‘పది’లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న బొట్టవానితండా ఆశ్రమ పాఠశాల
ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం : ప్రధానోపాధ్యాయుడు
ఆనందంగా ఉంది: జిల్లా గిరిజన సంక్షేమాధికారి
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
వికారాబాద్ జిల్లాలోని మరో రెండు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోనూ ఈసారి వందశాతం ఉత్తీర్ణత
బొంరాస్పేట, జూలై 7: జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు టెన్త్లో ఉత్తమ ఫలితాలను సాధించాయి. మెరుగైన విద్యా బోధనతో రెండు ఆశ్రమ పాఠశాలలు, ఒక వసతి గృహం వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడు గిరిజన ఆశ్రమ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీటిలో ఈ ఏడాది మేలో జరిగిన ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో బొంరాస్పేట మండలం బొట్ల వానితండా ఆశ్రమ పాఠశాల(బాలికల), చౌడాపూర్ మండలం కొత్తపల్లి ఆశ్రమ పాఠ శాల(బాలుర), పరిగి ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణుల య్యారు. వీటిలో బొట్లవానితండా బాలికల ఆశ్రమ పాఠశాల వరుసగా మూడుసార్లు వందశాతం ఉత్తీర్ణతతో హ్యాట్రిక్ సాధించింది. పాఠశాలకు చెందిన 57 మంది విద్యార్థి నులు ఈ ఏడాది 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. వీరిలో నాగలక్ష్మి అనే విద్యార్థిని 10 జీపీఏ మార్కులు సాధించడం గమనార్హం. 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లోనూ ఈ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. చౌడాపూర్ మండలం కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో కూడా 36 మంది విద్యార్థులు, పరిగి బాలుర వసతి గృహంలో ఉంటూ 22 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఆశ్రమ పాఠశాలల్లో మంచి ఫలి తాలు రావడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రణాళికాబద్ధ బోధనతోనే..
ఆశ్రమ పాఠశాలల్లో విద్యా బోధన ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నది. పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్లు లేకపోయినా సీఆర్టీలను నియమించి విద్యార్థులకు మెరుగైన పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. ఉన్నతాధికారులు తరచూ పాఠశాలలను సందర్శిస్తూ వాటి స్థితిగతులు, భోజనం, వసతి సౌకర్యం, విద్యా బోధనను నిశితంగా గమనిస్తుంటారు. పదవ తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సిలబస్ను సకాలంలో పూర్తిచేసి నవంబర్ నుంచే రివిజన్ ప్రారంభిస్తారు. జనవరి నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తారు. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ను అందజేస్తారు. అవసరమున్న చోట ట్యూటర్లను నియమిస్తారు. ప్రత్యేక తరగతుల నిర్వ హణ సమయంలో విద్యార్థులు మానసికంగా అలసిపోకుండా వారికి అల్పాహారం అం దించి చురుకుగా ఉండేలా చూస్తారు.
గిరిజన సంక్షేమ శాఖ పారితోషికం
ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటూ చదువుతూ టెన్త్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలను గిరిజన సంక్షేమ శాఖ ప్రోత్సహిస్తున్నది. 10 జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థి ఉన్నత చదువుకు రూ.50 వేలు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.20 వేలు పారితోషికం అందిస్తున్నది. హెచ్ఎంలు వాటిని పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయాలి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మంచి ఫలితాలు వస్తుండటంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వాటిలో చేర్పించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ఆశ్రమ పాఠశాలల్లో కూడా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేస్తున్నది.
ఆనందంగా ఉంది
జిల్లాలోని రెండు ఆశ్రమ పాఠశాలలు, ఒక వసతి గృహంలోని విద్యార్థులు ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన ఆయా పాఠశాలల హెచ్ఎంలు, టీచర్లను అభినందిస్తున్నా. విద్యార్థులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నాం. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి. బొట్ల వానితండా ఆశ్రమ పాఠశాలలో 10 జీపీఏ సాధించిన నాగలక్ష్మి అనే విద్యార్థినికి త్వరలో మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా రూ.50 వేల నగదు ప్రోత్సాహాన్ని అందజేస్తాం. -కోటాజీ, జిల్లా గిరిజన సంక్షేమాధికారి
ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం
ఆశ్రమ పాఠశాలలో ఈ ఏడాది వందశాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉంది. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యా ర్థులకు పాఠాలు బోధించి ప్రత్యేక తరగతులు నిర్వహించాం. ఉపా ధ్యాయులు కూడా బాధ్యతతో పని చేయ డంతో ఇది సాధ్యమైంది. ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం
–రాథోడ్ విక్రంసింగ్, హెచ్ఎం, బొట్లవానితండా ఆశ్రమ పాఠశాల.