బొంరాస్పేట, జూన్ 13 : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో సోమవారంతో విజయవంతంగా ముగిసింది. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లాలో 42 వైద్య బృందాలను నియమించి అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో శిబిరాలను నిర్వహించింది.
కంటి సమస్యలున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి కండ్లద్దాలు, విటమిన్ మాత్రలు, చుక్కల మందును పంపిణీ చేశారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నిర్వహించిన కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి కంటి పరీక్షలను పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా వైద్య బృందాలు గత జనవరి నుంచి జూన్ 12 వరకు సెలవు దినాలు, శని, ఆదివారాలు తప్ప వారంలో ఐదు రోజులు నిరంతరంగా కంటి పరీక్షలు నిర్వహించారు.
4,83,790 మందికి కంటి పరీక్షలు
జిల్లాలోని 566 గ్రామాలు, 97 వార్డుల్లో శిబిరాలను నిర్వహించిన వైద్య బృందాలు 4,83, 790 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 64,794 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా దూరపు చూపు సమస్య ఉన్న 64,794 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశారు.