మంచాల, డిసెంబర్ 10 : బుగ్గ జాతరకు ఆదివారం భక్త జనం పోటెత్తారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. 13వ రోజు కూడా ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. కుటుంబసమేతంగా స్వామివారి సన్నిధానంలోని గుండంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ సమీపంలోని నర్సింహబాబా, నాగన్న పుట్టతో పాటు కబీర్దాస్ మందిరాన్ని దర్శించుకున్నారు.
ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున వాహనాల్లో జాతరకు చేరుకోవడంతో ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర వాహనాలతో నిండిపోయాయి. వందలాది మంది భక్తులు కుటుంబసమేతంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. మహిళలు ఆలయ ఆవరణలో కార్తిక దీపాలను వెలిగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి అన్ని సౌకర్యాలు కల్పించారు. పలు శాఖల అధికారులు కూడా సెలవు రోజు అయినా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు.
సీఐ కాశీవిశ్వనాథ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూశారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి భక్తుల సౌకర్యార్థం రామలింగేశ్వరస్వామి ఆలయం వరకు ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అక్కడే వండుకొని భోజనాలు చేశారు.