గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర్ అర్చకులు, బ్రాహ్మణులకు పలు వరాలు ప్రకటించడంపై సర్వత్రాహర్షం వ్యక్తమవుతున్నది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణులను గత ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ హయాంలోనే బ్రాహ్మణుల అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ధూప, దీప నైవేద్యం పథకాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరించడం, వేద పండితులకు గౌరవభృతి పెంపు, వేద పాఠశాలలకు ఏటా రూ. 2 లక్షల వార్షిక గ్రాంట్, కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి నిర్ణయాలతో బ్రాహ్మణులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తూ అందరి బంధువయ్యారు. బ్రాహ్మణుల శ్రేయస్సుకు అనేక కార్యక్రమాలు చేపడుతుండడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. మరిన్ని ఆలయాలకు పథకాన్ని విస్తరించడం గొప్ప విషయమని బ్రాహ్మణులు, అర్చకులు, వేద పండితులు పేర్కొంటున్నారు. రూ.6 వేల భృతిని రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించడంపై హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణుల సంక్షేమ నిధికి రూ.156 కోట్లను మంజూరు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని జీవితాంతం రుణపడి ఉంటామని బ్రాహ్మణులు పేర్కొంటున్నారు. వేదశాస్త్ర పండితులకు ఇస్తున్న గౌరవభృతిని పెంచడం, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
బ్రహ్మణ సదనాన్ని నిర్మించడం చారిత్రాత్మకం..
సీఎం కేసీఆర్ బ్రహ్మణ సదనాన్ని నిర్మించడం చారిత్రాత్మకమైన విషయం. దేశంలో ఎక్కడా లేని విధంగా 9 ఎకరాల్లో బ్రాహ్మణ సదనం నిర్మించడంతో బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. ప్రతి నెలా రూ.25 వందల నుంచి రూ.5 వేలకు భృతి పెంచడం, ధూప దీప నైవేద్యాలకు ఇచ్చే నగదును రూ.10 వేల కు పెంచడం సంతోషకరం. రాష్ట్రంలో అన్ని కూలాలను ఆదుకుంటూ, ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం మంచి పరిణామం. రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పరచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలో రావాలని కోరుకుంటున్నా.
– పద్మారావు పూజారి, శంకర్పల్లి
అద్భుత శైలితో దేవాలయాల అభివృద్ధి
రాష్ట్రంలో అద్భుత శైలితో దేవాలయాల అభివృద్ధి జరుగుతున్నది. యాదాద్రి పునర్నిర్మాణంపై హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాలను అభివృద్ధి చేస్తుండడం సంతోషకరం. అర్చకులకు ధూప, దీప నైవేద్య పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచిన సీఎం కేసీఆర్ ఔన్నత్యం నిజంగా అభినందనీయం. వేదం అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి మరువలేనిది. బ్రాహ్మణ సమాజానికి వివిధ పథకాలు, కార్యక్రమాల రూపంలో చేస్తున్న సహకారం, అందిస్తున్న ప్రోత్సాహం ఎప్పటికీ గుర్తుంటుంది. మంథనికి పూర్వకాలంలో ఉన్నటువంటి వైభవం ఇప్పుడు తెలంగాణ మొత్తానికి సీఎం కేసీఆర్ వల్ల మళ్లీ రావాలని కోరుకుంటున్నా.
– నాగేశ్వరశర్మ, తెలంగాణ వేద విధ్వత్ మహాసభల కార్యకర్త
హిందూధర్మ పరిరక్షణకు సీఎం కేసీఆర్ కృషి
ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ధూపదీప నైవేద్య పథకం వల్ల ఎన్నో దేవాలయాలకు మంచి రోజులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం దీపాలు, పూజలకు నోచుకోని దేవాలయాలు నేడు పూజలు, దీపాల అలంకరణ, నైవేద్యంతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం హర్షణీయం. గతంలో ఏ ప్రభుత్వం కూడా గ్రామాల్లో ఉన్న ఆలయాల అభివృద్ధికి చొరవ తీసుకోలేదు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయం వల్ల దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. భక్తులు కూడా దేవాలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. ప్రజల్లో భక్తిభావం పెరుగుతున్నది.
– జోషి సత్యనారాయణరావు, అర్చకుడు, బొంరాస్పేట
బ్రాహ్మణులంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు..
దూపదీప నైవేద్యం ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. గౌరవ వేతనాన్ని పెంచిన సీఎం కేసీఆర్కు బ్రాహ్మణులంతా రుణపడి ఉంటారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుండడం సంతోషంగా ఉన్నది. తాను ప్రస్తుతం యెల్లకొండ గ్రామంలోని పార్వతీపరమేశ్వరుడి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నా. ఇదే వృత్తితో జీవనం సాగిస్తున్నాం. ఉమ్మడి రాష్ర్టంలో బ్రాహ్మణులను గుర్తించినవారు లేరు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇంత మంచి ప్రభుత్వాన్ని చూడలేదు. రాష్ర్ట రాజధానిలో మాకు ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించి సముచిత గౌరవాన్ని ఇస్తుండడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నది.
బ్రాహ్మణాభ్యున్నతికి సీఎం కేసీఆర్ అండ..
బ్రాహ్మణులు చాలా కాలంగా ప్రభుత్వం ద్వారా గుర్తింపు లభించక అన్నింటా అభివృద్ధిని సాధించుకోలేక పోయాం. నేడు సీఎం కేసీఆర్ బ్రాహ్మణ అభ్యున్నతికి అండగా నిలుస్తూ.. అన్నింటా సౌకర్యాలను కల్పిస్తూ బ్రాహ్మణ సంఘానికి చేయూతను అందిస్తున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు రూ. 5లక్షల ఆర్థిక సాయం, వివేకానంద విదేశీ విద్య పథకంతో విదేశీ విద్యకు. రూ.20లక్షలు, రామానుజ పథకంతో ఫీజు రీయింబర్స్మెంట్, 65 సంవత్సరాలు నిండిన వేద పండితులు, బ్రాహ్మణులకు నెలకు రూ.5వేలు, హైదరాబాద్ నడి బొడ్డున రూ.12కోట్లతో బ్రాహ్మణ భవనం ఈ విధంగా బ్రాహ్మణుల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. సీఎం కేసీఆర్ త్పోడ్పాటుతో పేద బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.
– కృష్ణజోషి (కిట్టుస్వామి) వేద పండితులు, కొడంగల్
సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం..
బ్రాహ్మణ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దేశంలో ఎక్కడాలేని విధంగా బ్రాహ్మణ పరిషత్తును ఏర్పాటు చేయడం సంతోషకరం. బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు యావత్ బ్రాహ్మణ సమాజం రుణపడి ఉంటుంది.
– శ్రీపాద్, పూజారి, చేవెళ్ల
ఆలయాల అభివృద్ధి అద్భుతమే..
రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు మద్దతుగా నిలువడం సంతోషకరం. ధూప, దీప నైవేద్యం పథకాన్ని మరిన్ని దేవాలయాలకు విస్తరించడం మంచి నిర్ణయం. ఆలయాల అభివృద్ధి, విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న కృషి నిజంగా అద్భుతమే. వేములవాడ, చెరువుగట్టు వంటి ఎన్నో ఆలయాలపై ప్రజలకు గతంలో పెద్దగా అవగాహన లేదు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇలాంటి ఇంకా ఎన్నో ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో ఓ గొప్ప విజన్తో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. వేద పాఠశాలలకు ఏటా రూ.2 లక్షల వార్షిక గ్రాంట్ ఇస్తామని ప్రకటించడం హర్షణీయం. అయితే, వేద పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్ మంజూరు చేస్తే బాగుంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఎక్కువ గ్రాంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వేదం చదివే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వేదశాస్త్ర పండితులకు గౌరవభృతిని రూ.5 వేలకు పెంచడం సంతోషకరమైన విషయం.
– బ్రహ్మానందశర్మ, వేదవ్యాస పాఠశాల వ్యవస్థాపకులు,
నవోదయ ఎన్క్లేవ్.. కుంట్లూరు
బ్రాహ్మణుల అండదండలు.. ఆశీస్సులు ఎప్పుడు కేసీఆర్కే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బ్రాహ్మణులకు, దేవాలయాలకు సరైన గుర్తింపు లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఏండ్లుగా అనేక ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాలకు నోచుకోలేదు. వేదపండితులకు గౌరవ వేతనం ఇచ్చి సరైన గుర్తింపు తీసుకొచ్చారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల కోసం ప్రత్యేక సదనాలను ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయం యావత్తు బ్రాహ్మణ లోకాన్ని ఆనందపర్చేలా ఉన్నది. పురోహితులకు రూ.2500 వేత్తనాన్ని రూ.5వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం బ్రాహ్మణులకు ఎంతో మనోధైర్యాన్నిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు బ్రాహ్మణుల అండదండలతో పాటు ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి.
– చంద్రశేఖర్, పురోహితుడు(ఇబ్రహీంపట్నం)
గొప్ప పరిపాలన దక్షుడు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పరిపాలన దక్షుడు, కారణ జన్ముడు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న యాగాలతోనే ప్రకృతి విపత్తులు తొలగి సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది. తెలంగాణ వచ్చాకే బ్రాహ్మణులకు సమాజంలో మరింత గౌరవం పెరిగింది. బ్రాహ్మణుల సంక్షేమ నిధికి రూ.156 కోట్లను మంజూరు చేసిన ఘనత కేసీఆర్కే దక్కింది. పేద బ్రాహ్మణులను అందుకోవడంతో పాటు, బ్రహ్మణ విద్యార్థులు విదేశీ చదువులకు వెళ్లేందుకు ఆర్థిక సాయం చేస్తూ మా అందరిలో కొండంత భరోసాను నింపిన వ్యక్తి కేసీఆర్. దీంతో పాటు బ్రాహ్మణ భవనం ఏర్పాటు చేయడం సంతోషకరం. దీపధూప నైవేద్యాలకు రూ.10వేలు ఇస్తున్నారు. మాన్యులు కేసీఆర్ వచ్చాకే బ్రాహ్మణుల స్థితిగతులు మారాయి. కేసీఆర్ ఒక్క కారణ జన్ముడు.
– రవిశర్మ, బ్రాహ్మణ సేవ సమాఖ్య అధ్యక్షుడు, షాద్నగర్
ధర్మ రక్షకుడు సీఎం కేసీఆర్..
దేశ చరిత్రలో ముందెన్నడు లేని విధంగా బ్రాహ్మణుల కోసం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ఏర్పాటు చేసి పీఠాధిపతులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించడం ఎంతో గొప్ప విషయం. హిందూ ధర్మం, దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు అందించడంలో బ్రాహ్మణులు కీలక పాత్ర వహిస్తున్నారు. అటువంటి బ్రాహ్మణుల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడడం అంటే ధర్మాన్ని పరిరక్షించడమే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని గోపన్పల్లిలో రూ.12 కోట్లతో విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. దేశంలో ఇంతవరకు ఏ నాయకుడు ఇలాంటి కార్యానికి పూనుకోలేదు. సర్వ మతాలను సమదృష్టితో చూస్తున్న కేసీఆర్కు ఎవరు సాటిలేరని నిరూపించుకున్నారు. ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
– సుధీంద్ర దేశ్పాండే,ఉత్తరాదిమఠం,తాండూరు
బ్రాహ్మణులకు అగ్రతాంబూలం..
ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులపై వరాల జల్లును కురిపిస్తూ అగ్రతాంబూలం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో విప్రహిత బ్రహ్మణ సదనం ప్రారంభించే ఘట్టం చరిత్రలో నిలిచిపోతుంది. ఆలయాల్లో నిత్య పూజల కోసం ధూపదీప నైవేద్య పథకంలో అర్చకులకు నెలకు ఇచ్చే రూ.6 వేలను భృతిని రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించడం హర్షణీయం. బ్రహ్మణ పరిషత్ ద్వారా వేద పండితులకు ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుండి రూ.5 వేలకు పెంచడం అభినందనీయం.
-ఎల్లికంటి జ్ఞానప్రసూనశర్మ, ప్రముఖ రచయిత, కడ్తాల్ మండలం
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు..
విప్రహిత బ్రాహ్మణ సదనం ఏర్పాటు, బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. బ్రాహ్మణ సదన్ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ దేశంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ధర్మం, దేశాన్ని కాపాడే మహోత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. దేశంలోని 12 జోతిర్లింగాలకు చెందిన పండితులు, పురోహితుల ఆశీర్వాదం కేసీఆర్కు లభించింది. మున్ముందు మరెన్నో విజయాలు సాధిస్తారు.
– పురంధరచార్, బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘం అధ్యక్షుడు, తాండూరు
మనసున్న మహనీయుడు సీఎం కేసీఆర్..
వేద పండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచడంతో పాటు ధూప, దీప నైవేద్యం కింద ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 3645 దేవాలయాలతో పాటు మరో 2796 దేవాలయాలకు ధూప, దీప నైవేద్యం పథకం వర్తింప జేయడం అభినందనీయం. ధూప, దీప నైవేద్యం పథకం ద్వారా దేవాలయాల నిర్వహణకు అర్చకులకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని ఇక నుంచి రూ.10 వేలకు పెంచుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉన్నది. సర్వమతాలను సమానంగా చూస్తూ సమసమాజ నిర్మాణానికి బాసటగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు అంతా మంచే జరుగుతుంది. అన్నింటిలో విజయం సాధిస్తారు.
– విజయ్కుమార్, భద్రేశ్వర దేవాలయం పూజారి, తాండూరు
సీఎం కేసీఆర్కు మరింత శక్తి రావాలి
దేవాలయాల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మరింత శక్తి రావాలి. ఆయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి. బ్రాహ్మణుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వారికి మద్దతుగా నిలువడం చాలా సంతోషకరమైన విషయం. బ్రాహ్మణులకు ఆర్థికంగా అండగా నిలుస్తుండటం అభినందనీయం. వేదశాస్త్ర పండితులకు ప్రతినెలా ఇచ్చే గౌరవభృతిని రూ.5 వేలకు పెంచడం గొప్ప విషయం. ధూప, దీప నైవేద్యం పథకం కింద మరిన్ని ఆలయాలను చేర్చడం ద్వారా దేవాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఫీజు రియంబర్స్మెంట్తో నిరుపేద బ్రాహ్మణులు ఉన్నత విద్య చదువుకునే అవకాశం కల్పిస్తుండటం మంచి కార్యక్రమం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఊరికి చేరడం ద్వారా బ్రాహ్మణులు జీవనోపాధి పొందే అవకాశాలు మరింత పెరుగుతాయి. వారి జీవనశైలి మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మునుముందు సీఎం కేసీఆర్ మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాం.
– జనమంచి శేఖర్శర్మ, పురోహితులు
బ్రాహ్మణ సదన్ నిర్మించడం అభినందనీయం
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో బ్రాహ్మణ సదన్ భవనం నిర్మించడం అభినందనీయం. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అనువంశిక అర్చకుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం సంతోషంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చకులు, ఆలయ ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. దేశంలో బ్రాహ్మణ సదనం ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రతి నెలా ఇచ్చే భృతిని రూ. 2500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి అర్హత వయస్సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గిస్తున్నామని ప్రకటించడం అభినందనీయం. ధూప దీప స్కీమ్ను ప్రతి నెలా ఇచ్చే నగదును రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచి బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఐఐటీ, ఐఐఎమ్లో సీటు ఇచ్చి బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరం. బ్రాహ్మణులు లోకకల్యాణం కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంటాం.
– సీఎస్ రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు
బ్రహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎం..
గోపన్పల్లిలో 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో విప్రహిత బ్రాహ్మణ సదనం ఏర్పాటు చారిత్రాత్మకం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భవనం నిర్మించడం గొప్ప విషయం. పీఠాధిపతులు, ధర్మాచార్యులకు విడిది కేంద్రంగా, పేద బ్రాహ్మణ కల్యాణాలు నిర్వహించేందుకు భవనం ఉపయోగపడనున్నది. హిందూ ధర్మాన్ని పరిరక్షించే మొదటి వ్యక్తిగా సీఎం కేసీఆర్కు ఆ కీర్తి దక్కుతుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు మన సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారు. ఇది అన్ని వర్గాల ప్రజలు స్వాగతించాల్సిన సందర్భం. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారు.
– దొడ్ల రాములు గౌడ్, ఆధ్యాత్మిక గురువు, కవి, రచయిత, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
హ్మణుల అభివృద్ధికి సీఎం కృషి..
బ్రాహ్మణుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. అర్చకులు, బ్రాహ్మణులపై శ్రేయస్సు కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి.. కేసీఆర్. రూ.12 కోట్లతో బ్రాహ్మణ సదన్ భవనం నిర్మించడం సంతోషించదగ్గ విషయం. బ్రాహ్మణుల్లో పేదవారిని ఆదుకోవడం కోసం బ్రాహ్మణ పరిషత్తును ఏర్పాటు చేసి నిధులు కేటాయించడం, పేద బ్రాహ్మణుల జీవనోపాధికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నది. దీనితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం ద్వారా పూజలు చేసి దీపారాధన చేయడానికి అర్చకులకు నెలకు రూ.10 వేలు ఇవ్వనుండడం సంతోషంగా ఉన్నది. దీనివల్ల ఎంతో అర్చకులకు జీవనోపాధి లభించనున్నది. ఈ పథకాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయం.
– లోకుర్తి జయతీర్థాచారి, ధూపదీప నైవేద్య అర్చక సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
అనంతపద్మనాభస్వామి దీవెనలు సీఎం కేసీఆర్కు ఉంటాయి..
హిందూ దేవాలయాల్లో ధూప దీపనైవేద్యం కోసం అర్చకులకు రూ.6వేలు అందిస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం రూ.10వేలకు పెంచడం సంతోషంగా ఉన్నది. ఔత్సాహికులు, చదువుకునే వారికి తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించడం శుభపరిణామం. సీఎం కేసీఆర్పై అనంతపద్మనాభస్వామి దీవెనలెప్పుడూ ఉంటాయి.
-పద్మనాభం, అనంతపద్మనాభస్వామి ఆలయ ధర్మకర్త, వికారాబాద్