గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో ఆడబిడ్డ అని ఆందోళన చెందేవారు.. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఈ తొమ్మిదేండ్ల సుపరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొండంత భరోసాను కల్పిస్తున్నది. అమ్మాయి పుట్టగానే కేసీఆర్ కిట్ పథకంతో మొదలుకొని పెండ్లికి ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకం కింద 29,162 మందికి రూ.276 కోట్లు, 5,655 మందికి షాదీముబారక్ కింద రూ.52.16 కోట్ల ఆర్థిక సాయం అందగా, రంగారెడ్డి జిల్లాలో 66,252 మందికి లబ్ధి చేకూరింది. వారి ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా పథకాన్ని అమలు చేస్తూ న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తున్నది.
వికారాబాద్ జిల్లాలో నిరాదరణకు గురైన 4,667 మంది ఒంటరి మహిళలకు, రంగారెడ్డి జిల్లాలో వితంతువులు 85,165 మంది, ఒంటరి మహిళలు 6,497 మందికి పింఛన్లను అందజేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నది. త్వరలో ‘గృహలక్ష్మి’ పేరిట సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకుంటే మహిళల పేరిట రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. అతివలకు రక్షణగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మార్కెట్ కమిటీల్లోనూ రిజర్వేషన్ కల్పించడంతోపాటు ఉద్యోగిణులకు ప్రసూతి సెలవులనూ పెంచి మహిళలకు అండగా నిలుస్తున్నది. గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదుగాలన్న ఉద్దేశంతో విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంతో వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా రుణాలను ఇస్తూ జీవనోపాధిని కల్పిస్తున్నది. దీంతో వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 2,252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా, చిన్న తరహా పారిశ్రామిక వేత్తలుగా మారారు. రంగారెడ్డి జిల్లాలో బ్యాంక్ లింకేజీ ద్వారా 5,827 మందికి రుణాలు మంజూరు కాగా, విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంతో 1337 మంది వ్యాపారులుగా మారారు. ఇలా మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది.
– రంగారెడ్డి, జూన్ 12 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జూన్ 12, (నమస్తే తెలంగాణ) : పలురంగాల్లో నిర్ణయాత్మక పాత్రను పోషిస్తున్న మహిళల స్వావలంబన, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అవిరళ కృషి చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల్లో మహిళలు అనుకున్న పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. మహిళల రక్షణ, పోషణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారానే వారి అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ నమ్మకం. అందుకే ఆరోగ్యలక్ష్మి, భరోసా కేంద్రాలు, ‘షీ’ టీమ్స్ వంటి పథకాలను అమలుచేయ డం ద్వారా ‘మహిళా బంధువు’గా నిలిచారు. అవకాశాలు క ల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని సీఎం కేసీఆర్ నమ్మి మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో నేడు మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా 9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి చేసిన కార్యక్రమాలపై ప్రత్యేక కథనం…
పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక చేయూత…
గత తొమ్మిదేండ్లుగా ఆడబిడ్డల పెండ్లికి భారమైన పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. గత తొమ్మిదేండ్లలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.320 కోట్ల ఆర్థికసాయం అందజేసింది. 29,162 మందికి కల్యాణలక్ష్మి పథకం కింద రూ.276కోట్లు, షాదీముబారక్ కింద 5,655 మంది లబ్ధిదారులకు రూ.52.16 కోట్ల ఆర్థికసాయం అందించింది. దీంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఒంటరి మహిళలకు పింఛన్లు…
ఒంటరి మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచినది. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.2016 పింఛన్ను అందజేస్తున్నది. జిల్లాలోని 4,667 మంది ఒంటరి మహిళలకు లబ్ధి చేకూరుతున్నది.
మహిళల రక్షణకు పెద్దపీట
జిల్లాలోని మహిళలు, అమ్మాయిలకు రక్షణగా షీ టీమ్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసినది. మహిళలు, చిన్న పిల్లలపై ఈవ్ టీజింగ్తోపాటు ఎలా ఇబ్బంది పెట్టినా షీ టీమ్స్ సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు నేర తీవ్రతను అనుసరించి కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. అలాగే మానవ అక్రమ రవాణాను అరికట్టడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉన్నది. 18 ఏండ్లలోపు బాలబాలికలు ఎక్కడైనా ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిని గుర్తించి, వారికి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ బడికి వెళ్లి చదువుకునేలా జిల్లా యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ టీం చర్యలు తీసుకుంటున్నారు.
వ్యాపారులుగా గ్రామీణ మహిళలు…
విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామీణ మహిళలను వ్యాపారులుగా మారేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. వారికి స్వయం ఉపాధి కల్పనలో కొత, కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాలు, ఆర్థిక వనరులను కల్పించి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు 2,252 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు.
మాతా, శిశు సంరక్షణలో జిల్లా ముందంజ…
మాతాశిశు సంరక్షణలో వికారాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచినది. గత ఐదు నెలలుగా వికారాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుండడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో జిల్లా ప్రజానీకానికి సకాలంలో మెరుగైన వైద్యం అందడంతోపాటు ఇతర వైద్య సదుపాయాలు మెరుగయ్యాయి.
ఆరోగ్య మహిళా పథకం…
రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100 పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళా పథకం అమల్లోకి రాగా, త్వరలో మరిన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినది. అయితే మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలను గుర్తించి, సరైన వైద్యం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
త్వరలో గృహలక్ష్మి పథకం…
గూడులేని ప్రతి నిరుపేదకూ సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినది. ఇప్పటికే డబుల్ బెడ్రూం పథకాన్ని అమలు చేస్తుండగా, కొత్తగా గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇల్లులేని వారికి ప్రభుత్వం మహిళల పేరిట ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నది. అయితే సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి రూ.3 లక్షల చొప్పున ఆడబిడ్డల పేరిట ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందించేందుకు నిర్ణయించింది.
సంక్షేమ పథకాలతో మహిళలు ఆనందంగా..
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందుకొని మహిళలు ఆనందంగా ఉన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తూ.. నాణ్యమైన పరికరాలతో కూడిన కేసీఆర్ కిట్, చిన్నారులు, కిశోరబాలికలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి పాటుపడేలా అంగన్వాడీ కేంద్రాలను అందించి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో పేదల ఇంట్లో కల్యాణ కాంతులు వెలుగుతున్నాయి.
– ర్యాలపేట వాణిశ్రీ, వైస్ చైర్పర్సన్, మార్కెట్ కమిటీ, కొడంగల్
బతుకుకు భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్
ఒంటరి మహిళలకు ఆసరా పింఛను సౌకర్యం కల్పించి సీఎం కేసీఆర్ మాకు బతుకు మీద భరోసా కల్పించారు. పింఛను రాకముందు ఒంటరి మహిళల బతుకు ఆగమయిండే. ఎలాంటి ఆధారం లేక ఎలా బతుకాలో తెలియక అయోమయంగా ఉండేది. ఒంటరి మహిళలకు నెలకు ఇస్తున్న ఆసరా పింఛనుతో గౌరవంగా జీవిస్తున్నాం.
– బ్యాగరి నర్సమ్మ, ఒంటరి మహిళ, చౌదర్పల్లి, బొంరాస్పేట
తెలంగాణలో ఆడపిల్లగా పుట్టడం ఒక వరం
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్వాడీ కేంద్రం ద్వారా పౌష్టికాహారం అందివ్వడంతో ఆరోగ్యంగా ఉన్నా. డెలివరీ ప్రభుత్వ దవాఖానలో జరగడంతో కేసీఆర్ కిట్టుతో పాటు 16 రకాల నిత్యావసర సరుకులు, రూ.12వేల ఆర్థికసాయం అందుకున్నా. ఈ సాయం నా కుటుంబానికి ఎంతో భరోసానిచ్చింది. తెలంగాణలో ఆడపిల్లగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా.
– సొంటి లక్ష్మి, ఎన్కతల, మోమిన్పేట
పెన్షన్తో ఎంతో ఆసరా
గత ప్రభుత్వాల్లో పెన్షన్ పేరుతో కేవలం 200 రూపాయలు అందించే వారు. అవి పప్పు, ఉప్పు కూడా సరిపోయేవి కావు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పెన్షన్ను రూ.1000 చేశారు. అనంతరం వృద్ధులు, వితంతువుల కష్టాలను అర్థం చేసుకున్న కేసీఆర్ 2018లో పెన్షన్ రూ.100 నుంచి రూ.2016 అందించడం చాలా గొప్ప విషయం.
– లక్ష్మి, ఎన్కతల, మోమిన్పేట