వరంగల్ నిట్లో కాన్వొకేషన్ కనుల పండువగా జరిగింది. వివిధ బ్రాంచ్ల టాపర్స్ 8 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్తో పాటు మొత్తం 2029 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్ మాట్లాడుతూ.. దేశంలోని విశిష్ట విద్యా సంస్థల్లో వరంగల్ నిట్ ఒకటని, సాంకేతిక, సామాజిక అవసరాలను తీర్చడంలో నిట్ పాత్ర మరువలేనిదన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కృషితో అంతరిక్ష రంగంలో దేశానికి ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, యువత ప్రపంచంతో పోటీ పడాలంటే సృజనాత్మకంగా ఆలోచించాలని సూచించారు. నిట్లో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందుతున్నదని డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి అన్నారు.
– హనుమకొండ చౌరస్తా,
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 16 : వరంగల్ నిట్ 21వ కాన్వొకేషన్ కనుల పండుగగా జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచీల్లో 8 మందికి గోల్డ్మెడల్స్, 2,029 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ముఖ్యఅతిథి, నీతి ఆయోగ్ సభ్యుడు, పద్మశ్రీ, పద్మభూషణ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) కార్యదర్శి డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్, నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అందజేశారు.
అనంతరం సారస్వత్ మాట్లాడుతూ.. దేశంలోని విశిష్ట సంస్థల్లో వరంగల్ నిట్ ఒకటన్నారు. ఈ సంస్థ కాన్వొకేషన్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే ఇది మొదటి ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల (ఆర్ఈసీ) అని అన్నారు. 64 సంవత్సరాల ఈ సంస్థ దేశ సాంకేతిక, సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడంలో తోడ్పాటు అందించిందని పేర్కొన్నారు. విద్య, శిక్షణలో సంస్థ ఉన్నత ప్రమాణాలను కొనసాగించడం అత్యంత సంతోషకరమైన అంశమని తెలిపారు. ఇది స్టార్టప్లను ఇంక్యుబేట్ చేయడానికి దారి తీసిందన్నారు. సంపాదించిన జ్ఞానం, అవకాశాలు విద్యార్థులకు ఆసక్తి ఉన్న ప్రాంతాన్ని ఎంచుకునే స్వేచ్ఛను అందిస్తుందని చెప్పారు.
పాత తరంలో చాలామందికి ఈ అవకాశం లేదన్నారు. భారతదేశం ఇప్పటికే శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నదని, ఇస్రో చంద్రయాన్-3 ద్వారా విక్రమ్ ల్యాండర్ను చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడం, ఆదిత్యయాన్ ప్రయోగం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డీఆర్డీవో రక్షణ రంగంలో ఎన్నో ఆవిషరణలు చేసి ప్రపంచానికి తన శక్తిని చాటిందన్నారు. దేశంలో యువత జనాభా శాతం అధికంగా ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పారు.
వరంగల్ నిట్లో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందుతున్నదని డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి అన్నారు. ఈ కాన్వొకేషన్లో బీటెక్లో 1064 మంది, ఎంటెక్లో 603, ఎమ్మెస్సీలో 154, పీజీ డిప్లొమాలో 7, ఎంబీఏలో 23, ఎంసీఏలో 52, 126 మంది పీహెచ్డీ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశామని చెప్పారు. 21వ కాన్వొకేషన్లో మొత్తం 2029 మంది విద్యార్థులు డిగ్రీలు అందుకున్నారని తెలిపారు. ఎన్ఐటీ వరంగల్ దాదాపు 583 జర్నల్స్ను ప్రచురించిందని, దాదాపు 7.5కోట్ల కన్సల్టింగ్, ప్రాజెక్ట్ గ్రాంట్లు పొందిందని తెలిపారు. 98శాతం యూజీ, పీజీ విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ల ద్వారా ప్లేస్మెంట్స్ పొందారని చెప్పారు.
అత్యధిక వేతన ప్యాకేజీ రూ.88లక్షలు, సగటు రూ.17లక్షలని, ఫార్చ్యూన్ 500 కంపెనీలు సైతం ఇక్కడి విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడానికి క్యాంపస్ను సందర్శించాయన్నారు. విశిష్ట పూర్వ విద్యార్థుల పురసార ప్రధానోత్సవం 2022, అక్టోబర్ 10న జరిగిందని, వివిధ ఫోరమ్లలో పూర్వ విద్యార్థుల పాత్ర, గుర్తింపు గర్వించేలా చేశాయన్నారు. నిట్ పూర్వ విద్యార్థుల్లో ఒకరైన రిటైర్డ్ ఐపీఎస్ శ్రీకృష్ణప్రసాద్ బీవోజీ నిట్ జంషెడ్పూర్ చైర్మన్గా నియమితులైనట్లు, నలుగురు పూర్వ విద్యార్థులు గత ఏడాది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించారని పేర్కొన్నారు.
ఇన్స్టిట్యూట్ టాపర్ నివేదిత ఉలగనాథన్(బయోటెక్నాలజీ), యాదరి రేవంత్(సివిల్ ఇంజినీరింగ్), చిన్ని రేవంత్(మెకానికల్ ఇంజినీరింగ్) కరప భవానీ(ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), సుదీప్తి మద్ది(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), ప్రత్యూష్ ధాల్(కెమికల్ ఇంజినీరింగ్), సూదిరెడ్డి దినేశ్రెడ్డి(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), ఎం తరుణ్(మెటలర్జీ, మెటీరియల్స్ ఇంజినీరింగ్) 8 మంది బంగారు పతకాలు పొందారని తెలిపారు. ఈ ఏడాది ఇన్స్టిట్యూట్ గోల్డ్మెడల్ విజేత నివేదిత ఉలగనాథన్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 21వ కాన్వొకేషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ మధుమూర్తి పాల్గొన్నారు.
ప్రపంచంతో పోటీ పడాలంటే కొన్ని సామర్థ్యాలను అలవర్చుకోవాలని సారస్వత్ సూచించారు. సృజనాత్మకంగా ఆలోచిస్తూ అన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలన్నారు. పనిలో ఉత్సాహంగా ఉండాలని, సమస్యను చూసి పారిపోవద్దని, లక్ష్యాలను స్పష్టంగా ఎంచుకొని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. నైతికంగా ఉంటూ వృత్తిపరమైన నైపుణ్యం, వ్యక్తిగత సమగ్రతతో పాటు అత్యున్నత ప్రమాణాలను అందుకోవాలన్నారు. పట్టుదల, సంకల్పంతో ముందుకు సాగాలని, సమాజ సేవ చేయడానికి సమయం వెచ్చించాలని కోరారు. ‘శక్తి మీలోనే ఉంది.. మీరు ఏదైనా చేయొచ్చు.. నమ్మకం ముఖ్యం.. బలహీనులని విశ్వసించొద్దు,’ అని వివరించారు.
మాది కేరళ. వరంగల్ నిట్ క్యాంపస్లో అనలాటికల్ కెమిస్ట్రీ పూర్తి చేశా. ఇక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ అవకాశాలు కల్పిస్తున్నారు. దేశంలోనే గుర్తింపు ఉన్న వరంగల్ నిట్లో చదువు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకనుగుణంగా విద్యను బోధిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు.
– టీపీ శైమా, నిట్ విద్యార్థిని
మాది బెంగళూరు.. మా నాన్న ఉలగనాథన్, తల్లి గోమతి. నాన్న కెమికల్ ఇంజినీర్. వరంగల్ నిట్లో బీటెక్(బయో టెక్నాలజీ) పూర్తి చేశా. ప్రసుత్తం బెంగళూరులోని ఐఐసీ కళాశాలలో ఎంటెక్ చేస్తున్నాను. నిట్ బయో టెక్నాలజీలో టాపర్, ఇన్స్టిట్యూట్ టాపర్.. ఇలా రెండు గోల్డ్మెడల్స్ రావడం సంతోషంగా ఉంది. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. మనం ఒక లక్ష్యంతో ముందుకెళితే సాధించేలేనిది ఏమీ ఉండదు. విదేశాల్లో పీహెచ్డీ పూర్తి చేసి హ్యూమన్ మైక్రో బయాలజీపై పరిశోధనలను చేసి మందులు, యోగా, వ్యాయామాల అవసరం లేకుండా ఆరోగ్యవంతమైన జీవనానికి కృషిచేస్తా.
– నివేదిత ఉలగనాథన్, బయోటెక్నాలజీ బ్రాంచ్, ఇన్స్టిట్యూట్ టాపర్
వరంగల్ నిట్లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఇక్కడ అత్యున్నతమైన బోధన లభించింది. ఇక్కడి వాతావరణం, అధ్యాపకుల సపోర్టు బాగుంది.. చివరి సంవత్సరంలోనే ప్రముఖ కంపెనీల నుంచి చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. లక్షల్లో ప్యాకేజీలతో ముందుగానే ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
– హకీముల్లా, అఫ్ఘనిస్తాన్