కబ్జాకు గురైన అటవీ భూములపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక నిఘా పెట్టింది. తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా రీ సర్వేకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని అటవీ భూముల్లో 15,600 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా తాండూరు రేంజ్ పరిధిలో 4,846 ఎకరాలు అన్యాక్రాంతం కాగా, వికారాబాద్, ధారూరు, కొడంగల్, పరిగి రేంజ్ల పరిధుల్లో 10756 ఎకరాల భూమి కబ్జా అయినట్లు జిల్లా అటవీ శాఖ పేర్కొంటున్నది. అనంతగిరి, దామగుండం, మర్పల్లి, కండ్లపల్లి, గట్కొండాపూర్, నాగారం, తిర్మలాపూర్, నజీరాబాద్, మహ్మదాబాద్, మైల్వార్, అడికిచెర్ల తదితర ప్రాంతాల్లో వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. వికారాబాద్, పరిగి, ధారూరు ఫారెస్ట్ రేంజ్ల పరిధుల్లో అటవీ భూములను ఫాంహౌస్లు, రిసార్ట్స్ ల నిర్వాహకులు కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక దృష్టి సారించిన అటవీ శాఖ అధికారులు అన్యాక్రాంతమైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలను ముమ్మరం చేశారు. ఇకముందు అటవీ భూములు కబ్జాకు గురికాకుండా సర్వే పూర్తి కాగానే పక్కాగా హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా అటవీ శాఖ నిర్ణయించింది.
వికారాబాద్, డిసెంబర్ 12, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో అధిక మొత్తంలో అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రధానంగా అనంతగిరి, దామగుండం, మర్పల్లి, కండ్లపల్లి, గట్కొండాపూర్, నాగారం, తిర్మలాపూర్, నజీరాబాద్, మహ్మదాబాద్, మైల్వార్, అడికిచెర్ల తదితర ప్రాంతాల్లో వేల ఎకరాల్లో అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, ధారూరు రేంజ్ల పరిధుల్లో 15,600 ఎకరాల్లో అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అత్యధికంగా తాండూరు అటవీ రేంజ్ పరిధిలో 4846 ఎకరాల్లో అటవీ భూములు అన్యాక్రాంతమైనట్లు జిల్లా అటవీ శాఖ గుర్తించింది. వికారాబాద్లో 2573, కొడంగల్లో 3679, ధారూరులో 1706, పరిగిలో 2798 ఎకరాలున్నాయి.
ధారూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దొర్నాల్ ప్రాంతంలో 1259 ఎకరాలు, కొడంగల్లోని నాగారం పరిధిలో 1722, తిర్మలాపూర్లో 484, పరిగిలో మహ్మదాబాద్లో 472, రంగంపల్లిలో 453, పుర్సంపల్లిలో 309, తాండూరులోని అడికిచెర్లలో 421, బంట్వారం, రొంపల్లిలో 459, మైల్వార్లో 311, వికారాబాద్లోని అనంతగిరిలో 100, మదన్పల్లిలో 993, ఎక్మామిడి, పుల్మామిడిల్లో 981 ఎకరాల్లో అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి.
వికారాబాద్, పరిగి, ధారూరు ఫారెస్ట్ రేంజ్ల పరిధిలో అటవీ భూములను పలు ఫాంహౌస్లు, రిసార్ట్ల నిర్వాకులు కబ్జా చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోకుండా తప్పుడు పత్రాలతో కోర్టుకు వెళ్తూ.. అటవీ భూములను కబ్జాలోనే ఉండేలా వ్యవహరిస్తున్నారు. అటవీ సిబ్బంది కొరతతో అటవీ భూములు అన్యాక్రాంతమవుతున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, ధారూరు రేంజ్ల పరిధుల్లో అన్యాక్రాంతమైన 15,600 ఎకరాల అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అటవీ శాఖ బ్లాక్ల వారీగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను సేకరించిన అధికారులు.. స్వాధీనం చేసుకునేలా పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. జిల్లాలోని అన్యాక్రాంతమైన అటవీ భూములు, జిల్లావ్యాప్తంగా ఉన్న అటవీ భూములన్నింటినీ జీఐఎస్ ద్వారా రీ-సర్వే చేసేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులకు జిల్లా అటవీ శాఖ అధికారులు విన్నవించారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి సర్వే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే పక్కాగా సర్వే చేపట్టనున్నారు.
జిల్లావ్యాప్తంగా ఇప్పటికే అటవీ శాఖ గుర్తించిన ప్రకారం 1191 కిలోమీటర్లలో అటవీ భూములకు హద్దులుండగా.. మరోసారి సర్వే నిర్వహించి ఫైనల్ హద్దులను కూడా గుర్తించనున్నారు. అనంతగిరి, పూడూరు, ధారూరు పరిసర ప్రాంతాల్లో వెలసిన రిసార్ట్లు, ఫాంహౌస్లపై కూడా జిల్లా అటవీ శాఖ అధికారులు నజర్ పెట్టారు. పలు ఫాంహౌస్లు, రిసార్ట్ల నిర్వాహకులు అటవీ భూములను కబ్జా చేసినట్లు గుర్తించిన అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. కబ్జాలో ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు అటవీ భూముల్లో నిర్వహిస్తున్న క్రషర్లను కూడా అధికారులు సీజ్ చేయడంతోపాటు జిల్లా అంతటా అటవీ భూముల్లో కొనసాగుతున్న అనుమతిలేని కార్యకలాపాలన్నింటిపై జిల్లా అటవీ శాఖ నిఘా పెట్టింది.
మరోవైపు జిల్లాలోని అటవీ ప్రాంత సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అటవీ భూములు కబ్జాలకు గురికాకుండా ఫెన్సింగ్, కందకాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అటవీ శాఖ యంత్రాంగం నిర్ణయించింది. సర్వే నిర్వహించి హద్దులు కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం భూములు అన్యాక్రాంతమైన ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. కబ్జాలకు పాల్పడినవారు ప్రతిఏటా కొంత అటవీ భూభాగాన్ని దున్నుతూ సాగు భూమిగా మారుస్తూ కబ్జా చేస్తూ వస్తున్నారు. సర్వే అనంతరం సంబంధిత శాఖల అధ్వర్యంలో అటవీ భూములు ఎంత వరకు ఉన్నాయనేది కూడా నిర్ణయించి ప్రత్యేకంగా హద్దులను ఏర్పాటు చేయనున్నారు. భూములకు హద్దులు ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తులో కబ్జాలకు చెక్ పెట్టేందుకు ఆస్కారముంది.
జిల్లాలో అన్యాక్రాంతమైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాం. ఇందుకుగాను జిల్లా అంతటా అటవీ భూముల రీ-సర్వేకు ఉన్నతాధికారులకు విన్నవించాం. అనుమతి వచ్చిన వెంటనే జిల్లా అంతటా సర్వే నిర్వహిస్తాం. అటవీ భూములను కబ్జా చేసి నిర్వహిస్తున్న రిసార్ట్లు, ఫాంహౌస్ల పరిసర ప్రాంతాల్లో సర్వే చేపట్టి ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటాం.
– డి.వెంకటేశ్వర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి