ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో విస్మరణకు గురైన చెరువులు, చెక్డ్యాములు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గతంలో బీటలు వారి, పిచ్చి మొక్కలతో ఉన్న తటాకాలు, చెక్డ్యాములు కొత్త సొగసులను అద్దుకుని.. నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎండాకాలం వస్తుందంటేనే ఆందోళన చెందే అన్నదాతలు మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పనులతో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో ఆనందంగా ఉన్నారు. కాగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు, చెక్డ్యాముల మరమ్మతుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించింది. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఎప్పుడూలేని విధంగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఈ ఏడాది అలుగు దూకింది. భూగర్భ జలాలు పెరుగడంతో ఎండాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చని జిల్లాలోని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
షాద్నగర్, మే 1 : నాడు తుమ్మచెట్లు, లొట్టపీసు మొక్కలతో ఉండే చెరువులు నేడు జలకళతో నిండు కుండలను తలపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెగిన కట్టలు, మరమ్మతులకు నోచని చెరువులు, చెక్డ్యాంలు నేడు మిషన్ కాకతీయ పథకంతో కొత్త సొబగులను సంతరించుకున్నాయి. గత కొన్నేండ్లుగా నిండని చెరువులను చూసి డీలాపడిన రైతన్న నేడు నిండుకుండలా మారిన చెరువులను చూసి ఆనందపరవశుడవుతున్నాడు. ఎండాకాలం వస్తుందంటే ఆందోళన చెందే అన్నదాత నేడు భూగర్భ జలాలు నిండుగా ఉండడంతో.. పంటలు పండించవచ్చని సంతోషపడుతున్నాడు.
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని 175 చెరువులకు రూ.58.2 కోట్లను కేటాయించి మరమ్మతు పనులను చేపట్టారు. చేవెళ్ల పరిధిలో 30కి పైగా చెరువులు అభివృద్ధిలోకి వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. చెవేళ్ల డివిజన్లోని మిర్జాగూడ, గుండాల, కౌకుంట్ల, తల్లారాం, ఈర్లపల్లి, బతుకమ్మకుంట, సొరంగల్, నక్కలపల్లి, పెద్దమంగళారం, బాకారం, పోచమ్మకుంట, పహిల్వాన్, షాబాద్ చెరువులు అలుగుపారాయి. పలు గ్రామాల్లోని వాగులపై నిర్మించిన చెక్డ్యాంల్లో వర్షపు నీరు భారీగా చేరింది. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో సుమారు 50 చెరువులు అలుగు పారాయి. ఎన్నడూ లేనివిధంగా ఇబ్రహీంపట్నం పెద్దచెరువు అలుగు దుంకింది. చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోవడంతో ఆయా గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సహకరిస్తే ఎండాకాలం పంటలు పూర్తిగా చేతికి అందుతాయని రైతులు భావిస్తున్నారు.
ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టిందో ఆ పథకం ఫలాలు రైతులకు అందుతున్నాయి. గతంలో బీటలు వారి, పిచ్చి మొక్కలతో ఉన్న చెరువులు, కుంటలు నేడు జల కళతో ఉట్టిపడుతున్నాయి. రెండు సంవత్సరాల నుంచి కురుస్తున్న వర్షాలకు షాద్నగర్ నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలు, వాగులు పారాయి. చెరువులు, కాలువలతోపాటు కట్టలను, అలుగులను బలోపేతం చేయడంవల్లే వర్షపు నీరు నిలిచిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కేశంపేట మండలంలో అమ్మ చెరువు, బ్రహ్మ చెరువు, మేడి కుంట, రాయి కుంట, గాజుల కుంట, చౌలపల్లి చెరువు, కొత్తపేట చెరువు, తొమ్మిది రేకుల చెక్డ్యామ్, కొత్తమర్రి కుంట, కల్వల కుంట, కొత్త కుంట, పోచమ్మ చెరువు, దొంతిబాయి కుంట, ఊట చెరువు, బండ్ల కుంట, పెద్ద చెరువు, మోడి కుంట, కొత్త చెరువు, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని అన్ని చెరువులు, కుంటలు, కొత్తూరు, నందిగామ మండలాల్లోని నర్సప్పగూడ, కుమ్మరికుంట చెరువులు, అక్కమ్మ చెరువు, కొత్తూరు, పెంజర్ల, మేకగూడ, నందిగామ చెరువులు, ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట చెరువు, మొగిలిగిద్ద చెరువు, బొబ్బిలి చెరువు, రాయికల్, చిల్కమర్రి, బూర్గుల, కమ్మదనం, లింగారెడ్డిగూడ చెరువులతో పాటు అన్ని కుంటలు, చెక్డ్యాముల్లో జల కళ సంతరించుకున్నది. ఎండాకాలంలో సాగుచేసే పల్లి, వరి, మిరప, కూరగాయల పంటలతో పాటు ఉద్యానవ పంటలకు సాగు నీరు అందుతున్నదని రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
షాద్నగర్ నియోజకవర్గంలో 90,332 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు తమ పంటలను సాగుచేస్తారు. 111 రెవెన్యూ గ్రామాలతోపాటు 95 గ్రామపంచాయతీలు, ఆరు మండలాలున్నాయి. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ 55,618 మంది రైతులతో పాటు వేలాది మంది సామాన్య ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 46,825 హెక్టార్ల భూ విస్తీర్ణంలో ఆయా గ్రామాల రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వర్షాధార పంటలతోపాటు బోరుబావుల ద్వారా పంటలను సాగుచేస్తున్నారు. భూగర్భ జలాల పెరుగుదలతోపాటు ఉపాధిని చూపాలనే లక్ష్యంతొ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది. చెరువులను మరింత అభివృద్ధి చేసి ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంది. షాద్నగర్పరిధిలో 534 చెరువులు, కుంటలున్నాయి. దీంతో 15 వేల ఎకరాలకు పైగా భూమికి సాగునీరందనున్నది. చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.3278. 06 లక్షల నిధులు కేటాయించగా ఇందులో రూ.2293.5 లక్షల నిధులను ఖర్చుచేసింది. 141 చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయి. మొదటి, రెండో విడతలో కేశంపేట మండలంలో 48 చెరువులు, కొందుర్గు, చౌదరిగూడెం మండలాల్లో 34, కొత్తూరు, నందిగామ మండలాల్లో 21, ఫరూఖ్నగర్ మండలంలో 38 చెరువుల్లో పూడిక తీసి, కట్ట మరమ్మతు పనులు చేశారు. మూడో విడుతలో ఆరు మండలాల్లో కలిపి 53 చెరువులను రూ.7.8 కోట్లతో అభివృద్ధి చేశారు.
– శ్రీశైలం, రైతు, చౌలపల్లి, కేశంపేట మండలం
ఈ వానకాలంలో కురిసిన వానలకు మా ఊర్లో చెరువులకు నీళ్లు వచ్చినవి. మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టను అభివృద్ధి చేసిండ్రు. వచ్చిన నీళ్లన్నీ బయటకు పోకుండా నిలిచినవి. దీంతో చెరువు చుట్టుపక్కల పొలాల్లోని బోరుబావుల్లో నీళ్లు పెరిగాయి. ఎండాకాలంలో కూడా పంటను సాగుచేసేందుకు రైతులు వెనుకాడరు.
– వెంకటయ్య, చింతగూడ, ఫరూఖ్నగర్ మండలం
ఈ ఎండాకాలంలో కరువు అనే మాట ఉండదు. ఎందుకంటే మా ఊర్లో ఉన్న రెండు చెరువుల్లోకి నీళ్లు వచ్చినవి. ప్రభుత్వం చెరువు పనులు చేయడంతో నీళ్లు బాగా నిల్చినవి. బోరుబావుల్లో నీళ్లు పెరుగుతాయి కాబట్టి రైతు జర ధైర్యంగా పంటలు వేశాడు. ఎలాగో కరెంట్కు ఢోకా లేదు కాబట్టి యాసంగిలో పంటలు ఎండవని అనుకుంటున్నం.