తాండూరు రూరల్ : అనుమతులు లేకుండా బయో డీజిల్ను విక్రయిస్తున్న బంకును రెవెన్యూ అధికారులు, పోలీసులు మంళవారం సీజ్ చేశారు. తాండూరు మండలం, గౌతాపూర్ గ్రామ సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్లో వెంకటేష్, రాంశేట్టి అనే వ్యక్తులు కొంతకాలంగా అనుమతులు లేకుండా బయోడీజిల్ను కర్నాటక, మహారాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని బంకు ద్వారా లారీలు, జీపులకు, ఆటోలకు విక్రయిసున్నారు. ఇండియన్ అయిల్, హెచ్పి బంకుల నుంచి లభించే డీజిల్ కంటే బయో డీజిల్ లీటర్కు రూ. 10 తక్కువగా లభిస్తోంది. దీంతో లీటర్కు రూ. 10 చొప్పున నిర్వహకులకు లాభం వస్తోంది. బంకు నిర్వహకులు గ్రామ పంచాయతీ, రహదారుల, రెవెన్యూ, పెట్రోలియం అధికారుల అనుమతులు లేకుండా బంకు కొనసాగిస్తున్నారు. సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలకు కూడా డీజిల్ విక్రయిస్తున్నారు.
అక్రమంగా బయోడీజిల్ బంకు కొనసాగుతున్నట్లు తాసిల్దార్ చెన్నప్పలనాయుడికి ఫిర్యాదు అందింది. దీంతో మంగళవారం ఆర్ఐ రాజురెడ్డి, కరణ్కోట ఎస్సై ఏడుకొండలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిర్వాహకులు వెంకటేష్, రాంశెట్టిలను నిలదీయగా ఎలాంటి అనుమతులు లేవని వారు ఒప్పుకున్నారు. తమ సొంత వాహనాలకు ట్రాయల్ రన్ చేస్తున్నామని వారు తెలిపారు. సొంత లారీల్లో డీజిల్ పోసుకొని నడుపుతున్నామని, వ్యాపారం చేయడం లేదని వారు స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా బంకు నిర్వహించరాదని ఆర్ఐ రాజు తెలిపారు. బంకులో డీజిల్ 3వేల లీటర్ల ఉందని తేల్చారు. ప్రస్తుతం బంకు నుంచి డీజిల్ విక్రయించరాదని ఆర్ఐ సూచించారు. ఎస్సై ఏడుకొండలు, ఆర్ఐలు బంకుకు తాళం వేయించారు. సివిల్ సప్లయ్ అధికారులు వచ్చి మరోసారి పరిశీలిస్తారని వారు స్పష్టం చేశారు.
మరో రెండు బంకులను పరిశీలించిన అధికారులు
గౌతాపూర్ సమీపంలోని పార్థసారధి ట్రాన్స్పోర్టుతో పాటు రిలయన్స్ పెట్రోల్ బంకు ఎదురుగా మరో బంకు అక్రమంగా కొనసాగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆర్ఐ రాజు, ఎస్సై ఏడుకొండలు విచారణ చేపట్టారు. అయితే పార్థసారధి ట్రాన్స్పోర్టులో ఉన్న బంకుకు అన్ని అనుమతులు ఉన్నాయని పీఎస్ఎల్ మేనేజర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. అనుమతి పత్రాలు రెవెన్యూ, పోలీసులకు అందజేస్తామని తెలిపారు. అదే విధంగా రిలియన్స్ పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న మరో బంకును కూడా అధికారులు పరిశీలించగా, అక్కడే ఎలాంటి పరికరాలు లేవని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతానే బంకు ఏర్పాటు చేస్తామని నిర్వహకులు అధికారులకు తెలిపారు.