తాండూరు రూరల్ : తాండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా పట్టణంలోని ఇందిరా చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే స్వయంగా ఇందిరాచౌక్ నుంచి రైల్వేస్టేషన్ వరకు పాదయాత్రగా వెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులతో మాట్లాడారు. పట్టణం మరింత అభివృద్ధి సాధించాలంటే పట్టణ వాసులు రోడ్డు విస్తరణకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. అందుకు ఎంఐఎం నాయకులు హాదీ భవనాన్ని రోడ్డు విస్తరణ కోసం కూల్చి వేసేందుకు అంగీకరించారు. హాదీకి చెందిన భవనం ముందు ఎమ్మెల్యే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పట్టణంలో సీసీ రోడ్లుతో పాటు అంతర్గత రోడ్లు, పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ధే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్కుమార్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు నయ్యూం, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.