వికారాబాద్, జూన్ 12 : తెలంగాణ రాష్ర్టాభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ నేతృత్వంలో నిర్వహించిన 2కే రన్ను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డిలతో కలిసి ఆయన ఎన్టీఆర్ చౌరస్తాలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ఇతర రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పలు కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే దానికి కారణం మన ప్రాం తం సురక్షితమని తెలిపారు. మహిళల సంరక్షణకు ప్రభుత్వం షీటీమ్స్ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నదన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసుల పాత్ర ప్రశంసనీయమన్నారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 22న అమరుల స్మారకార్థం స్తూపాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమక్షంలో ప్రారంభిస్తారన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పోలీస్శాఖ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. పోలీసులకు నూతన వాహనాలను సమకూర్చిందని.. మహిళలు, ఆడ పిల్లల సంరక్షణకు షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. గ్రామాల్లో మూఢనమ్మకా లు, ఆత్మహత్యలకు పాల్పడకుండా కళాబృందాలతో అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం 2 కే రన్లో విజేతలుగా విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, ఆర్డీవో విజయకుమారి, జిల్లా వ్యవసాయాధికారి శాఖ గోపాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఉపేందర్, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ శ్రీను విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, వాకర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.