ఒగ్గు కథకే వన్నె తీసుకొచ్చిన ఫోక్ ఆర్టిస్టు
తెలుగు రాష్ర్టాల్లో ఉర్రూతలూగించిన తొలి మహిళ
కామరతి పాత్రలో మెప్పించిన ఒగ్గు కళాకారిణి
మల్లారిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం
యాచారం, మార్చి 7: నెత్తికి తలపాగా, భూజానికి గొంగడి, కాలికి గజ్జకట్టి ఆమె చిందేసి గొంతెత్తి పాడుతూ ఒగ్గు కథ చెబుతుంటే చూపరులు మైమరిచి పోవాల్సిందే. ఆమె కామరతి పాత్రలో ఒదిగిపోయి వేషం వేసి పాట ఆలపిస్తే ప్రేక్షకులు కండ్లను ఆర్పకుండా చూడాల్సిందే. మహిళే అయినప్పటికీ కట్టు, బొట్టు, మాట, పాట మాత్రం అచ్చం మగవారివే. అంతే కాదు ధోవతి కట్టుకొని, తలపాగా చుట్టుకొని పురుష వేషధారణలో తోటి పురుషులతో కలిసి ఊరూ రా తిరుగుతూ కథలు చెబుతుంటే ఆమె మహిళే అని అంటే అక్కడి స్థానికులు ఎవ్వరూ నమ్మడంలేదు.. బాల్యం నుంచే ఆమెది పురుష వేషధారణ. కేవలం కళారూపకంలో కామరతి వేషం వేసినప్పుడు మాత్రమే సంప్రదాయబద్ధంగా చీరకట్టుతో ఆడపడుచులా కనిపిస్తుంది. ఆమె కథలను అన్ని వర్గాల ప్రజలు విశేషంగా ఆదరిస్తారు. గత కొన్నేండ్లుగా వందలాది ఒగ్గు కథలు చెబుతూ ఒగ్గు కథకే వన్నె తెచ్చిన ఆణిముత్యం గా మల్లారిని పేర్కొనవచ్చు. కళే జీవితంగా, ఒగ్గు కథకే జీవం పోసిన తెలంగాణ తొలి మహిళగా, ఫోక్ ఆర్టిస్టుగా జమ్మ మల్లారి ఎదిగారు జీవితం దేవుడికే అంకితం..
మల్లారి తన జీవితాన్ని దేవుడికే అంకితం చేసిం ది. తన 18వ ఏటా బీరప్ప దేవుడిని వివాహం చేసుకున్నది. బీరప్ప స్వామిని భర్తగా స్వీకరించినప్పటి నుంచి ఆమె మళ్లీ తన జీవితంలో పెండ్లి అనే ఆలోచనే చేయడంలేదు. ఆమె పోషించిన కామరతి పాత్రలాగే జీవితంలోనూ పెండ్లి అనే ఎపిసోడ్ లేకుండా పోయింది. అందులో భాగంగానే వేలాదిగా దేవతల వివాహాలు చేయడం, గ్రామాల్లో మల్లన్న, బీరప్ప పండుగలు నిర్వహించడం, జాతరల్లో ఒగ్గు కళారూపాన్ని ప్రదర్శిస్తున్నది. ఎక్కడైనా బీరప్పస్వామి కల్యాణం జరిగితే అక్కడ మల్లారి కచ్చితంగా ఉండాల్సిం దే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో తన ఒగ్గు కథలను వినిపించి, అందరినీ మెప్పించిన ఘనత ఆమె ది. మల్లారి ఒగ్గు కథకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఆమె కాలికి గజ్జకట్టి కామరతి వేషం వేస్తే చూసేందుకు గ్రామం మొత్తం జాతరలా కదిలేది. ఆమె కథ వినేందుకు చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చేవారు. ఆమె స్టేజీపై గంటల తరబడి నిలబడి, ఎలాంటి పుస్తకాలను చూడకుండానే పెద్ద, పెద్ద కథలను అలవోకగా చెబుతుంది. ప్రస్తుతం వయసు పైబడటంతో ఎక్కువసేపు నిలబడి కథలు చెప్పలేని మల్లారి కూర్చోనే కథలను చెబుతున్నారు. ఆమె ఎక్కడికెళ్లినా గౌరవంతో ఆరాధిస్తారు. గొల్ల, కురుమ కుల బాంధవులు ఆమెను నేటికి దైవ సమానంగా భావిస్తా రు. ఇప్పటికీ ఆమె ఇల్లే గుడి, గుడే ఇల్లుగా జీవిస్తున్నది. 70 ఏండ్ల వయసులోనూ ఒగ్గు కథే ప్రాణంగా బతుకుతున్నది.
మల్లారిని గుర్తించిన ప్రభుత్వం
జమ్మ మల్లారి గత 60 ఏండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఒగ్గుకథలు చెబుతున్న తొలి తెలుగు మహిళగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్నది. అయినప్పటికీ ఆమెకు ఏనాడు కూడా తగిన గుర్తింపు రాలేదు. కానీ ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మల్లారి ఒగ్గు కథలను గుర్తించింది. సంప్రదాయ ఒగ్గుకళకు జీవం పోస్తున్న మల్లారి ని తెలంగాణ రాష్ట్ర విశిష్ఠ మహిళా పురస్కారా లు-2020 రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. అదేవిధంగా మార్చి 8, 2020న రవీంద్రభారతిలో జరిగిన మహిళా దినోత్సవంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు సత్యవతీరాథోడ్, శ్రీనివాస్ మల్లారికి రూ.లక్ష చెక్కు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించి ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్కు మల్లారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
16 ఏండ్ల వయసులోనే..
మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన జమ్మ గుండాలు-చెన్నమ్మ దంపతుల సంతా నం మల్లారి. ఆమెకు ఆరుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములున్నారు. చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచింది. తండ్రి వెంట దేవుడి లగ్గాలు చేయడం, ఒగ్గు కథలు చెబితే అక్కడికెళ్లేంది. డోలు వాయించడం, రాగం తీసి పాటలు పాడటం చిన్నతనంలోనే నేర్చుకున్నది. తన 16 ఏండ్ల వయసులోనే సొంతంగా కథ చెప్పింది మల్లారి. ఆమె ఆట, పాటను మొ దటిసారి చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. అప్పటి నుంచి ఆమె ఒగ్గు కథలు చెబుతూనే ఉన్నది. తన సోదరులతో కలిసి వారసత్వంగా వస్తున్న ఒగ్గు కథలు (బీరప్ప, మల్లన్న, ఎల్లమ్మ కథలు) చెప్పుతూ తన జీవితాన్ని జానపద కళకు అంకితం చేసింది. గత కొన్నేండ్లుగా ఆమె వందలాది ఒగ్గు కథలను చెప్పింది. మగవారు ఒగ్గు కథ చెబుతుంటే కనీసం చూసేందుకు కూడా అవకాశం లేని ఆ రోజుల్లో ఏకంగా ఓ మహిళ స్టేజీపైకి వచ్చి కథ చెప్పడం మల్లారికే సాధ్యమైందని చెప్పవచ్చు. ఆమె తన తండ్రి ప్రోత్సాహంతో గ్రామం, మం డలం, జిల్లా, రాష్ర్టాన్ని దాటి తన ఒగ్గు కళారూపాలను ప్రదర్శించింది. ఆమె ప్రదర్శనలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చి వీక్షించేవారు. ఎంతోమంది ప్రముఖుల మన్ననలను ఆమె పొందారు.
జానపద కళలను కాపాడాలి
తెలంగాణ సర్కారు ఇచ్చిన గుర్తింపు నా జీవితానికి చాలు. ఎన్నో ఏండ్లుగా మా తాతలు, తండ్రుల కాలం నుంచి వస్తున్న ఒగ్గు కథకు జీవం పోశా. నా తండ్రి నా వివా హాన్ని దేవుడికి ఇచ్చి చేశాడు. అప్పటి నుంచి నా జీవితాన్ని దేవుడికే అంకితం చేశా. దేవుడి సేవలోనే తరిస్తున్నా. తెలంగాణ సర్కారు నన్ను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా పేరు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క రూ జానపద కళలను కాపాడాలి. జీవించి ఉన్నంత వరకూ కథలు చెబుతా.
–జమ్మ మల్లారి,ఒగ్గు కళాకారిణి