బంజారాహిల్స్, మే 25: జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంతోపాటు తన ఇంటికి వచ్చి బెదిరించిన బీజేపీ నేత పల్లపు గోవర్ధన్, అతడి అనుచరులపై అదే పార్టీకి చెందిన డివిజన్ అధ్యక్షుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డికి, నియోజకవర్గం నేత పల్లపు గోవర్ధన్కు గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి.
పోటాపోటీ కార్యక్రమాలతోపాటు రానున్న టికెట్ విషయంలో రెండు వర్గాలుగా బీజేపీ చీలిపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం వాట్సాప్ గ్రూపుల్లో మాజీ ఎమ్మెల్యే చింతల, డివిజన్ అధ్యక్షుడు కస్తూరి మహిపాల్రెడ్డితో పల్లపు గోవర్ధన్ వర్గీయులకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తనను పల్లపు గోవర్ధన్ ఫోన్లో, అతడి అనుచరుడు షీత్లా అనిల్కుమార్ తన ఇంటికి వచ్చి బెదిరింపులకు గురిచేశారంటూ మహిపాల్రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్, షీత్లా అనిల్కుమార్, మంగళి శివపై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 448, 506, 504 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.