‘మాతాశిశువుల సంరక్షణకు తెలంగాణ సర్కార్ ప్రాధాన్యమిస్తున్నది.. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది.. అందుకోసమే ప్రభుత్వం గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది..’ అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని పూడూరులో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, కలెక్టర్ నిఖిలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గర్భిణుల్లో పోషకాహారం, రక్తహీనత లోపాన్ని అధిగమించేందుకే సర్కార్ ఈ కిట్లను పంపిణీ చేస్తున్నదన్నారు. తల్లీబిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 4,461 మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆడబిడ్డలకు మామగా, చంటిబిడ్డలకు తాతలా మారి వారి ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
పూడూరు, డిసెంబర్ 21 : తల్లిబాగుంటేనే బిడ్డ బాగుంటుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి నుంచి వర్చువల్గా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి హరీశ్రావు, ప్రశాంత్రెడ్డిలు పథకాన్ని ప్రారంభించిన అనంతరం పూడూరు మండల కేంద్రంలో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీని జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రూ.50కోట్లతో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించినందుకు మహిళాలోకం తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం నిర్మితం కావాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు.
వికారాబాద్ జిల్లాలోని గర్భిణుల్లో ఎనీమియా (రక్తహీనత) 79 శాతం ఉండడంతో జిల్లాను ఎంపిక చేశారన్నారు. 9 జిల్లాల్లో 1.25 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరనున్నదన్నారు. జిల్లాలోని 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు యూపీహెచ్ల్లో కలిసి 4,461 మందికి కిట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో కిట్టుకు రూ.1962ను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మాతాశిశు సంరక్షణకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్న ఘనత తెలంగాణ సర్కారుదేనన్నారు. ఇప్పటి వరకు 13,90,634 మంది లబ్ధిదారులకుగాను రూ.243 కోట్ల విలువ చేసే 12,85,563 కిట్లను పంపిణీ చేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గర్భిణుల వైద్యం కోసం సుమారు రూ.1500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
తల్లీబిడ్డల ఆరోగ్యం కోసమే : జడ్పీ చైర్ పర్సన్
తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి అన్నారు. సరైన పోషకాలు తీసుకోవడం వల్ల గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారని, దీంతో ఆపరేషన్ల అవసరం లేకుండా సహజ ప్రసవాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇటువంటి అద్భుత పథకాన్ని ఇప్పటివరకు దేశంలో ఎక్కడా అమలు చేయలేదన్నారు. గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న కిట్లను వాడుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు.
సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం : ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయిన తర్వాత ఇంటికి చేర్చే వరకు వైద్య సేవలందుతున్నాయన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రక్తహీనత సమస్యల వల్ల గర్భిణులు ప్రసవం సమయంలో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. న్యూట్రిషన్ కిట్ గొప్ప పథకమని, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
సర్కారు దవాఖానల్లో పెరిగిన బెడ్ల సంఖ్య : ఎమ్మెల్యే నరేందర్రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానల్లో సౌకర్యాలు మెరుగుపడ్డాయని కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. ప్రతి దవాఖానలో బెడ్లను పెంచి నాణ్యమైన వైద్యం అందిస్తున్న ఘనత రాష్ట్ర సర్కారుదేనన్నారు. అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇప్పటికే పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించడం మహిళలను వరమన్నారు. న్యూట్రిషన్ కిట్పై వైద్య సిబ్బంది గర్భిణులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ నిఖిల, జిల్లా వైద్యాధికారి పాల్వాన్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్వో జీవరాజ్, ప్రోగ్రాం ఆఫీసర్ మరియ, పీహెచ్ఎం లక్ష్మీ, డాక్టర్ సుధాకర్రెడ్డి, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మల్లేశం, ఎంపీటీసీ సల్మాబేగం, సర్పంచ్ నవ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
గర్భిణుల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. పోషకారాన్ని అందిస్తున్న రాష్ట్ర సర్కారుకు మహిళలమంతా రుణపడి ఉంటాం. గతంలో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడేవాళ్లం. రాష్ట్రం మొచ్చాక సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలందుతున్నాయి.
– సబితా, గర్భిణీ, పూడూరు
పేదల్లో కొండంత భరోసా..
తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం వరంగా భావిస్తున్నా. పౌష్టికాహారం, మెరుగైన వైద్యం, ఉచితంగా మందులను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పేదల్లో కొండంత భరోసా నింపుతున్నది. గర్భిణులను దవాఖానలకు తీసుకెళ్లి ఇంటికి చేర్చేందుకు వాహనాలను ఏర్పాటు చేయడం సంతోషకరం.
– శంకరమ్మ, గర్భిణీ, పూడూరు
ఆరోగ్య ప్రదాత సీఎం కేసీఆర్..
గర్భిణులు, గర్భస్థ శిశువులు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లు అందజేయడం సంతోషంగా ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి మంచి పథకాలు తేలేదు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్న ఆరోగ్య ప్రదాత సీఎం కేసీఆర్. ఆయన పాలనలోనే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయి. తల్లీబిడ్డల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నారు. పోషకాహార కిట్టు అందించినందుకు సీఎం సార్కు కృతజ్ఞతలు.
-లత, గర్భిణి, సోమన్గుర్తి, పూడూరు