‘సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 12 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటరు తుది జాబితాను విడుదల చేసి, ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైన అధికార యంత్రాంగం షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లలో మరింత వేగాన్ని పెంచనున్నది. నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ రెండున్నర నెలల కిందే అభ్యర్థులను ప్రకటించి సమరానికి సై అంటున్నది. ప్రజలతో మమేకమై ప్రచారం జోరు పెంచి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నది. వార్ వన్ సైడే అన్నట్లుగా ప్రజలు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతుండడంతో ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండడంతో ఆయా పార్టీల శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు.
వికారాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ర్టాలతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లను దాఖలు చేసేందుకు నవంబర్ 10 వరకు ఎన్నికల సంఘం గడువిచ్చింది. నవంబర్ 13న నామినేషన్లను జిల్లా ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువిచ్చింది. మరోవైపు నవంబర్ 30న పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపుతోపాటు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
జోరుగా ప్రచారం
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వికారాబాద్ నియోజకవర్గం నుంచి మెతుకు ఆనంద్, తాండూరు అభ్యర్థిగా పైలట్ రోహిత్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ అభ్యర్థిగా పట్నం నరేందర్రెడ్డి, పరిగి నియోజకవర్గ అభ్యర్థిగా కొప్పుల మహేశ్రెడ్డిలను ప్రకటించగా.. జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థుల వెతుకులాటలోనే ఉండడం గమనార్హం. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రగతి నివేదిన సభలతో నాలుగు నియోజకవర్గాల్లోనూ ఒక దశ ప్రచారం పూర్తి చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయా నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామస్థాయిలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఊరూరా ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం
నవంబర్ 30న జరుగనున్న ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఓటరు తుది జాబితాను విడుదల చేసిన అధికారులు మిగతా ఎన్నికల పనుల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల నిర్వహణకు సుమారు 8600 సిబ్బంది అవసరమని గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారులు త్వరలోనే ఎన్నికల సిబ్బందిని నియమించి, వారికి శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సరిపడా ఈవీఎంలతోపాటు అదనంగా ఈవీఎంలను జిల్లాలో అందుబాటులో ఉంచారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకెళ్లడం, పోలింగ్ పూర్తయిన అనంతరం తిరిగి స్ట్రాంగ్రూంకు తీసుకెళ్లే వరకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తుండడంతోపాటు రూట్ మ్యాప్లను కూడా తయారు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్తోపాటు మంచినీటి సౌకర్యం తదితర సౌకర్యాలను ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించిన జిల్లా యంత్రాంగం.. ఓటర్లకు కూడా ముందస్తుగా ఈవీఎంల పనితీరుపై గత నెల నుంచి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్లో ఉత్తేజం.. ప్రతిపక్షాల్లో నిస్తేజం
రంగారెడ్డి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైంది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడంతో జిల్లాలో 8 నియోజకవర్గాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. సోమవారం నుంచే జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. నవంబర్ 30న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. గత కొంతకాలంగా ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో వేగాన్ని మరింత పెంచింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాజకీయ పార్టీలు సైతం అలర్ట్ అయ్యాయి. సీఎం కేసీఆర్ నెలన్నర రోజుల క్రితమే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రజలతో మమేకమై పనిచేస్తుండడంతో పార్టీ శ్రేణులు దూకుడుమీదున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో నేటికీ నిస్తేజం వెన్నాడుతున్నది.
జిల్లా ఓటర్లు 33,56,056
రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 33,56,056 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 17,38,994., స్త్రీలు 16,15,876 మంది ఉన్నారు. 404 మంది థర్డ్ జెండర్, ఎన్ఆర్ఐ ఓటర్లలో పురుషులు 153, మహిళలు 39 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లలో పురుషులు 568, మహిళలు 22 మంది ఉన్నారు. అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,98,154 మంది ఉండగా.. అత్యల్పంగా షాద్నగర్ నియోజకవర్గంలో 2,25,524 మంది ఉన్నారు. జిల్లాలో 18 నుంచి 39 ఏండ్ల వయసులోపు వారు 16,70,492 మంది ఉండగా.. 40-59 ఏండ్లలోపు వారు 12,19,372 మంది, 60-99 ఏండ్ల వయసు వారు 4,54,878 మంది ఉన్నారు. వందేండ్లు పైబడిన ఓటర్లు జిల్లాలో 532 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా 66,359 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లే విజయావకాశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నారు.
1,685 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అసెంబ్లీ ఎన్నికలకు 3,369 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 1,685 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేయనున్నారు. 40 మహిళా పోలింగ్ కేంద్రాలను, 52 మోడల్ పోలింగ్ కేంద్రాలను, 8 దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అక్రమ మద్యం, డబ్బుల పంపిణీని అడ్డుకునేందుకు 50 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి స్టాటిక్ సర్వేలెన్స్ టీంలతో పటిష్ట నిఘాను ఉంచనున్నారు.
5,389 వీవీ ప్యాడ్స్ వినియోగం
ఓటింగ్ కోసం 5,389 ఈవీఎం వీవీ ప్యాడ్స్ను వినియోగించనున్నారు. 5,483 కంట్రోల్ యూనిట్లు, 6,961 బ్యాలెట్ యూనిట్లను రెడీ చేశారు. వీటికి సంబంధించి ఫస్ట్ లెవెల్ తనిఖీ పూర్తయింది. ఈసారి ఎన్నికల్లో అత్యాధునిక ఎం3 ఈవీఎం మిషన్లను పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు బిజీబిజీ
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి రంగారెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్రావులతోపాటు ఇతర మంత్రులు జిల్లాలో పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ను నింపుతున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో మాత్రం నిస్తేజం అలుముకుంది. రెండు పార్టీల్లో సీట్ల లెక్కతేలక అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది. ప్రచారం చేయాలా? వద్దా? అనే విషయంలో ముందుకెళ్లలేక, వెనక్కి రాలేక గందరగోళంలో ఉన్నారు.
‘కోడ్’ నిబంధనలివే..
షెడ్యూల్ విడుదల చేసిన దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కొత్త పథకాలను ప్రకటించేందుకు వీల్లేదు. ఎన్నికల కోడ్ను ఎవరూ ఉల్లంఘించినా తగు చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలోని పోస్టర్లు, బ్యానర్లను 24 గంటల్లో తొలగించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లను 48 గంటల్లో తొలగించాలని, ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు, గోడపత్రికలను అతికించాలని, అనుమతిలేనట్లయితే 72 గంటల్లో తొలగించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు వరకు ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచారాన్ని నిషేధిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రచారం చేసేందుకు వీలులేదు. ప్రచారంపై నిఘా పెట్టేందుకు మొబైల్ బృందాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దృష్ట్యా జిల్లా అంతటా పోలీసులు నిఘా పెంచనున్నారు. జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్పోస్టులతోపాటు అంతర్జిల్లా చెక్పోస్టులను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. సంబంధిత చెక్పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. మరోవైపు రూ.50 వేలకు మించి నగదు తరలించేవారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. రూ.50 వేలకు మించి డబ్బు తరలించే క్రమంలో సంబంధిత డబ్బులకు సరైన ధ్రువీకరణ పత్రాలను చూపించాల్సి ఉంటుంది, సరైన ఆధారాలు లేనట్లయితే నగదును సీజ్ చేస్తారు.
రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు
జరుగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఎల్బీనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, కల్వకుర్తి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి
రంగారెడ్డి జిల్లాలో 521 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
నియోజకవర్గం: పోలింగ్కేంద్రాలు
ఇబ్రహీంపట్నం: 75
ఎల్బీనగర్ :35
మహేశ్వరం :83
రాజేంద్రనగర్: 119
శేరిలింగంపల్లి :37
చేవెళ్ల : 58
కల్వకుర్తి : 66
షాద్నగర్ 48
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ నవంబర్ :3
నామినేషన్లకు ఆఖరు తేదీ :నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన :నవంబర్ 13
ఉప సంహరణకు గడువు :నవంబర్ 15
పోలింగ్ తేదీ నవంబర్ :30
ఓట్ల లెక్కింపు డిసెంబర్ :3