కాంగ్రెస్ అంటేనే రైతాంగం ఉలిక్కిపడుతున్నది. కాంగ్రెస్ పాలనలో పడిన ఎడతెరిపి లేని కష్టాలను తల్చుకుని వణికిపోతున్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మూడు గంటల కరెంటు..10 హెచ్పీ మోటర్లతో గతంలో మాదిరిగానే కరెంటు కష్టాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మూడు గంటల కరెంటుతోని ఇంత పెద్ద మోటర్లు ఒకేసారి పెడితే ట్రాన్స్ఫార్మర్లు ఉంటయా? ఎక్కడికక్కడ పేలిపోవా? మోటర్లు కాలిపోవా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములను పడావుగా పెట్టి మళ్లీ వలసలు పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇష్టమొచ్చినట్లు పూటకో మాట్లాడే కాంగ్రెస్ను నమ్మేది లేదని స్పష్టం చేస్తున్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు రైతులకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితులు ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల ఫలితంగా పదేండ్లలో వ్యవసాయం పండుగలా మారిందని బీఆర్ఎస్ పాలనను కొనియాడుతున్నారు. తిరిగి కరెంటు కష్టాలను కొని తెచ్చుకునే పరిస్థితుల్లో లేమన్నారు. కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేది లేదని, కాంగ్రెస్కు ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని రంగారెడ్డి జిల్లా రైతులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి అధికారంలో నిలబెడతామని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు.
కాంగ్రెసోళ్లిచ్చే 3 గంటల కరెంట్తో ఎకరం భూమి కూడా సాగు చేయలేం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలివ్వడం ద్వారా రైతుల కష్టాలు తీరాయి. ఇప్పుడిప్పుడే రైతులు మూడు పూటల తిని సంతోషంగా ఉంటున్నారు. రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేనట్లుంది. 10 హెచ్పీ మోటర్లు వాడే పరిస్థితి రైతులకు లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్మించి గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నది. రైతులందరూ బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. 24 గంటల కరెంట్తోనే రైతులకు లాభం. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం.
– కొండ్రు జంగయ్య, రైతు, బ్రహ్మణపల్లి, తుర్కయాంజాల్
కాంగ్రెస్ వ్యవసాయానికి 3 గంటల కరెంట్ ఇస్తామనడం అంటే మళ్లీ పాతరోజులు వచ్చినట్లే. గతంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలతో ఇబ్బందులు పడ్డాం. పంటలు ఎండిపోయి చేసిన ఆప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంటలు పండించుకుని సంతోషంగా జీవిస్తున్నాం. 10 హెచ్పీ మోటర్లతో ఏ రైతు కూడా ఎవుసం చేయడు. కాంగ్రెసోళ్లకు వ్యవసాయంపై అవగాహన లేక మళ్లీ మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.
– చందు, ఊరెళ్ల, చేవెళ్ల
ఎవుసానికి తెలంగాణ సర్కార్ అందిస్తున్న కరెంట్తో రైతులు బాగుపడుతుండ్రు. లోవోల్జేజీ సమస్యలు, మోటర్లు కాలిపోవుడు ఇప్పుడు లేవు. ఇది వరకు కరెంట్ కోసం పడ్డ బాధలు గుర్తొస్తే దుఃఖం వస్తది. పొలాలకు నీళ్లు పెట్టేందుకు అర్ధరాత్రి పోయేది. పాములు, తేళ్లు కరుస్తాయని భయంభయంగా ఉండేది. సీఎం కేసీఆర్ సార్ పుష్కలంగా అందిస్తున్న 24 గంటల కరెంట్తో రైతులు సంతోషంగా ఉండ్రు. రైతు మంచిగుంటే కాంగ్రెసోళ్ల కండ్లు మండుతున్నాయి. రైతులను కడుపులో పెట్టి చూసుకుంటున్న సీఎం కేసీఆర్ సార్నే తిరిగి గెలిపిస్తాం.
– జంగయ్యగౌడ్, మర్రిపల్లి, కడ్తాల్
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం కాంగ్రెస్కు సాధ్యం కాదు. ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ప్రజలు ఓటేస్తే చీకటి రాత్రులు తప్పవు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో రైతులు వ్యవసాయం ద్వారా ఆర్ధికంగా బలపడుతున్నారు. 3 గంటల కరెంట్తో వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. జనరేటర్లు కొని వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుంది. తెలంగాణ రైతాంగం ఇప్పుడిప్పుడే వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలవడం.. సీఎం కేసీఆర్ కావడం ఖాయం.
– కొమ్మని దయానంద్, రైతు, తుర్కయాంజాల్
కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంటే కావాలి. 3 గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా రైతుల సత్తా చూపిస్తాం. ప్రాణాలు త్యాగం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ నాయకులు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రైతులు పడుతున్న బాధలు చూడలేక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తూ రైతులకు అండగా నిలిచారు. కాంగ్రెస్ వస్తే రాత్రుళ్లు పొలాల దగ్గర పాము కాట్లకు, కరెంట్ షాక్లకు గురై రైతులు చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ ఇచ్చే 3 గంటల కరెంటుకు పెద్ద మోటర్లను సన్న, చిన్నకారు రైతులు ఎలా కొంటారు. రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ వద్దు. రైతులకు భరోసా కల్పించే బీఆర్ఎస్ పార్టీ కావాలి.
– మధు, శంకర్పల్లి
తెలంగాణలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి కాంగ్రెస్ కండ్లు మండుతున్నయ్. 3 గంటలు సరిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి అసలు రైతులు బాగుపడాలని ఉందా. రైతుల బాగు దేవుడెరుగు. ఇబ్బందులు అవుతాయన్న కనీస ఇంకిత జ్ఞానం వారికి లేకపోతే ఎలా. సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుండు. ఇప్పుడు వ్యవసాయం సజావుగా సాగుతున్నది. మధ్యలో వచ్చి ఏదో చేస్తామంటే రైతులు ఎవరూ ఊరుకోరు. కాంగ్రెసోళ్లు ఇస్తామంటున్న మూడు గంటల కరెంట్తో పొలం పారదు. దీంతో సాగు విస్తీర్ణం మీద దెబ్బపడుతుంది. రైతులంతా ఆ మోటర్లను వాడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి చెపుతాం.
– నవాజ్రెడ్డి, రైతు, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల రూరల్
పదేండ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలను కళ్లారా చూశాం. మళ్లీ వాళ్లు పొరపాటున అధికారంలోకి వస్తే వాళ్లిచ్చే మూడు గంటల కరెంట్ రైతులకు ఎటూ సరిపోదు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్నో బాధలు పడ్డారు. రేవంత్రెడ్డి 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటుండు. అసలు ఆయనకు వ్యవసాయం పట్ల ఏమైనా అవగాహన ఉందా. 3 గంటల కరెంట్తో ఒక్క ఎకరం కూడా సరిగా పారదు. అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. బీఆర్ఎస్ వెంటే మా ప్రయాణం.. కారు గుర్తుకే మా ఓటు.
– రమేశ్, యువ రైతు, ఆమనగల్లు మున్సిపాలిటీ
కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మళ్లీ కటిక చీకట్లు తప్పవు. గతంలో వారి పాలనను ఇంకా మరిచిపోలేదు. సీఎం కేసీఆర్ పుణ్యమాని 24 గంటల కరెంట్ వస్తున్నది. సీఎం కేసీఆర్ ఏం చేసినా ప్రజలకు మంచి చేస్తారు కాని చెడు చేయరు. రేవంత్రెడ్డికి అసలు ఎవుసం అంటే తెలుసా తెలువదా అర్థం కావడంలేదు. మూడు గంటల కరెంట్తో మూల కూడా పారదు. గతంలో రెండు పంటలు కూడా పండించేది కాదు. గిప్పుడు రైతులంతా ఖుషీగా 3 పంటలు పండిస్తున్నాం. రైతులను ముంచేటి కాంగ్రెసోళ్లను నమ్మం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– బాలయ్య, రైతు, తారామతిపేట, అబ్దుల్లాపూర్మెట్
కాంగ్రెసోళ్ల పాలనలో కరెంటు కంటిమీద కునుకులేకుండా చేసేది. ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి నెలకొనేది. నిత్యం ఇబ్బందులు పడేటోళ్లం. కాని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారొచ్చినంక 24 గంటల కరెంటు ఇస్తుండు. దీంతో కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోతున్నం. మరోసారి 3 గంటల కరెంటు సరిపోతుంది వ్యవసాయానికి అంటూ ప్రజల్లోకి వస్తున్న రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. రైతులందరూ 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటే రూ. లక్షకు పైగా అవుతుంది ఆ డబ్బులు రైతులకు రేవంత్రెడ్డి ఇస్తాడా.
– వెంకటయ్య, రైతు, ఇబ్రహీంపట్నంరూరల్
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు రైతుల మేలుగోరి నిరంతర కరెంటు ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారు. వారి మాయ మాటలు నమ్మేందుకు రైతులు సిద్ధంగా లేరు. వారి పాలనలో ఎవుసం పూర్తిగా ఆగమై రైతులు బతకనీకే పట్నం బాట పట్టారు. రైతు సంక్షేమం కోసం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కే ఎల్లప్పుడూ రైతుల మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ను ఓటు ద్వారా తరిమికొట్టడం ఖాయం.
– రామిడి మోహన్రెడ్డి, ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం