వికారాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర దశాబ్ది సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆమె సన్నాహక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఖర్చు చేసిన నిధులు, లబ్ధిదారుల వివరాలతో గ్రామగ్రామాన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో అమరుల స్థూపాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.
రాష్ట్రం ఏర్పాటై పదేండ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని, గడప గడపకూ ఉత్సవాలను తీసుకెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జూన్ 2 నుంచి 22 వ తేదీ వరకు నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల్లో .. సీఎం కేసీఆర్ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించిన అనంతరం బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. ఆ ప్రగతిని గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాల ని సూచించారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసేలా అన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా జూన్ 2న అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులర్పిస్తూ ప్రారంభమయ్యే ఉత్సవాలు జూన్ 22న అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్థూపం ఆవిష్కరణతో ముగుస్తాయన్నారు.
ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో జరిగిన అభివృద్ధిని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రగతిని పో ల్చుతూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని.. నూతన మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువైందన్నా రు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రుణమాఫీ, కేసీఆర్కిట్, ఆసరా పింఛన్లు, పల్లెప్రగతిలో భా గంగా ఆయా గ్రామాలకు వచ్చిన నిధులు, ఏయే పనులను పూర్తి చేశారనే వివరాలను గ్రామాల వారీగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నదాతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, ఒకప్పుడు రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ గత తొమ్మిదేండ్లుగా రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం అం దిస్తున్నదన్నారు.
నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్ట్ను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలులోనూ తెలంగాణ నంబర్ వన్ అని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. మిషన్ కాకతీయ కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని.. జిల్లాలోని అన్ని చెరువుల్లోనూ పుష్కలంగా నీరుండటంతోపాటు భూగర్భజలాలు కూడా పెరిగాయని, మత్స్యకారులు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారన్నారు. జిల్లాలో 21 రోజులపాటు నిర్వ హించనున్న ఉత్సవాల్లో ఆయా సంక్షేమ పథకాలతో ఏ విధమైన లబ్ధి జరిగిందనేది లబ్ధిదారులతో మాట్లాడించాలని, అదేవిధంగా ఈ ఉత్సవాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మెతు కు ఆనంద్, కాలె యాదయ్య, పట్నం నరేందర్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, ఆయా శాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
కుల వృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం..
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఇప్పటికే గొర్రెలు, చేపల పంపిణీ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా కుల వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిందని మంత్రి సబితా రెడ్డి తెలిపారు. త్వరలోనే విధివిధానాలు జారీ అవుతాయన్నారు. అదేవిధంగా వికారాబాద్ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చినందుకు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, గతంలో తాండూ రు చివరి గ్రామం నుంచి రంగారెడ్డి కలెక్టరేట్కు రావాలంటే ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు.. జిల్లా ఏర్పాటుతో జరిగిన మేలును ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా కొత్త మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీల్లోనూ సంబురాలను ఘ నంగా నిర్వహించాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని, జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ప్రభుత్వ డిగ్రీ, గురుకుల కాలేజీల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ఉత్సవాలను సక్సెస్ చేద్దాం ;వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి
జిల్లాలో దశాబ్ది ఉత్సవాలను గ్రామగ్రామాన సమన్వయంతో పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలను ముస్తాబు చేయాలన్నారు. అదేవిధంగా 97 రైతు వేదికల్లో రైతులతో సమావేశమై, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడంతోపాటు రైతులకు భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. పారిశ్రామిక ప్రగతిపై జిల్లాస్థాయిలో ఎక్స్పో నిర్వహించాలన్నారు. అదేవిధంగా నీటి పారుదల రంగంలో సాధించిన ప్రగతిపై ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ వెయ్యి మందితో సమావేశాన్ని నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా సబ్ డివిజిన్ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, పోలీస్స్టేషన్ల పరిధిలో పెట్రో ర్యాలీ, షీటీమ్స్, భరోసా, కళాబృందాలతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడంతోపాటు అన్ని ఠాణాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను సన్మానిస్తామన్నారు.
పాలమూరుతో జిల్లాకు తాగు, సాగు నీరు..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి జిల్లాకు తాగు, సాగు నీరందించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, సచివాలయం ప్రారంభించిన అనంతరం మొదటి సమావేశంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి సీఎం కేసీఆర్ తన చిత్తశుద్ధిని చూపారని కొనియాడారు. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటున్నది ఎవరనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాధించిన విజయం.. వేగంగా జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను డాక్యుమెంట్లు తీసి నియోజకవర్గ కేంద్రాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేసిన ప్రజలకు చూపించాలన్నారు. అదేవిధంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే చీకటి అవుతుందని కొందరు నాయకులు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించిందని.. తెలంగాణలో నేడు వెలుగులు విరజిమ్ముతున్నాయని ..24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా అవుతున్నదని, విద్యుత్తు రంగంలో సాధించిన విజయాన్ని గర్వంగా ప్రజలకు తెలపాలన్నారు. అంతేకాకుండా నాయీబ్రాహ్మణులు, రజకులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.