తాండూరు రూరల్ : ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో ప్రతీ కూలీకి పని కల్పించాలని, గ్రామాల్లో చేపట్టిన నర్సరీలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్డీవో కృష్ణణ్ అన్నారు. బుధవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలకు చెందిన ఉపాధి హామీ పథకం అధికారులు, ఆయా మండలాల అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనులు వేగంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జాబ్కార్డు ఉన్న ప్రతీ కూలీకి గ్రామాల్లో పని కల్పించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అధికారులు తీసుకోవాలని సూచించారు. కొన్ని గ్రామాల్లో కల్లాల నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ ఇంకా చాలా గ్రామాల్లో కల్లాల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు.
ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా గ్రామాల్లోని నర్సరీలను పక్బందీగా నిర్వహించాలన్నారు. అన్ని నర్సరీల్లో విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నర్సరీలను తరచూ పరిశీలిస్తూ ఉండాలన్నారు. అంతేగాకుండా కంపోషేడ్లు ఎక్కడెక్కడ పూర్తికాలేదో త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శ్మశానవాటికల నిర్మాణాలు చాలా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వీటి నిర్మాణాల్లో సర్పంచ్ల సహకారం తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సుదర్శన్రెడ్డి, లక్ష్మప్ప, ఎంపీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.