Farm Safety Tips | వాణిజ్య పంటలతోపాటు ఇతర పంటలపై ఈ మధ్యకాలంలో రసాయన మందుల వాడకం పెరిగింది. వివిధ రకాల పురుగులు, తెగుళ్లను నివారించేందుకు రైతులు ప్రమాదకరమైన మందును ఆశ్రయిస్తున్నారు. పంట కాలంలో ఆరు నుంచి పదిసార్లు రసాయన మందులను పిచికారీ చేయడం ఆందోళనకరం. వాడే పద్ధతి తెలియకపోవడం, కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో పలువురు రైతులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు. రసాయన మందుల పిచికారీలో తగిన జాగ్రత్తలు పాటించాలని మద్నూర్ మండల వ్యవసాయాధికారి రాజు చెబుతున్నారు.
– న్యూస్ నెట్వర్క్, డిసెంబర్ 9
ఆధునిక వ్యవసాయ విధానంలో దిగుబడులను పెంచుకునేందుకు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం పెరిగిపోయింది. ఎరువులు, క్రిమిసంహారక మందులు స్ప్రే చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మోనోక్రోటోపాస్, ఆక్సిడి మోటాన్, మిథైల్, ఆసిఫేట్ తదితర విషపూరితమైన మందులు పిచికారీ చేసే సమయంలో వాటి వినియోగ విధానంపై కచ్చితంగా అవగాహన ఉండాలని సూచిస్తున్నారు.
పంటలను చీడపీడల నుంచి రక్షించుకునేందుకు క్రిమిసంహారక మందుల స్ప్రే తప్పనిసరైందే. కానీ, వాటిని వినియోగించే సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వాటి ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. పిచికారీ సమయంలో రసాయనిక మందుల ప్రభావం ఊపిరితిత్తుల నుంచి నేరుగా మెదడుకు వెళ్తుంది. ప్రాథమిక చికిత్సకు అవకాశాలు తక్కువే ఉంటాయి. అత్యవసర చికిత్సయే శరణ్యం. రైతులు పూర్తిస్థాయి దుస్తులు ధరించి మందులను పిచికారీ చేయడం శ్రేయస్కరం. నిర్లక్ష్యం వహిస్తే ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే ఆస్కారం ఉన్నది.