ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 25 : వేసవిలో ఏదైనా పనిపై బయటకు వెళ్లొస్తే చాలు త్వరగా అలసిపోతాం. చెమట విపరీతంగా పోయి, శరీరంలో నీటిశాతం తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరిగి, జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ సమయంలో నాలుగు తాటిముంజలు తింటే తాపం తగ్గుతుంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
ఈ తాటిముంజలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి, శరీరానికి కావల్సిన న్యూట్రియంట్లను బ్యాలన్స్ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాటిముంజలకు భలే క్రేజీ ఉంటుంది. వేసవికాలంలో లభించే ఈ తాటిముంజలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తీసుకుంటున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు తాటిముంజలు భలే ఉపయోగపడుతాయి. తాటి ముంజల్లో శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్యులు.
తాటి ముంజలు పూర్తిగా ఆర్గానిక్ పుడ్. ఎలాంటి ఎరువులు, మందులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా దొరికే ఫలాల్లో ఇది ఒకటి. ఇవి సర్వరోగ నివారిణి. గ్రామీణ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పెరిగే తాటిచెట్లు (పరుపుతాళ్లు) మార్చి నెలలో గెలలు వేస్తాయి. గీత కార్మికులు కల్లు గీయగా వదిలేసిన గెలలు ముంజలుగా వృద్ధి చెందుతాయి. మే నెలలో ముంజలు విరివిగా దొరుకుతాయి.
ఈ సీజన్లో వాటిని తినడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ తాటి ముంజలను గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇష్టపడుతారు. తాటి ముంజలను నగరానికి తీసుకుపోయి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు గీతకార్మికులు. డజన్ ముంజలను రూ.40 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు.