తాండూరు నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బయటపెట్టినందుకు సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. మొత్తం రూ.500 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే ప్రభుత్వానికి పంపించగా.. ఇప్పటికే రూ.300 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.50 లక్షల చొప్పన మంజూరు చేశారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ఇండస్ట్రియల్ పార్కు, వ్యవసాయ మార్కెట్, పాత తాండూరు ఫ్లైఓవర్, ప్రధాన రోడ్ల విస్తరణ, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, ఆటోనగర్ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తదితర పనులు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చొరవతో నియోజకవర్గానికి మంజూరయ్యాయి. రూ.20 కోట్లతో జినుగుర్తిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయనుండగా, భూ సేకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రోడ్ల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి.
-వికారాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ)
ప్రగతి పథంలో తాండూరు నియోజకవర్గం
తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎన్నడూలేని విధంగా భారీగా నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచాను. ప్రతిపాదించిన అభివృద్ధి పనుల్లో మెజార్టీ నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులకు సంబంధించి స్థల సేకరణ ప్రక్రియ పూర్తైన పనులకు టెండర్ల ప్రక్రియను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎమ్మెల్యే రోహిత్రెడ్డి