పరిగి, ఏప్రిల్ 7 : ఈ నెల 11న ఢిల్లీని దిగ్బంధించి వరిపోరును ప్రపంచానికి చాటుతామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ బీజేపీకి బడా పారిశ్రామికవేత్తల సంక్షేమమే తప్ప.. తెలంగాణ రైతుల గోస పట్టదా.. అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతులకు సరిపడా సాగునీరు, పంట పెట్టుబడి సాయం అందించి అండగా ఉంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ధాన్యం కొనకుండా అన్నదాతలను అరిగోస పెడుతున్నదన్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే ఊరుకునేదిలేదని, బీజేపీ నేతలను బయట తిరుగనివ్వమని హెచ్చరించారు. అలాగే షాద్నగర్లో నిర్వహించిన ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. బీజేపీకి ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తప్ప.. ధాన్యాన్ని కొనే సోయి లేదన్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి పోరు కొనసాగుతున్నది. ఆయా ప్రాంతాల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
కేంద్రంలోని చెవిటి బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల గోస పట్టడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. కేంద్రంలోని ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుందని ఆమె దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ఒక్క పిలుపుతో రైతులకు అండగా గులాబీదండు కదిలి రోడ్లపై ఆందోళనలు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే రాష్ట్రంలోని 7 మండలాలను కేంద్రం ఆంధ్రాలో కలిపిందన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని పలుమార్లు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినా ఇవ్వలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికైనా జాతీయ హోదా ఇవ్వాలని కోరితే ఇవ్వలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై ఈర్షాద్వేషాలు పెంచుకున్నారని మండిపడ్డారు.
నిజమైన రైతు పాలకుడిగా ఉండడం వల్లే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఏ పంటలైనా కొనుగోలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడిందని పేర్కొన్నారు. గతంలో అరకొర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి నామమాత్రంగా కొనుగోళ్లు చేపట్టేవారని, డబ్బులు ఎప్పుడు వచ్చేవి తెలియని పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో తాము ముందు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కొనుగోలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 7 నుంచి 8వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి గ్రామాల్లోనే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేపట్టామన్నారు. గతంలో రాష్ట్రంలో 40లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి జరిగితే ప్రస్తుతం 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్లు మంత్రి తెలిపారు. మోదీ ప్రభుత్వం మెడలు వంచి వడ్లు కొనేలా చేస్తామన్నారు. బీజేపీ నేతలకు ఇక్కడ తిరిగే హక్కు లేదన్నారు.
యాసంగి ప్రారంభంలో కేంద్రం వడ్లు కొనుగోలు చేయమని చెప్పినందున వరి వేయవద్దని సీఎం కేసీఆర్ రైతులను కోరగా బీజేపీ నేతలు రెచ్చగొట్టి వరి వేసేలా చేశారని, రైతులు కష్టాల్లో ఉంటే ముఖం చాటేశారన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న టీఆర్ఎస్ పార్టీకే తెలంగాణలో స్థానముందని, మరో పార్టీకి లేదని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు న్యాయం కోసం ఈనెల 11న ఢిల్లీ నడివీధిలో గర్జిస్తామని, తెలంగాణ రైతుల పక్షాన పోరాడతామని మంత్రి తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు 8వ తేదీ శుక్రవారం ప్రతి గ్రామంలో రైతుల ఇండ్లపై నల్లజెండాలు ఏర్పాటుచేసి నిరసన తెలపడంతోపాటు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని మంత్రి సూచించారు. రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాయకులను గ్రామాల్లో నిలదీయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లాలోని మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండలాల రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
రైతుకు న్యాయం జరిగే వరకూ ..
రైతుకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి స్పష్టం చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కిరికిరి పెట్టడం సరికాదన్నారు. ప్రతి వస్తువుపై కేంద్రం జీఎస్టీ విధిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి వడ్లు కొనుగోలు చేశారన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రతి గింజా కొనుగోలు చేసేంత వరకూ టీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతాయన్నారు.
కేంద్రంతో వడ్లు కొనిపించాలి
కేంద్రం వడ్లు కొనుగోలు చేయనందున వరి వేయవద్దని సీఎం కేసీఆర్ రైతులకు సూచించగా వరి వేయండి మేము కేంద్రంతో కొనిపిస్తామని రైతులను తప్పుదోవ పట్టించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నేడు ముఖం చాటేశారని, బీజేపీ దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వంతో వడ్లు కొనిపించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంతో వడ్లు కొనుగోలు చేయిస్తామన్న దద్దమ్మలు ఎక్కడున్నారని, మోదీ కండ్లు తెరిచి వడ్లు కొనేంత వరకూ కేంద్రాన్ని వదిలేది లేదన్నారు.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోంది..
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అన్ని విషయాల్లో వివక్ష చూపిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.12వేల కోట్లు వెచ్చించి రైతులు పండించిన అన్ని పంటలను కొనుగోలు చేసిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు ద్వారా పెట్టుబడిసాయం, రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు రైతుబీమా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండంటూ కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ అవహేళనగా మాట్లాడడం తగదన్నారు.
అన్ని విషయాల్లో రాష్ర్టానికి అన్యాయమే..
కేంద్ర ప్రభుత్వం జీడీపీ పెంచుతామని గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది తప్ప మరోటి చేయలేదని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. ధరలు పెంచిన సమయంలో కేంద్రం సెస్ పెంచడం ద్వారా రాష్ర్టాలకు అందులో వాటా ఇవ్వడం లేదన్నారు. కేంద్రం రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాల్సిన నిధులు సైతం ఇవ్వడం లేదన్నారు. ప్రతి విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం రైతుల ఇండ్లపై నల్లజెండా ఏర్పాటు చేయాలని, కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేయాలన్నారు.
అంబానీ, అదానీల కోసం పనిచేస్తున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీల కోసమే పనిచేస్తుందని, అందువల్లే వారు మరింత కుబేరులవుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య విమర్శించారు. కేంద్రానికి పన్నుల రూపంలో రూ.100 చెల్లిస్తే రాష్ర్టానికి రూ.40 ఇస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వానికి సహకరించకుండా కేంద్రం వివక్ష చూపుతున్నదన్నారు. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటుచేసి, ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టి, 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటుతోపాటు రైతువేదికలు నిర్మించగా బీజేపీ, కాంగ్రెస్ నాయకుల కండ్లకు ఇవేవి కనిపిస్తలేవన్నారు.
రైతుల కోసం ఉద్యమం చేపడుతాం..
రాష్ట్రంలోని రైతులకు న్యాయం జరిగే వరకూ టీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి పోరాడుతున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి పేర్కొన్నారు. గతంలో కరెంటు కోసం పొలాల వద్ద రైతులు పడిగాపులు పడేవారని, సీఎం కేసీఆర్ కృషితోనే 24 గంటలు కరెంటు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి రాష్ట్రం సాధించుకున్నామని, కేంద్రం వడ్లు కొనుగోలు చేసేలా రైతుల కోసం మరో ఉద్యమం చేపడుతామన్నారు.