ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 2 : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలంలోని బండాలేమూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించటం ఖాయమని అన్నారు.
పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి భవిష్యత్లో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన సాయికుమార్కు రూ.44 వేలు, క్యామ మల్లయ్యకు రూ.37, 500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్ జ్యోతి, నీళ్ల భానుబాబు, సహకార సంఘం వైస్ చైర్మన్ క్యామ శంకర్, బీఆర్ఎస్ నాయకులు అల్వాల వెంకట్రెడ్డి, కాయితి మోహన్రెడ్డి, మైలారం విజయ్కుమార్ పాల్గొన్నారు.
రూ.32.42 కోట్లతో మురుగును తరలిస్తాం
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీ పరిధి పసుమాముల గ్రామంలోని పోచమ్మ, రాయన్ చెరువుల్లో నెలకొన్న మురుగు సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధలుతో కలిసి పసుమాముల గ్రామంలోని చెరువులను పరిశీలించారు. చెరువుల్లో మురుగు నీరు కలుస్తున్నదని గ్రామస్తులు ఇటీవల ఎమ్మెల్యేకు విన్నవించగా.. ఆయన స్పందించి సమస్యను స్వయంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు.
ఎల్బీనగర్, వనస్థలిపురం నుంచి వచ్చి కుంట్లూరు చెరువులో మురుగు కలువడంతో కలుషితమైన నీటిని తరలించేందుకు రూ.14 కోట్ల నిధులు వెచ్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా రూ. 32.42 కోట్లతో పసుమాముల రాయన్ చెరువులోని ము రుగు నీటిని గౌరెల్లి దగ్గర ఉన్న మూసీలో కలుపుతామని హామీ ఇచ్చారు. రాయన్ చెరువుకు ఘన చరిత్ర ఉన్నదని చెప్పారు. మురుగు నీటి తొలగింపు పూర్తయ్యాక రాయన్ చెరువు సుందరీకరణకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
కంటివెలుగు అద్భుతం
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కోరారు. అంతకుముందు పసుమాముల గ్రామంలో కొనసాగుతున్న కంటివెలుగు వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. పలువురికి నేరుగా కండ్లద్దాలు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్ హరిశంకర్, నాయకులు గౌని భాస్కర్గౌడ్, రాము, జైపాల్రెడ్డి, జగన్, ఈదమ్మల బలరాం, వెంకటేశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, సుమన్, నాగార్జున, పవన్, సూపరింటెండెంట్ ఇంజినీర్ హైదర్ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, డీఈఈ ఉషారాణి, ఏఈ నికేశ్, ఎస్ఎన్డీపీ అధికారులు కృష్ణయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.