ఇబ్రహీంపట్నం, తాండూరు, ఏప్రిల్ 19 : ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయికి చేరడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్పల్లి, వికారాబాద్ జిల్లా బంట్వారంలో ఏకంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం.
అలాగే కులకచర్లలో 42 డిగ్రీలు, తాండూరులో 41.7, మన్నెగుడలో 40.5, మర్పల్లిలో 40.4, దోమలో 40.3, కోట్పల్లిలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమికి తాళలేక చెట్ల నీడ, శీతల పానీయాలవైపు పరుగులు పెడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తున్న జనం టోపీలు ధరిస్తున్నారు.