సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కార్ పని చేస్తున్నది. గడిచిన జూన్ నెలలో రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ అర్చకులపై వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప, నైవేద్యం అలవెన్స్ను రూ.10వేలకు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని 66 ఆలయాలకు ప్రయోజనం కలుగనున్నది. దీంతో అర్చకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ బ్రాహ్మణులకు తీపి కబురందించారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజానికి ఇచ్చిన మాట ప్రకారం.. ధూప, దీప, నైవేద్యం అలవెన్స్ను రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో 66 దేవాలయాలకు ప్రయోజనం కలుగనుంది. అలవెన్స్ పెంపుపై బ్రాహ్మణ సమాజం ఆనందం వ్యక్తం చేస్తున్నది. గొప్ప ఆధ్మాత్మికవేత్త, దార్శనికుడు కేసీఆర్ అంటూ కొనియాడుతున్నది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని, తమ ఆశీస్సులు ఎప్పటికీ కేసీఆర్కు ఉంటాయని అర్చకులు దీవిస్తున్నారు.
నెలనెలా రూ.6వేల వేతనం
రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఆలయాలు ప్రాభవాన్ని కోల్పోయాయి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించేవారే కరువయ్యారు. ఫలితంగా పేద బ్రాహ్మణులు సైతం ఆర్థిక ఇబ్బందులతో అల్లాడారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో అటు ఆలయాలకు పూర్వ వైభవం తేవడంతోపాటు అర్చకులను సైతం ఆదుకునేలా కార్యక్రమాలను అమలు చేశారు. ఇందులో భాగంగా ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలను నిర్విఘ్నంగా కొనసాగేలా చూడడంతోపాటు ఆయా ఆలయాలపై ఆధారపడి జీవిస్తున్న అర్చకులకు భరోసా కల్పించేందుకు ధూప, దీప, నైవేద్య పథకాన్ని అమలు చేశారు. ధూప, దీప నైవేద్యాల కోసం రూ.2వేలు, అర్చకులకు రూ.4వేల చొప్పున 2015 జనవరి 9 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వస్తున్నది. గత జూన్ నెలలో రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ధూప దీప నైవేద్య పథకానికి అందిస్తున్న అలవెన్స్ను రూ.10వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో అర్చకులు ఇకపై నెలనెలా రూ.6వేల వేతనాన్ని అందుకోనున్నారు. అలవెన్స్ పెంపునకు సంబంధించి మంగళవారం దేవాదాయ శాఖ అలవెన్స్ పెంపుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పెంపుతో రంగారెడ్డి జిల్లాలో 66 దేవాలయాలతోపాటు అయా ఆలయాలకు సంబంధించిన అర్చకులకు ప్రయోజనం చేకూరనున్నది. సమైక్య పాలనలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని విస్మరించారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సరైన గుర్తింపు ఇచ్చారని బ్రాహ్మణ సమాజం సంతోషం వ్యక్తం చేస్తున్నది.
విద్యా, ఉపాధి పరంగా..
నిరుపేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. 2017లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుతో అనేక మంది బ్రాహ్మణులకు ప్రయోజనం చేకూరుతున్నది. దేవాలయాల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ ఎంపవర్మెంట్ స్కీం కింద గరిష్టంగా రూ.5లక్షల గ్రాంటును అందజేస్తున్నది. దీంతో అనేక మంది బ్రాహ్మణులకు ఉపాధి లభిస్తున్నది. బ్రాహ్మణ పిల్లలు చదువుకునేందుకు విద్యా రుణాలను సైతం ఇస్తున్నది.
ఆలయాల్లో కైంకర్యాలు సక్రమంగా జరుగుతాయి : సురేశ్స్వామి, చిలుకూరు సుందరేశ్వరస్వామి ఆలయ అర్చకుడు
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. దానికి ప్రత్యేక నిదర్శనం యాదాద్రిగుట్ట. ఉమ్మడి రాష్ట్రంలో ఆలయాలకు తగిన ప్రాధాన్యత లభించలేదు. భక్తుల ఆదరణ చూరగొనడానికి ప్రభుత్వం ధూప దీప నైవేద్య పథకం కింద ప్రతి ఆలయానికి రూ.10 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషకరం. దీంతో ఆలయాల్లో దైవ కైంకర్యాలు సక్రమంగా జరుగుతాయి. ఆధ్మాత్మిక వాతావరణం పెరుగుతుంది. ప్రశాంతత నెలకొంటుంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు తెలంగాణలో నిరాదరణకు గురైన ఆలయాలు ప్రజల ఆదరణ పొందాయి. కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
సీఎం కేసీఆర్తోనే అర్చకులకు గుర్తింపు : యాదగిరిస్వామి, అర్చకుడు, కడ్తాల్ మండలం
ప్రత్యేక రాష్ట్ర ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపారు. ఆలయాలను అభివృద్ధి చేయడానికి ఆయన వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అర్చకులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సీఎం కేసీఆర్ అర్చకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూప దీప నైవేద్య పథకంలో అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు అర్చకుల ఆశీర్వచనాలు, దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు : సాయి, చందిప్ప మరకత శివాలయ పూజారి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధూప, దీప, నైవేద్య పథకం కింద దేవాలయాలకు రూ.10 వేలు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆలయాల్లో సంవత్సరాల తరబడి పూజలు నిర్వహిస్తున్న అర్చకులను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ అర్చకులకు ప్రత్యేక భవనంతోపాటు, రూ.10 వేలు ఆలయాలకు, అర్చకులకు ఇవ్వడం చాలా సంతోషకరం.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం : శ్రీపాద్, పూజారి, చేవెళ్ల గ్రామం
ధూప, దీప నైవేద్యం పథకం కింద రూ.10వేల పెంపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దీంతో అర్చకులు ఇకపై నెలనెలా రూ.6వేల వేతనాన్ని అందుకోనున్నారు. గత ప్రభుత్వాలు పూజారులను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూజారులకు గౌరవం పెరిగింది. పాడుబడ్డ ఆలయాలు కూడా ధూప, దీప, నైవేద్యాలతో విరజిల్లుతున్నాయి. సీఎం కేసీఆర్కు పూజారులంతా రుణపడి ఉంటాం.