వికారాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): అనుమతుల్లేని రిసార్టులపై జిల్లా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరిహిల్స్కు రోజుకు ఐదు వేల వరకు పర్యాటకులు వస్తుండడంతో వారిని ఆకర్షించేందుకు అనంతగిరి చుట్టూ పదుల సంఖ్యలో ప్రైవేట్ రిసార్టులు వెలిశాయి. అందులో చాలావరకు ఎలాంటి అనుమతుల్లేకుండానే నైట్ క్యాంపింగ్, గేమింగ్ క్లబ్, అడ్వెంచర్ ట్రిప్, బోటింగ్ తదితర వాటిని నిర్వహిస్తున్నాయి.
రోజుకు ఒక్కో జంటకు రూ.2500 నుంచి రూ.3000 వరకు వసూలు చేస్తున్నాయి. అయితే గత మూడేండ్లుగా పదుల సంఖ్యలో రిసార్టులు నడు స్తున్నా పట్టించుకోని పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖల అధికారులు ఇటీవల అనుమతులుం టేనే కొనసాగించాలని..లేకుంటే మూసివేయాలని ఆదేశిస్తూ వికారాబాద్ మండలంలోని గోధమగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని వైల్డర్నెస్ క్యాంప్సైట్, పెంగ్విన్, మూన్లైట్ అడ్వెంచర్, టిక్కీ విలేజ్, నేచర్ రిట్రీట్, అవని ఫార్మ్ రిసార్ట్లతోపాటు పూడూరు మండలంలోని మన్నెగూడ సమీపంలోని మరో మూడు రిసార్టులకు రెండుసార్లు నోటీసులు జారీ చేసి మూసివేయించారు. వికారాబాద్, పూడూరు మండలాల్లో చాలా రిసార్టులున్నప్పటికీ కేవలం 9 రిసార్టులను మూసివేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని వికారాబాద్, పూడూరు, ధారూరు మండలాల్లో రిసార్టులు, క్యాంప్సైట్, గేమింగ్ క్లబ్, అడ్వెంచర్ క్లబ్లు పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సాఫీగా సాగిన వాటికి ఇప్పుడు అనుమతులు తీసుకోవాలని చెబుతున్న ఆయా శాఖల అధికారులు ఏనాడు కూడా ఏ ఒక్క రిసార్టును కూడా తనిఖీ చేసిన దాఖలాల్లేవు. అంతేకాకుండా పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులైతే రిసార్టుల నిర్వా హకులతో సత్సంబంధాలు కొనసాగించారు. మామూళ్లకు లొంగిపోయారు. గతంలో జిల్లాలో పనిచేసి న ఓ పోలీస్ అధికారికి ఓ రిసార్టులో పర్మినెంట్ రూమ్ను కేటాయించడం గమనార్హం. ఆ అధికారి ప్రతిరోజూ రాత్రి ఆ రిసార్టుకు వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
రిసార్టులలో ఏదైనా ప్రమాదం జరిగి బయటికి వస్తే తప్ప రిసార్టుల జోలికి పోలీసులు, ఇతర శాఖల అధికారులు వెళ్లేవారుకాదు. దీంతో అప్పుడు సక్రమం అయినది.. ఇప్పుడు అక్రమమా అంటూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుండడం శుభ పరిణామమే అయినప్పటికీ.. సంబంధిత శాఖల అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేదనే ఆరోపణలున్నాయి.
మరోవైపు కొన్ని రిసార్టులకే నోటీసులు, మూసివేయించడంపై రాజకీయ ఒత్తిళ్లున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. కోట్పల్లి ప్రాజెక్టులో ఓ పార్టీకి చెందిన నేత నిర్వహిస్తున్న బోటింగ్ కార్యకలాపాలను మొన్నటి వరకు నిలిపివేయగా.. పది రోజుల నుంచి మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. అదేవిధంగా మొన్నటివరకు మరోపార్టీ నేత ఆధ్వర్యంలో కొనసాగిన సర్పన్పల్లి ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న వైల్డర్నెల్ రిసార్టు, సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ను ఇటీవల నిలిపివేశారు. ఇదంతా చూస్తుంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లే కారణమనేది జిల్లా అంతటా చర్చ జరుగుతున్నది.
ప్రైవేట్ రిసార్టులు నిర్వహించాలంటే అనుమతులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రిసార్టు లేదా గేమింగ్ హబ్, క్యాంప్సైట్, అడ్వెంచర్ ట్రిప్ తదితరాలను నిర్వహించాలంటే ముందుగా రెవెన్యూ శాఖ నుంచి నాలా(వ్యవసాయేతర భూమి) ధ్రువీకరణ పత్రాన్ని .. ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో నిర్వహించాలంటే రెవెన్యూశాఖ నుంచి ఎన్వోసీ.. రిసార్టులలో అడ్వెంచర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు కు పోలీసుశాఖ నుంచి, క్యాంప్ఫైర్ ఏర్పాటుకు అగ్నిమాపక శాఖ నుంచి.. చెరువుల్లో బోటింగ్ నిర్వహణకు నీటిపారుదల శాఖ నుంచి.. రిసార్టు ఏర్పాటు చేసే భూమి అటవీశాఖకు సంబంధంలేదని అటవీ శాఖ నుంచి ఎన్వోసీ, కార్మిక శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని, గ్రామ పంచాయతీ నుంచి ట్రేడ్ లైసెన్స్, అదేవిధంగా రిసార్టులలో 300 గజాలలోపు భవన నిర్మాణాలకు గ్రామ పంచాయతీల నుంచి.. 300 గజాలపైన భవన నిర్మాణాలకు డీటీసీపీ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని తెలిపారు. పర్మినెంట్ రెస్టారెంట్ భవన నిర్మాణానికి డీటీసీపీ అనుమతితోపాటు ఫుడ్, మద్యం విక్రయాలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు ఎక్సైజ్ అధికారుల అనుమతి అవసరం.
రిసార్టులు, అడ్వెంచర్ క్లబ్లు, గేమింగ్ హబ్ తదితరాలు నిర్వహించాలంటే పంచాయతీ, రెవెన్యూ, పోలీసు, అటవీ, అగ్నిమాపక, నీటిపారుదల శాఖల అనుమతులు తప్పనిసరి. ఇప్పటికే పలు రిసార్టులకు రెండుసార్లు నోటీసులు జారీ చేసి మూసివేయించాం. త్వరలోనే మిగతా రిసార్టులను నేరుగా సందర్శించి అనుమతులు లేకుంటే నోటీసులు జారీ చేస్తాం.
– తరుణ్కుమార్, వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి