శేరిలింగంపల్లి, జూలై 29 : స్కూటీపై వెళ్తున్న ఐటీ ఉద్యోగినిని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఆమె దుర్మరణం చెందిన ఘటన రాయదుర్గం ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఇరువురి శాలిని (38), భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలు సుదీక్ష, సహస్రతో కలిసి మణికొండలో నివాసం ఉంటున్నది. శాలిని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుండగా కొంతకాలంగా భర్త వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నాడు.
కాగా, మంగళవారం ఉదయం ఇంటి వద్ద స్కూల్ బస్సు మిస్ కావడంతో ఇద్దరు పిల్లలను తన స్కూటీపై ముందు ఉన్న బస్టాప్లో బస్సు ఎక్కించిన శాలిని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో మణికొండ సుందర్ గార్డెన్ సమీపంలో వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలవడంతో శాలిని అక్కడికక్కడే మృతిచెందింది. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శాలిని తమ్ముడు తమ్మినేని లోకేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.