‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, మిగతా స్కూళ్లలో వివిధ దశల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతోపాటు భవనాలకు మరమ్మతులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ల నిర్మాణం, పెయింటింగ్, ప్రహరీలు, తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదటగా నాలుగు పాఠశాలలు ఎంపిక చేసి రూ.2కోట్లతో అందంగా తీర్చిదిద్దారు. ఆ తరువాత తొలి విడుతలో భాగంగా 464 పాఠశాలలను ఎంపిక చేసి పనులను ప్రారంభించారు. ఇందులో 448 స్కూళ్ల కోసం రూ.97.88 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 54 పాఠశాలల్లో పూర్తిస్థాయి పనులు పూర్తికాగా త్వరలో ప్రారంభించనున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో మొదటి దశలో 371 స్కూళ్లను ఎంపిక చేయగా, 41 బడుల్లో వందశాతం పనులు పూర్తయ్యాయి. వీటిని ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రంగారెడ్డి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గత పాలకుల నిర్లక్ష్యంతో ఆదరణ కోల్పోయిన సర్కారు బడులకు మన ఊరు -మన బడి కార్యక్రమంతో ఊపిరిపోస్తున్నది. మసకబారిన ప్రభు త్వ విద్యకు జవసత్వాలు తీసుకొచ్చింది. విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటు గా సర్కారు బడులను బలోపేతం చేస్తున్నది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. ప్రతి పాఠశాలలోనూ నూతన తరగతి గదులు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్లను నిర్మిస్తున్నది. వీటితోపాటు విద్యార్థులు, సిబ్బందికి సరిపోయే ఫర్నిచర్, గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీల నిర్మాణం తదితర పనులను చేపడుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ కింద అభివృద్ధి పనులను చేపట్టేందుకు మొదటి విడుతలో 464 పాఠశాలలు ఎంపిక కాగా.. ఇప్పటివరకు 54 పాఠశాలల్లో పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉండగా.. మిగిలిన బడుల్లో పనులు తుది దశలో ఉన్నాయి.
‘మన ఊరు-మన బడి’లో భాగంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. అవి..జిల్లెలగూడకు చెందిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, శివరాంపల్లికి చెందిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ నాలుగు బడుల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం రూ.రెండు కోట్ల నిధులను ఖర్చు చేయగా.. నిర్మాణ పనులు పూర్తై చివరి దశకు చేరుకున్నాయి. కాగా మొదటి విడుతలో 464 పాఠశాలలు ఎంపిక కాగా ..అందులోని 448 పాఠశాలలకు రూ. 97.88 కోట్ల అంచనా వ్యయంగా ఏర్పాటు చేసి పనులను చేపట్టారు. వీటి నిర్మాణానికి కలెక్టర్ అనుమతి ఇవ్వగా 54 బడుల్లో పనులు ప్రారంభమై పూర్తి అయ్యా యి. మరికొన్ని బడుల్లో పనులు జనవరి లోపు పూర్తై అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా 345 పాఠశాలలకు రూ.30 లక్షలకు లో బడి ఖర్చు చేస్తుండగా.. మిగతా 103 బడులకు రూ.30 లక్షలకు పైనే ఖర్చు చేస్తున్నారు.
మోడల్ పాఠశాలలుగా…
మండలానికి రెండు ‘మన ఊరు-మన బడి’కింద రంగారెడ్డి జిల్లాలోని ప్రతి మండలానికీ రెండు పాఠశాలల చొప్పున మొత్తం 27 మండలాల నుంచి 54 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా అధికారులు ఎంపిక చేశారు. వాటిలో ఇప్పటికే వంద శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 40 పాఠశాలల్లో పెయింటింగ్, ఎలక్ట్రికల్, టాయిలెట్స్ మొదలైన పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల 60% పనులు పూర్తయ్యాయి. 345 పాఠశాలలకు ఇంజినీరింగ్ విభాగం ద్వారా పనులు సాగుతున్నాయి. కాగా, 103 పాఠశాలల పనులు టెండర్ దశలో ఉన్నాయి.
త్వరలో అందుబాటులోకి..
జిల్లాలో మొదటి విడుత ఎంపికైన పాఠశాలల్లో 60% వరకు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం, 40 పాఠశాలల్లో పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. మిగతా అన్ని పాఠశాలల్లోనూ పనులను పూర్తి చేసి జనవరి 31 లోపు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే కార్పొరేట్ లుక్ వచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తున్నది. కొత్త హంగులు సంతరించుకుంటున్న పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఎంతో సుముఖంగా ఉన్నారు.
– సుశీందర్రావు, డీఈవో రంగారెడ్డి
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయి. సర్కారు స్కూళ్లు సకల వసతులతో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మొదటి విడుతలో పనులు పూర్తైన 41 ప్రభుత్వ బడులను ఈనెలాఖరులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బడులు అన్ని రకాల వసతులతో ఆకట్టుకుంటున్నాయి. ‘మన ఊరు- మన బడి’లో భాగంగా 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు పనులను చేపడుతున్నారు. మండలానికి రెండు, మున్సిపాలిటీకి ఒక స్కూల్ చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
రూ.ఐదు కోట్లు మంజూరు
వికారాబాద్ జిల్లాలో 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వాటిలో 371 బడుల్లో మొదటి విడుతలో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఇప్పటివరకు రూ.ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది. మొదటి విడుతలో ఎంపికైన బడుల్లో ఇప్పటివరకు 50 శాతానికి పైగా పనులు పూర్తి కాగా.. 41 బడులు పనులన్నీ పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉం డగా.. మిగిలిన పాఠశాలల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి.
ప్రారంభానికి సిద్ధంగా 41 బడులు
మొదటి విడుతలో ఎంపికైన బడుల్లో ఇప్పటివరకు 50శాతానికి పైగా పనులు పూర్తి కాగా.. 41 స్కూళ్లలో 100 శాతం పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులను మంజూ రు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రా రంభంలోపు మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నాం.
– రేణుకాదేవి, వికారాబాద్ డీఈవో