ఆదిబట్ల, జనవరి 3 : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ సముదాయాల నిర్మాణం చేపడుతున్నది. ఇందులో భాగంగానే ఆదిబట్లలో నిర్మాణమవుతున్నది. ఆదిబట్ల మున్సిపాలిటీ కేంద్రంలోని కొంగరకలాన్కు వెళ్లే దారిలో సర్వే నం.442లో ప్రభుత్వం సమీకృత మోడల్ మార్కెట్ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించింది.
మార్కెట్ను ప్రభుత్వం రూ.1.5 కోట్ల నిధులతో నిర్మిస్తున్నది. ఇప్పటికే నిర్మాణ పనులు 75 శాతం పూర్తయ్యాయి. ఒకే చోట మాంసం, కూరగాయలు, పూలు, పండ్లు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. కూరగాయలకు 14, మాంసానికి 14 మడిగెల చొప్పున కేటాయించారు. నిర్మాణం మధ్యలో ఖాళీ స్థలంలో పూలు, పండ్లు అమ్ముకోవడానికి తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఈ మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఎంతో మందికి ఉపాధి అవకాశాలు
ఆదిబట్ల మున్సిపాలిటీలో మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 200 నుంచి 400 మంది వరకు పైగా చిరువ్యాపారులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి.మున్సిపల్ అధికారులు ప్రత్యేక చొరవతో నిర్మాణ పనులు చేపడుతున్నారు.ప్రజారోగ్యశాఖ, ప్రభుత్వం అందించే నిధులతో పనులు చకచకా సాగుతున్నాయి.
అన్ని రకాల సరుకులు ఒకేచోట..
– అమరేందర్రెడ్డి, ఆదిబట్ల కమిషనర్
పట్టణ ప్రజలకు అన్ని రకాల సరుకులు ఒకేచోట లభించడానికే మోడల్ మార్కెట్ నిర్మిస్తున్నాం. ఇండ్ల మధ్య వెజ్, నాన్వెజ్ దుకాణాలు ఏర్పాటు చేస్తే వాసనతో పాటు అంటురోగాలు వ్యాప్తి చెంది.. దుర్గంధం వెదజల్లే ప్రమాదం ఉండటంతో గ్రామానికి కొద్దిదూరంలో నిర్మాణం చేపడుతున్నాం. ఇక్కడ దాదాపు అన్ని రకాల వస్తువులు, సరుకులు లభిస్తాయి. ఈ మార్కెట్ ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ పనులు పూర్తికాగానే షటర్లు మంజూరు చేస్తాం.
ప్రభుత్వ కృషి మరువలేనిది : పల్లె గోపాల్గౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి చేస్తున్న కృషి మరువలేనిది. రోడ్లపై వ్యాపారులు కూరగాయలు, నాన్ వెజ్, పండ్లు, పూలు అమ్మేవారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగేది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మోడల్ మార్కెట్ నిర్మాణంతో అన్ని దుకాణాలు ఒకేచోటికి రానున్నాయి. దీంతో ప్రజలకు మరింత సులభతరంగా కొనుగోళ్లు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఆదిబట్ల, కొంగర గ్రామాలకు అందుబాటులో ఉంటుంది.