ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)చైర్మన్లకు కొత్త ఏడాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురందించింది. ఇప్పటివరకు తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారికి ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సంఘాల టర్నో వర్ ఆధారంగా వేతనాలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యం రైతులతో సత్సంబంధాలు కలిగి ఉండి ప్రభుత్వ పథకాలు, రాయితీలను అన్నదాతలకు అందిస్తూ సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న తమకు గౌరవ వేతనాన్ని పెంచాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేయగా.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు వేతనాలను పెంచుతూ జీవోను జారీ చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లోని 37 సొసైటీల చైర్మన్లకు ప్రయోజనం చేకూరనున్నది. గతంలో ఇచ్చే వేత నాలను పోల్చి చూస్తే తాజాగా ప్రభుత్వం పెంచిన వేతనాలు గౌరవప్రదంగా ఉన్నా యని జిల్లాలోని చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
షాబాద్, జనవరి 8 : ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఏడాది సందర్భంగా తీపి కబురందించింది. ఇప్పటివరకు తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తుండగా.. ఈ నెల నుంచి సర్కార్ కొత్త వేతనాలను అమలు చేయనుంది. గౌరవ వేతనాలు పెంచాలని చైర్మన్లు చేసిన విజ్ఞప్తుల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది సహకార సంఘాల్లో ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయో.. దాని ప్రకారం వేతనాలను ప్రకటించింది. నిత్యం రైతులతో సత్సంబంధాలు ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాయితీలు రైతులకు అందిస్తూ సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న పీఏసీఎస్ చైర్మన్లకు పనిని బట్టి వేతనం నిర్ణయించింది. గతంలో ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 27 మండలాల పరిధిలోని 37 సొసైటీల చైర్మన్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు, గోల్డ్ రుణాలు అందిస్తున్నది. సంఘాల్లో ప్రతి ఏడాది వ్యాపారంలో వచ్చే ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయో.. దాని ప్రకారం వేతనాలు అందించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఆమనగల్లు(కల్వకుర్తి), మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో 37 సహకార సంఘాలున్నాయి. గతంలో రూ.2కోట్లు టర్నోవర్ చేస్తున్న సంఘానికి రూ.1,250, రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు వ్యాపారం చేసే సంఘాలకు రూ.600, రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు చేసే సంఘాలకు రూ.500, రూ.20లక్షల కంటే తక్కువగా టర్నోవర్ ఉన్న సంఘాలకు రూ.300 గౌరవ వేతనం చైర్మన్లకు అందించేది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ వేతనాలు సరిపోవడం లేదని.. పనికి తగిన గౌరవ వేతనం పెంచాలని చైర్మన్లు సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సర్కార్ నిర్ణయం తీసుకుని కొత్త వేతనాలను జనవరి నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా.. పాలకవర్గం ప్రతినిధులకు వేతనాలు పెంచితే మరింత ఆశాజనకంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నందున చైర్మన్లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చే వేతనాలతో పోల్చి చూస్తే తాజాగా ప్రభుత్వం పెంచిన వేతనాలు గౌరవప్రదంగా ఉన్నాయని చైర్మన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం.. రూ.25కోట్లకు పైగా టర్నోవర్ చేసిన చైర్మన్లకు రూ.15వేలు, రూ.15కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు టర్నోవర్ చేస్తే రూ.12,500, రూ.10కోట్ల నుంచి రూ.15కోట్ల వరకు రూ.10వేలు, రూ.5కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు వ్యాపారం చేసిన సంఘాలకు రూ.7,500 ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. అంతకంటే తక్కువ వ్యాపారం చేసే సంఘాలకు రూ.5వేల గౌరవ వేతనం అందించనుంది.
చైర్మన్లకు వేతనం పెంపు నిర్ణయంతో గౌరవంతో పాటు మరింత బాధ్యత పెరిగింది. సహకార సంఘాల ద్వారా రైతులకు ఇబ్బందులు కలుగకుండా రుణాలు అందిస్తున్నాం. క్రాప్ లోన్లతో పాటు బంగారంపై రుణాలు ఇస్తున్నాం. యాసంగి, వానకాలం సీజన్లకు సంబంధించి ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నాం. రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకే కొనుగోలు చేస్తున్నాం. మా సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. ప్రభుత్వ నిర్ణయంతో సహకార సంఘాలు మరింత బలపేతం కానున్నాయి.
– శేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, షాబాద్