షాబాద్, నవంబర్ 30: చేవెళ్ల నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట్ మండలాల్లో మొత్తం 2,62,084 మంది ఓటర్లు ఉన్నా రు.74శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయి రాం తెలిపారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరుగకుండా ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల గ్రామంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, తన కుమారులు కార్తీక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, కౌశిక్రెడ్డితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొయినాబాద్ మండలం ఎనికెపల్లి గ్రామంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఆయన సతీమణీ టీటీడీ డైరెక్టర్ సీతారెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా, నవాబుపేట మండలం చించల్పేట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆయన సతీమణీ జడ్పీటీసీ కాలె జయమ్మ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలోని గొల్లూరుగూడ గ్రామంలో స్థానిక జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. చేవెళ్ల మండలం పామెన గ్రామంలో యాంకర్, నటుడు బిత్తిరిసత్తి ఓటు వేశారు.
చేవెళ్ల రూరల్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల (స్వగ్రామం)లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకు ముందుకు స్వర్గీయ మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. మంత్రి వెంట కుమారులు బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తీక్రెడ్డి, కల్యాణ్రెడ్డి, కౌశిక్ రెడ్డి, కౌకుంట్ల సర్పంచ్ గాయత్రీగోపాలకృష్ణ, కౌకుంట్ల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, నాయకులు మల్లారెడ్డి ఉన్నారు.
చేవెళ్ల రూరల్ : మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం 7గంటల నుంచే క్యూలో నిల్చోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మల్కాపూర్ తదితర గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య పరిశీలించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని పామెన గ్రామంలో ప్రముఖ నటుడు బిత్తిరి సత్తి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారులు ఓటర్లకు సౌకర్యాలు, వృద్ధులకు ఆటోలు, వీల్ చైర్లను ఏర్పాటు చేశారు.
సిబ్బంది వృద్ధులను ఇంటి వద్ద నుంచి ఆటోలో తీసుకువచ్చి వీల్ చైర్లపై తీసుకొని ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. పోలీసులు పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
చేవెళ్లటౌన్ : చేవెళ్ల మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేశారు. చేవెళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య సందర్శించారు. మండల కేంద్రంలో ఎంపీపీ విజయలక్ష్మీ రమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణా రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్రాజ్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొత్తూరు : కొత్తూరు మున్సిపాలిటీ, మండలంలో కలిసి మొత్తం 26165 ఓట్లకు గాను 20021 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 76 శాతం పోలింగ్ నమోదైంది.బూత్లలో సాయంత్రం 5 దాటినా తర్వాత ఓటర్లు బారులు తీరారు. రాత్రి 8 గంటలకు వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెప్పారు. ఉదయం 11:30 గంటలక వరకు 27 శాతం పోలింగ్ నయోదయింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కొత్తూరు జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు లావణ్యదేవేందర్యాదవ్, ఎస్బీపల్లిలో జడ్పీటీసీ శ్రీలతా సత్యనారాయణ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంలో మొత్తం 41పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. షాద్నగర్ ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలో సీఐ ప్రతాప్లింగం ప్రత్యేక బందోబస్తును నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేందాల వద్ద ఎస్ఎస్బీ పోలీసులను మొహరించారు. అధికారులు, పోలీసులు ఓటర్లను తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు వృద్దులకు, దివ్యాంగులకు ప్రత్యేక వీల్చైర్లను ఏర్పాటు చేసి ఓటును వేయించారు. మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ ఉదయానే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. షాద్నగర్ పట్టణంలోని పలు కేంద్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ తదితరులు పరిశీలించారు. సాయంత్రం 5గంటల వరకు నియోజకవర్గంలో 73.54శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలో సజావుగా ముగిసింది. సమస్యాత్మక గ్రామాల పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఎస్బీ పోలీసులను ఏర్పాటు చేశారు.
మొయినాబాద్ : మండలంలోని 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 గంటల తరువాత పోలీంగ్ కేంద్రాలకు ఓటర్ల తాకిడి పెరిగింది. మండలంలోని హిమాయత్నగర్, కనకమామిడి, అమ్డాపూర్, పెద్దమంగళారం గ్రామాల్లో పోలింగ్ సరళి ఆలస్యంగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 65.9 శాతం పోలింగ్ నమోదైంది. మొయినాబాద్లోని హిమాయత్నగర్, అజీజ్నగర్, నాగిరెడ్డిగూడ, బాకారం, అమ్డాపూర్, మొయినాబాద్, కనకమామిడి, పెద్దమంగళారం, గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య సందర్శించారు.
నాగిరెడ్డిగూడ గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య పోలీంగ్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్న పాటి గొడవ జరిగింది. పోలీసులు వారిని చదరగొట్టారు. ఎన్కేపల్లి గ్రామంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు సీతారెడ్డి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. హిమమాయత్నగర్ గ్రామంలో బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, చిలుకూరులో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. కాలె యాదయ్య చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు.
శంకర్పల్లి : 7 గంటలకు మొదలైన పోలింగ్ 26 గ్రామాలు, మున్సిపాలిటీలో ప్రశాంతంగా కొనసాగింది. టంగటూర్, దొంతాన్పల్లిలలో సుమారు 8 గంటల వరకు కొనసాగింది. చందిప్ప గ్రామంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ పరిధిలోని బాలుర పాఠశాలలో చైర్ పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్కుమార్, మహలింగాపురం గ్రామంలో జడ్పీటీసీ గోవిందమ్మ , మిర్జాగూడ గ్రామంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీందర్గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలం, మున్సిపాలిటీలో 76 శాతం ఓటింగ్ నమోదైంది.
కేశంపేట : మండలంలోని 43 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటును సాఫీగా వినియోగించుకున్నారు. మండలంలోని ఎక్లాస్ఖాన్పేటలో ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ పోలింగ్ బూత్ నెంబర్ 114లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మండలంలోని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 7.30 గంటలకు తరువాత కూడా వేములనర్వ గ్రామంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 80 శాతం పోలింగ్ నమోదైంది.
నందిగామ : మండలంలో మొత్తం 83.10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 7.30 గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు క్యూ లైన్లలో ఉండి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు కృషి చేశారు. కేంద్రాలను ప్రజాత్రినిధులు పరిశీలించారు.