రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సజావుగా జరిగింది. వికారాబాద్ జిల్లాలో 94.76 శాతం పోలింగ్ నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 86.9 పోలింగ్ శాతం నమోదైంది. రెండు జిల్లాల్లో 11075 ఓట్లకుగాను 9670 ఓట్లు పోలయ్యాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ నిర్వహించారు. రెండు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాలను రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి పోలీసు బందోబస్తును నిర్వహించారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను సరూర్నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించారు. ఈనెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నది.
వికారాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): జిల్లాలో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పోలిం గ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 8 నుంచి సా యంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. జిల్లాలో 18 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలిం గ్ సరళిని పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించి, పోలింగ్ సరళిపై ఆరాతీశారు. కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద నలుగురు ఏఎన్ఎంలతో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను ఓట్ల లెక్కింపు కేంద్రమైన సరూర్నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనున్నది.
జిల్లాలో 94.76 శాతం..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి జిల్లా లో 94.76 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలోని పెద్దేముల్, దోమ, బొంరాస్పేట మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో స్వల్పంగానే పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం వరకు పుంజుకున్నది. ఉదయం 10 గంటల వరకు 16.19 శాతం, మధ్యాహ్నం 12 గంటల వరకు 46.50 శాతం, మధ్యా హ్నం 2 గంటల వరకు 79.94 శాతం, సాయంత్రం 4 గంటల వరకు 94.76 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో 1,890 ఓట్లుండగా 1,791 ఓట్లు పోలయ్యాయి. 1,231 పురుషులకు గాను 1172 ఓట్లు, 659 మహిళా ఓట్లకుగాను 619 ఓట్లు పోలయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సజావుగా ముగిసింది. జిల్లాలో 31 కేంద్రాలు ఏర్పాటు చేయగా 86.9 శాతం పోలింగ్ నమోదైంది. బరిలో 21 మంది అభ్యర్థులు ఉండగా వారి భవితవ్యం ఈ నెల 16న తేలనున్నది. జిల్లా లోని మూడు మండలాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. కాగా రంగారెడ్డి జిలల్లాలో 9,186 మంది ఓటర్లున్నారు. అందులో 4,870 మంది పురుషులు, 4,315 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు. కాగా రంగారెడ్డి కలెక్టర్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.
ఎన్నిక ప్రశాంతం : రంగారెడ్డి కలెక్టర్
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 86.9 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఉదయం 10 గంటల వరకు 15.2% నమోదు కాగా.. 12 గంటలకు 43.8%, మధ్యాహ్నం 2 గంటలకు 65.5 %, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తై 86.9% నమోదైనది. ఓట్ల లెక్కింపు ఈ నెల 16వ తేదీన సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది.