ఇబ్రహీంపట్నం, జనవరి 8 : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపై బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 17 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలంటూ సోమవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్కు వినతిపత్రం అందజేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24మంది కౌన్సిలర్లుండగా.
అందులో 15మంది బీఆర్ఎస్.. ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసి అందించారు. గతంలోనూ ఆమె పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని పేర్కొంటూ అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవిశ్వాసాలపై అప్పట్లో సానుకూలంగా స్పందించకపోవటంతో తాత్కాలికంగా వాయిదా పడింది. సోమవారం మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ వినతిపత్రం అందజేశారు.
నియోజకవర్గంలో నాలుగు మున్సిపాలిటీలుండగా.. అందులో మూడు మున్సిపాలిటీల చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయం మరోమారు రసకందాయంగా మారింది. పెద్దఅంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, ఆదిబట్ల మున్సిపల్ చైర్పర్సన్ ఆర్తిక, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతిలపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం వీరంతా కాంగ్రెస్లోనే ఉన్నారు. కాగా.. పెద్దఅంబర్పేట, ఆదిబట్ల మున్సిపాలిటీల చైర్పర్సన్లపై కాంగ్రెస్కు చెందిన కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. ఇబ్రహీంపట్నంలో బీజేపీ, బీఆర్ఎస్లు చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన 17మంది కౌన్సిలర్లు ఒకే తాటిపై ఉన్నారు.