వికారాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) ;ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం.. ఈ రంగం మరో రంగం.. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వికారాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్రం సిద్ధించాక నూతన జిల్లా ఏర్పాటుతో రూపురేఖలు మారాయి.. రూ.60 కోట్లతో 33 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను నిర్మించడంతో ప్రజలకు పాలన చేరువైంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎనిమిదేండ్లలోనే కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మోమిన్పేట్ మండలం ఎన్కతలలో ఏర్పాటు చేసే మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టు జిల్లాకు మణిహారంగా మారనున్నది. ఈ భారీ ప్రాజెక్టుతో 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. జిల్లాకు 100 సీట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. కాలేజీ నిర్మాణం, ఆసుపత్రి అప్గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలుకుగాను రూ.235 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. వికారాబాద్లోని 100 పడకల సివిల్ దవాఖానను 380 పడకలతో బోధనాసుపత్రిని చేయాలని నిర్ణయించి, ఏరియా దవాఖానపై మరో రెండంతస్తులను నిర్మించేందుకు రూ.30 కోట్లను విడుదల చేయగా, పనులు వేగంగా సాగుతున్నాయి.
పల్లె దవాఖానలతో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలందుతున్నాయి. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో సమస్యలు కనుమరుగయ్యాయి. పారిశ్రామిక రంగంలోనూ నూతన శకం ఆరంభమైంది. ఎనిమిదేండ్లలో జిల్లాకు రూ.1530 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో సోలార్, పవన విద్యుత్తు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. నవాబుపేట్ మండలం అర్కతల, తాండూరు మండలం జిన్గుర్తిలో ఫుడ్ ఇండస్ట్రియల్ పార్కులను మంజూరు చేయగా, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్త రోడ్ల ఏర్పాటు, మరమ్మతులకుగాను బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.700 కోట్ల నిధులను మంజూరు చేసింది. రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు, సింగిల్ లేన్-రెండు లేన్ల రోడ్డుగా నిర్మించింది. బ్రిడ్జిలు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు అండర్ బ్రిడ్జిలను నిర్మించడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. ‘మనఊరు-మనబడి’తో తొలివిడుతలో 30 పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. ‘మిషన్ భగీరథ’తో రూ.900 కోట్లతో 566 గ్రామపంచాయతీల్లో ఇంటింటికీ తాగునీరు అందుతున్నది. ‘మిషన్ కాకతీయ’తో రూ.250 కోట్లతో 1200 చెరువులకు మరమ్మతులు చేశారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో బీసీ, గిరిజన్ భవన్లను నిర్మించనున్నారు.
జిల్లా ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్.. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా వికారాబాద్ జిల్లాలో గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో కనీవినీ ఎరుగని అభివృద్ధికి తోడ్పాటునందించారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతంతో కూడిన వెనుకబడిన జిల్లాను అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏమాత్రం అభివృద్ధికి నోచని వికారాబాద్ ప్రాంతం జిల్లాగా ఏర్పాటైన అనంతరం జిల్లా అంతటా ఎంతో ప్రగతి జరిగింది. జిల్లాగా ఆవిర్భవించిన అనంతరం జిల్లాకు వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.5వేల కోట్ల వరకు నిధులను విడుదల చేసింది.
ప్రధానంగా జిల్లాలోని మోమిన్పేట్ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల విడిభాగాల తయారీ యూనిట్ అయిన మొబిలిటీ వ్యాలీ జిల్లాకు మణిహారంగా మారనుంది. రూ.50 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా మొబిలిటీ వ్యాలీని ప్రభుత్వం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నది. మరోవైపు పేదలకు సత్వర వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో జిల్లాకు ప్రభుత్వ వైద్య కాలేజీని మంజూరు చేయడంతోపాటు ఆయుష్ ఆస్పత్రి, క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేందుకు పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. నర్సింగ్ కాలేజీతోపాటు మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి, మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానలు, గ్రామపంచాయతీల్లో పల్లె దవాఖానలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి పేదలకు గ్రామస్థాయిలోనే వైద్య సేవలనందిస్తున్నారు.
ఎనిమిదేండ్లలో జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరయ్యాయి. మెజార్టీ గ్రామపంచాయతీలకు రోడ్లులేని పరిస్థితి నుంచి ప్రతి గ్రామానికి రోడ్లను నిర్మించడంతోపాటు గ్రామపంచాయతీ నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్ల ఏర్పాటు వరకు జిల్లాలో అభివృద్ధి వేగవంతమైంది. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతోపాటు మున్సిపాలిటీల సంఖ్యను పెంచి మున్సిపాలిటీలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయగా, కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతున్నది. అదేవిధంగా ఎనిమిదేండ్ల కాలంలో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కూడా వేగంగా జరుగుతున్నది. మరోవైపు జిల్లాలోని జిన్గుర్తి, అర్కతలలో ఫుడ్ ఇండస్ట్రియల్ పార్కులను ప్రభుత్వం మంజూరు చేయగా, ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి. సబ్బండ వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు బీసీ భవన్, గిరిజన భవన్లను కూడా మంజూరు చేసింది.
రూ.1530 కోట్ల పెట్టుబడులు
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో గత ఎనిమిదేండ్లలో రూ.1530 కోట్లు పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం పెట్టుబడులు పెట్టారు. ఇందులో సోలార్, పవన విద్యుత్తు పరిశ్రమల ఏర్పాటుతో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. మిగతా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుతో రూ.500 కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. జిల్లాలో ప్రధానంగా పవర్, ఫార్మా రీసైక్లింగ్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్, మైనింగ్, పర్యాటక రంగం, విత్తనోత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. జిల్లాలో సోలార్ పవర్ పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని నవాబుపేట్ మండలం అర్కతల, తాండూరు మండలం జిన్గుర్తిలో ఫుడ్ ఇండస్ట్రియల్ పార్కులను మంజూరు చేయగా, టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్తో పారిశ్రామిక రంగానికి నూతన శకం మొదలైంది. దీంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. జిల్లాలో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల ఏర్పాటుతో ఇటు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతోపాటు సుమారు 10 వేల మందికి ఉపాధి లభించింది. కొత్తగా ఏర్పాటు కానున్న ఆహార ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించిన పరిశ్రమలతో మరో 15-20 వేల మందికి ఉపాధి లభించనున్నది.
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా మెడికల్ కళాశాల
జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరయ్యింది. 100 సీట్లతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం, ఆస్పత్రి అప్గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలుకు రూ.235 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే 380 పడకల అనుబంధ ఆస్పత్రి కావాలి కాబట్టి వికారాబాద్లో 100 పడకల సివిల్ ఆస్పత్రిని 380 పడకలతో బోధనాసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు ఏరియా ఆస్పత్రిపై మరో రెండంతస్తుల నిర్మాణాన్ని చేపట్టేందుకు రూ.30 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయగా, నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు అనంతగిరిలోని టీబీ ఆస్పత్రిలోనే ఈ ఏడాది మెడికల్ కాలేజీకి సంబంధించి తరగతులను నిర్వహించనున్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసి ఉచితంగా 50 రకాల రక్త పరీక్షలు చేస్తున్నారు.
అందుబాటులోకి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్
చిన్న జిల్లాలతోనే సుపరిపాలన సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి జిల్లాకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.60 కోట్లతో 33 ఎకరాల్లో నూతన కలెక్టరేట్ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పాలన ప్రజలకు చేరువ కావడంతో అన్ని శాఖలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
జీపీల్లో అభివృద్ధి పరుగులు
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలోని గ్రామపంచాయతీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నెలకు జిల్లాలోని గ్రామపంచాయతీలన్నింటికీ కలిపి రూ.10 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. ప్రతి కాలనీలోనూ సీసీ రోడ్లను నిర్మించారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్లను అందజేయడంతోపాటు తడి-పొడి చెత్తను ఇంటింటికెళ్లి సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ, ఇంటింటికీ మరుగుదొడ్లు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, శ్మశానవాటికలను నిర్మించారు. మిషన్ భగీరథలో రూ.900 కోట్లతో 566 గ్రామపంచాయతీలకు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నది. రూ.250 కోట్లతో 1200 చెరువుల మరమ్మతులు, జిల్లాలోని 1030 ప్రభుత్వ స్కూళ్లలో తొలివిడుతలో రూ.4కోట్లతో 30 స్కూళ్లలో మరమ్మతులు పూర్తి చేశారు.
ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధికి రూ.1500 కోట్లు
కొత్త రోడ్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను మంజూరు చేసింది. నాలుగు లేన్ల రోడ్లతోపాటు రహదారుల మరమ్మతులకు, రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుకు పెంచడం, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లు, సింగిల్ లేన్-రెండు లేన్ల రోడ్లకు, బ్రిడ్జిల నిర్మాణానికి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను విడుదల చేసింది. జిల్లాలో నాలుగు లేన్ల రోడ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ నుంచి బీజాపూర్ నాలుగు లేన్ల రోడ్డు పనులు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఆర్అండ్బీ కొత్త రోడ్లలో తాండూరు బైపాస్ రోడ్డుకు రూ.80 కోట్లు, వికారాబాద్ నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.28 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్అండ్బీ రహదారుల నిర్మాణాలు, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.560 కోట్లపైనే నిధులను మంజూరు చేయడం గమనార్హం.
జిల్లాలో 2014 నుంచి ఇప్పటివరకు కొత్తగా నిర్మించిన ఆర్అండ్బీ రోడ్లకు సంబంధించి.. పరిగి-నంచర్ల, సుల్తాన్పూర్-బాసుపల్లి వరకు 22.60 కిలోమీటర్ల రోడ్డును రూ.31.50 కోట్లు, శంకర్పల్లి-మర్పల్లి రోడ్డు నిర్మాణానికి రూ.12.24 కోట్లు, వికారాబాద్-తాండూరు వరకు 28.90 కిలోమీటర్ల రోడ్డుకు రూ.52.20 కోట్లు, నాగసముందర్-బంట్వారం, ధారూరు నుంచి కోట్పల్లి వరకు 20.20 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.31.50 కోట్లు, తాండూరు నుంచి తొర్మామిడి వరకు 19.76 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందింది. రోడ్ల మరమ్మతులకు తొమ్మిదేండ్లలో జిల్లాకు రూ.256 కోట్లపైనే నిధులను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. అదేవిధంగా జిల్లాలో గత ఎనిమిదేండ్లుగా 31 వంతెనల నిర్మాణానికి రూ.130 కోట్లకుపైగా నిధులను ప్రభుత్వం వెచ్చించింది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి మరో రూ.600 కోట్లకుపైగా ప్రభుత్వం నిధులిచ్చింది.
ప్రారంభానికి సిద్ధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు
గూడులేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం కోకట్లో నిర్మిస్తున్న 420 డబుల్ బెడ్రూంలకు 180 ఇండ్లు, ధారూరులోని 120 ఇండ్లు, మర్పల్లిలోని 120 ఇండ్లు, మోమిన్పేట్లోని 130 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, సంబంధిత డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేయాల్సిన 550 ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.03 కోట్ల నిధులనూ విడుదల చేసింది. డబుల్ బెడ్రూం ఇండ్లల్లో మౌలిక వసతులు కల్పించే పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, వీలైనంత త్వరితగతిన పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు కులకచర్ల మండలంలోని అడవి వెంకటాపూర్లో నిర్మిస్తున్న 30 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులతోపాటు మౌలిక వసతుల పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 3800 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. మంజూరైన ఇండ్లన్నింటికీ పరిపాలన అనుమతులురాగా, 2257 ఇండ్ల నిర్మాణాలు ఆయా దశల్లో కొనసాగుతున్నాయి.
జిల్లాకు మణిహారంగా మొబిలిటీ వ్యాలీ
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అతిపెద్ద ప్రాజెక్టు జిల్లాలో ఏర్పాటు కానుంది. మోమిన్పేట్ మండలం ఎన్కతలలో ఏర్పాటు చేసే మొబిలిటీ వ్యాలీ జిల్లాకు మణిహారంగా మారనుంది. మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో వెనుకబడిన వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ప్రత్యేక వికారాబాద్ జిల్లాగా ఏర్పాటైన అనంతరం జిల్లాకు భారీ ప్రాజెక్టు రావడంపై జిల్లా ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు వాహనాల విడి భాగాల తయారీ యూనిట్లతో కూడిన మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రానున్న ఐదేండ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులతోపాటు 4 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయనున్న మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో మోమిన్పేట్, నవాబుపేట్ మండలాలతోపాటు వికారాబాద్ జిల్లా కేంద్రం వరకు అభివృద్ధి విస్తరించనుంది. మొబిలిటీ వ్యాలీ అందుబాటులోకి వచ్చినట్లయితే మరిన్ని పరిశ్రమలు చుట్టూ పక్కల వెలసే అవకాశాలున్నాయి. 1200 ఎకరాల్లో ఏర్పాటు చేసే మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ముంబై జాతీయ రహదారి వెళ్లే సదాశివపేట్, జిల్లాలోని మర్పల్లి వరకు భవిష్యత్తులో అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మెండుగా ఉండడంతో అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధిలోకి రానున్నది. జిల్లాలోని వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనున్నది.
మెడికల్ కళాశాల రావడం సంతోషం ;బాకారం చంద్రశేఖర్, విద్యావంతుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి
వికారాబాద్కు మెడికల్ కళాశాల రావడంతో ఈ ప్రాంత ప్రజలకు వైద్యం చేరువ కానుంది. పేద విద్యార్థులు ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం కలిగింది. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలానూతన కలెక్టరేట్ నిర్మాణం ప్రజలకు సౌకర్యవంతంగా మారింది.
అన్ని రంగాల్లో అభివృద్ధి : విజయలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, తాండూరు
8 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనతో జిల్లా అన్ని రంగాల్లో దూసుకు పోతున్నది. సీఎం కేసీఆర్ జిల్లాకు ప్రత్యేక నిధులు, మెడికల్ కళాశాల, అనంతగిరి అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపడంతో మంచి పేరు వస్తున్నది. విద్య, వైద్యంతో పాటు రవాణా, వాణిజ్యంలో కూడా జిల్లా మెరుగుపడింది.
ప్రత్యేక రాష్ట్రంతో జిల్లా అభివృద్ధి ;నరేందర్గౌడ్, తాండూరు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో వికారాబాద్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నది. విద్య, వైద్యంతోపాటు ప్రతి పల్లె అభివృద్ధిలో దూసుకుపోతున్నది. గ్రామాలు, పట్టణాలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఎంతో కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి.