అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర సర్కార్ కృషి
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
మల్కాపూర్, చేవెళ్ల, ఆలూర్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు
పాల్గొన్న రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 14 : ప్రభుత్వం పాడి రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల, మల్కాపూర్, ఆలూరులో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అన్నదాతల అభ్యున్నతి కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు. మల్కాపూర్లో బర్రెల కొనుగోలు కోసం 19 మంది పాడి రైతులకు రూ. 40 వేల చొప్పున సబ్సిడీ అందించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రూ. 90 లక్షలు మంజూరు చేశామన్నారు.
పంటలతో పాటు పాడిలో కూడా రైతులు అభివృద్ధి చెంది ముందుకు సాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వర్షాధార అభివృద్ధి పథకం కింద 19 మంది పాడి రైతులకు రూ.40వేల చొప్పున సబ్సిడీ అందజేయడంతో వారు బర్రెలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సోమవారం పాడి రైతులకు బర్రెల పంపిణీ కార్యక్రమం, చేవెళ్లలోని డీసీసీబీ బ్యాంకు ఏటీఎం ప్రారంభోత్సవం, ఆలూరు గ్రామంలో సహకార సొసైటీ గోదాం, కోల్డ్ స్టోరేజ్ సెంటర్, పశువుల దవాఖాన కేంద్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. పాడితో వచ్చిన ఆదాయం రైతులకు పంటలు పండించుటలో చేదోడువాదోడుగా ఉంటుందని, ఆ విధంగా రైతులు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో 5 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వరి పండించేదని, ప్రస్తుతం 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు వరి పండుతున్నదని తెలిపారు. రైతు బీమాతో సంవత్సరానికి రూ.1200 కోట్ల నుంచి 1400 కోట్ల వరకు బడ్జెట్ ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
మరణించిన అన్నదాతలకు రైతు బీమా
మల్కాపూర్ గ్రామంలో ఇప్పటివరకు ఏడుగురు రైతులు మరణించడంతో వారికి తక్షణమే రూ.5లక్షల చొప్పున రైతు బీమా వర్తించేలా కుటుంబసభ్యుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. మల్కాపూర్లో 19 మంది పాడి రైతులకు రూ.40వేల చొప్పున సబ్సిడీ అందజేసినట్ల, జిల్లావ్యాప్తంగా రూ.90 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దీనికంటే అద్భుతమైన పథకం దళిత బంధు పథకమని, ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రాష్ర్టంలోని ప్రతి నియోజకవర్గానికి 2 వేల మంది చొప్పున దళిత బంధు ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
రైతు బంధుతో పంట సాయం
పాడి రైతుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, రైతు బంధుతో రైతులకు ఆదుకుంటూ వారి అభివృద్ధికి పాటు పడుతున్నారని జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తి పరిస్థితి నేరుగా తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటుంన్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. రైతులను రైతు బంధుతో ఆదుకుంటున్నారని, కుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రైతు బీమా వర్తించేలా రూ.5 లక్షలు వారి ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, ఆలూరు సర్పంచ్ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ వెంకటేశ్ యాదవ్, ఆలూరు ఎంపీటీసీలు నరేందర్చారి, యాదమ్మ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటరంగారెడ్డి, చేవెళ్ల పట్టణ మాజీ అధ్యక్షుడు చింటూ, సివిల్ సైప్లె జిల్లా సభ్యుడు రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి, ఏడీఏ రమాదేవి, ఏవో కృష్ణమోహన్, ఎంపీడీవో హరీశ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఖాళీ స్థలాలు ఉన్న పేదలకు ఇండ్ల నిర్మాణానికి నిధులు
గ్రామంల్లో ఖాళీ స్థలాలు ఉన్న పేదలకు ఇండ్లు నిర్మించుకునేందకు నిధులు కేటాయించే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. షాబాద్లో పెద్దపెద్ద పరిశ్రమలు వెలువడ్డాయని.. వాటి ద్వారా ఉద్యోగ కల్పనకు ఉపయోగపడుందన్నారు. 4 లేన్ల రహదారికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక చొరవతో ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమన్నారు. అనంతరం ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు మొదటి బహుమతి రూ.30 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, షీల్డ్లను మంత్రి సబితారెడ్డి విజేతలకు అందజేసిన అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఆలూరు ప్రభుత్వ పాఠశాలకు స్వచ్ఛందంగా బెంచీలు ఏర్పాటు చేయిస్తానని ఉప సర్పంచ్ కసిరె వెంకటేశ్యాదవ్ మంత్రి సబితారెడ్డికి హామీ ఇవ్వడంతో అభినందించారు.