడి రానున్నదన్నారు. మెళకువలతో మామిడిని రక్షిస్తే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు పొందవచ్చన్నారు. మామిడిని దేశంలోనే అధికంగా సాగుచేసేది తెలంగాణేనని, అందుకు ఇక్కడి వాతావరణ పరిస్థితులు, నేలలు అనుకూలమని వెల్లడించారు. ప్రస్తుతం తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కాండం తొలిచే పురుగు సోకినప్పుడు చెట్టు ఎండిపోతుంది. గట్టి ఇనుప తీగ సహాయంతో పురుగును తొలగించాలి. పురుగు విసర్జన, పురుగు కొమ్మను తట్టినప్పుడు వచ్చే శబ్దాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి.
భూమిలో పొదగబడిన గుడ్డు, పిల్ల పురుగులు చెట్ల పైకి పాకుతాయి. చీమల ద్వారా పైకి పాకి గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. దీనివల్ల కాయలు సరిగ్గా ఎదగకుండా రాలిపోతాయి. నివారణకు మిథైల్ పెరాథియాన్ను పిచికారీ చేయాలి. టెంక పురుగు కాయ లోపలికి చొచ్చుకుని పోయి లోపల గోకి తింటుంది. ఇది ఆలస్యంగా కోత దశలో కనిపిస్తుంది. నివారణకు మి.లీ ఫినిట్రోథియాను లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలి.
ఈ తెగులు ఆకుపై, పూరెమ్మలపై బూడిద వంటి తెల్లని పదార్థం వ్యాపించి పూత, పిందె రాలిపోతుంది. ఇది పూత కాలంలో కనబడుతుంది. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు, లేదా కెరాథేన్ మి.లీ కలిపి పిచికారీ చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. నాగహర్షిత సూచిస్తున్నారు.