సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూ హైదరాబాద్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విభాగంలోని సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కంప్యూటర్ సైన్స్తో పాటు ఇతర విభాగాలకు చెందిన ల్యాబులను అభివృద్ధి చేసేందుకు రూ.7.50 కోట్లు విడుదల చేశామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఈ నిధులను ప్రస్తుతం జేఎన్టీయూ క్యాంపస్లో ఉన్న కాలేజీలు, విభాగాలకు మాత్రమే కేటాయించామని, దశల వారీగా సుల్తాన్పూర్, జగిత్యాల, మంథనిలో ఉన్న యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలను అభివృద్ధిపరిచేందుకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా మరో ఆరు నెలల్లో జేఎన్టీయూ హైదరాబాద్కు ప్రస్తుతమున్న నేషనల్ ఎసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు సమయం ముగియనున్నది. ఈ క్రమంలో మరోసారి న్యాక్ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది.