వికారాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు మార్గం సుగమమైంది. నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల జాతర మొదలుకానున్నది. వచ్చే నెల 3 వరకు నిర్వహించనున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బదిలీలకు సంబంధించి ఒకేచోట ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. సెప్టెంబర్ 1 నాటికి ఒకే చోట రెండేండ్లపాటు పనిచేస్తున్న వారికి బదిలీలకు కనీస అర్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టనున్నారు. తదనంతరం జీహెచ్ఎంల బదిలీలతో ఏర్పడిన ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించనున్నారు. తదనంతరం స్కూల్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియను చేపట్టనున్నారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీతో ఏర్పడిన ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నారు. తదనంతరం అర్హులైన మిగిలిన ఉపాధ్యాయ బదిలీలను పూర్తిచేసి, మిగిలిన ఖాళీలను టీఆర్టీ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనున్నది.
జిల్లాలో 903 మంది ఉపాధ్యాయుల బదిలీ
ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం షెడ్యూల్ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఈ నెల 5 వరకు బదిలీలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న కాపీలను ఎంఈవో, డీఈవోలకు అందజేయాలి. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల సీనియార్టీ జాబితాను, స్కూళ్ల వారీగా ఖాళీల జాబితాను వెలువరించాలి. ఈ నెల 6 నుంచి 7 వరకు దరఖాస్తులను డీఈవో పరిశీలన చేస్తారు. ఈ నెల 8, 9 తేదిల్లో బదిలీలు, పదోన్నతుల సీనియార్టీ జాబితాను ప్రకటించి, జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 12, 13 తేదిల్లో పదోన్నతులు, బదిలీల తుది జాబితాను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. అనంతరం జీహెచ్ఎంల బదిలీల ప్రక్రియ, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు, బదిలీలు, జీహెచ్ఎంలకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వచ్చే నెల 3 వరకు పూర్తి చేయనున్నారు.
ఖాళీల్లో మిగిలినవి టీఆర్టీ ద్వారా భర్తీ
జిల్లాలో 4646 ఉపాధ్యాయ పోస్టులుండగా ప్రస్తుతం 3917 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరో 729 పోస్టులు ఖాళీలున్నాయి. నేటి నుంచి చేపట్టనున్న బదిలీల ప్రక్రియతో ఏర్పడిన ఖాళీల్లో పదోన్నతులు కల్పించనున్నారు. పదోన్నతులు కల్పించిన అనంతరం ఉన్న ఖాళీలను టీఆర్టీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరిలో జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం మరోసారి దరఖాస్తులకు అవకాశమివ్వడంతోపాటు దరఖాస్తుల సవరణకు కూడా అవకాశమిచ్చింది. జిల్లావ్యాప్తంగా దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న 903 మంది ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. తప్పనిసరిగా స్థానచలనం అయ్యేవారిలో ఐదేండ్లపాటు ఒకేచోట పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు-44 మంది ఉండగా, మరో 859 మంది ఉపాధ్యాయులు ఎనిమిదేండ్లపాటు ఒకేచోట పనిచేస్తున్నవారు బదిలీ కానున్నారు. వీరితోపాటు మరికొంత మంది అర్హులు బదిలీ కానున్నారు.
తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు
903 మంది ఉపాధ్యాయుల బదిలీల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు-44, స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్)-49, స్కూల్ అసిస్టెంట్(ఫిజిక్స్)-43, స్కూల్ అసిస్టెంట్(బయోసైన్స్)-31, స్కూల్ అసిస్టెంట్(సోషల్)-36, స్కూల్ అసిస్టెంట్(తెలుగు)-20, స్కూల్ అసిస్టెంట్(హిందీ)-15, స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లిష్)-33, స్కూల్ అసిస్టెంట్(పీడీ)-1, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు-26, ఎల్పీ(తెలుగు)-23, ఎల్పీ(హిందీ)-32, ఎల్ఎఫ్ఎల్(ఉర్దూ)-1, ఎస్జీటీ-545, పీఈటీలు-3, ఒక్యూలర్ ఇన్స్ట్రక్టర్-ఒక్కరు తప్పనిసరిగా బదిలీకానున్నారు.
ఆన్లైన్ ప్రక్రియను, ప్రమోషన్లను స్వాగతిస్తున్నాం ;– అబ్దుల్ హక్, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొడంగల్
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ఆన్లైన్ ద్వారా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నాం. జిల్లాల ఏర్పాటు తరువాత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చాలా మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు అందుకునే అవకాశం ఏర్పడింది. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగక ప్రమోషన్లకు దూరమయ్యారు. అదేవిధంగా అనుకున్న ప్రదేశానికి బదిలీ చేసుకునే వీలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రక్రియ నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. త్వరగా పూర్తి చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది.
పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సంతోషం ;- బి.జైపాల్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తాండూరు
రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. హైకోర్టు టీచర్ల బదిలీలకు పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఆలస్యం చేయకుండా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయడం అభినందనీయం. ఎంతో మంది ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది. ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలుగుకుండా వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడికి మేలు చేయాలి. బదిలీలు, పదోన్నతులను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
చాలాకాలంగా ఎదురుచూపు ;- వేణుగోపాల్, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొడంగల్
బదిలీలు, ప్రమోషన్లకు కోసం ఉపాధ్యాయులంతా చాలాకాలంగా ఎదురు చూస్తున్నాం. గత 9 సంవత్సరాలుగా ప్రమోషన్లు, 5 సంవత్సరాలుగా బదిలీల ప్రక్రియ కొనసాగకపోవడంతో చాలా వరకు నష్టపోయాం. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ నిర్వహిస్తున్నందుకు స్వాగతిస్తున్నాం. ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరగా పూర్తి చేస్తే ఉపాధ్యాయులకు అనుకూలంగా ఉంటుంది.